నవ వధువు ఆత్మహత్య

10 Sep, 2018 13:00 IST|Sakshi
ధారూరు: తాడుతో దూలానికి  ఉరివేసుకున్న అనురాధ

ధారూరు (రంగారెడ్డి): పెళ్లయిన నాలుగు నెలలకే ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ధారూరు మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ నాగేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. బంట్వారం గ్రామానికి చెందిన రాజు తల్లిదండ్రులు 12 సంవత్సరాల క్రితం ధారూరుకు వచ్చి 2.20 ఎకరాల భూమిని తీసుకుని సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్దకుమారుడు రాజుకు ఏప్రిల్‌ 25వ తేదీన పెద్దేముల్‌ మండలం ఇందూరు గ్రామానికి చెందిన అనురాధ (21)తో వివాహం జరిగింది. ఆ తర్వాత తల్లిదండ్రులు చిన్న కొడుకుతో కలిసి హైదరాబాద్‌ వెళ్లి అక్కడే కూలి పని చేసుకుంటున్నారు. రాజు పొలాన్ని సేద్యం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో కూలీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు.

కాగా రాజు ఆదివారం పొలానికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనురాధ దూలానికి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన రాజు తలుపులు తీసి చూడగా భార్య అనురాధ దూలానికి వేలాడుతూ కనిపించింది. వెంటనే రాజు ధారూరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాగా అనురాధ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని సీఐ చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు