కర్నూలు: కర్నూలు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన శిల్పా చక్రపాణిరెడ్డి సోమవారం శాసనమండలి చైర్మన్ చక్రపాణి యాదవ్ సమక్షంలో ఆయన చాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది మార్చి 17న జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున చక్రపాణిరెడ్డి పోటీ చేసి 62 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, మాజీ మంత్రి కె.ఇ.ప్రభాకర్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి తదితరులు హాజరై శిల్పాకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.