వీడిన చిక్కుముడి

27 Jun, 2016 08:23 IST|Sakshi

హతుడు జనార్దన్‌రెడ్డికాలనీ వాసి
మేమే హత్య చేశామని నిందితుల లొంగుబాటు?

 
 
నెల్లూరు (క్రైమ్): బుజబుజనెల్లూరు లింగాల చెరువుకట్టపై గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితి మృతి కేసు చిక్కుముడి వీడింది. మృతుడు వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డికాలనీకి చెందిన  వాడని, హత్యకు గురైనట్లు తేలింది. వివరాల్లోకి వెళ్లితే.. వెంకటేశ్వపురం జనార్దన్‌రెడ్డికాలనీకి చెందిన పి.శ్రీనివాసులు (35),ఉషారాణి దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాసు లు పప్పులవీధిలో చెక్కరిక్షాల రిపేరు, టైర్ల అంగడి నిర్వహిస్తున్నాడు. అయి తే భార్య ప్రవర్తనపై ఆది నుంచి అతనికి అనుమానం ఉండేది. ఈ క్రమంలో దంపతుల నడుమ విభేదాలు పొడ చూపాయి. అయితే ఉషారాణి ఇంటి వద్దనే చిల్లర దుకాణం నిర్వహిస్తోంది. వీరి ఇంటి వద్దనే సలీమ్ అనే ఆటోడ్రైవర్ అద్దెకు ఉంటున్నాడు. సలీమ్ స్నేహితుడు అన్వర్‌తో పరిచయం ఏర్పడి ఆమె అతనితో సన్నిహితంగా ఉండేది.


ఈ నెల రెండో వారంలో వారం రోజుల పాటు ఆమె పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయింది. ఇంటికి తిరిగి రాగా ఎక్కడికి వెళ్లావని భర్త నిలదీయడంతో మరోమారు వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న సలీమ్, అన్వర్ నీతో మాట్లాడాలంటూ శ్రీనివాసులను పెన్నా వారధిలోకి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగే క్రమంలో వారి మధ్య మాటామాటా పెరగడంతో వారు శ్రీనివాసులను కొట్టా రు. అతను అక్కడికక్కడే మృతి చెందాడని సమాచారం. దీంతో సలీమ్, అన్వ ర్ అతన్ని బైక్‌పై కూర్చొబెట్టుకుని బుజబుజనెల్లూరు లింగాల చెరువుకట్ట వద్ద పడేసి వెళ్లినట్లు తెలిసింది.

గుర్తుతెలియని మృతదేహం చెరువుకట్ట ఉందని ఈ నెల 20వ తేదీన స్థానికులు ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ జగత్‌సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో నిందితులు తామే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది.  సలీమ్‌తో మృతుడి భార్యకు వివాహేతర సంబంధం ఉందని, ఈ నేపథ్యంలోనే హత్య జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటన ఆవేశంలో జరిగిందా.. పథకం ప్రకారం హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు