వ్యాపారానికి చిన్న... ఔదార్యంలో పెద్ద

12 Nov, 2019 05:51 IST|Sakshi
విశ్వనాథంను అభినందిస్తున్న  సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్‌కుమార్‌

ఆయన సంపన్నుడేం కాదు.. కష్టపడితేనే కడుపు నిండుతుంది. కానీ సమాజ శ్రేయస్సును కోరుకున్నాడు.. జీవితమంతా గడిపింది చిరు వ్యాపారిగానే.. కానీ గుణంలో మాత్రం భారీ ఉదారతను చాటుకున్నారు.. 
తాను వృద్ధాశ్రమంలో ఉంటూ.. కష్టపడి సంపాదించిన రూ.50 లక్షలను భారత సైన్యానికి విరాళంగా ఇచ్చి తన దేశభక్తిని చాటుకున్నారు. సూర్యాపేట జిల్లా మట్టపల్లికి చెందిన సిరిపురం విశ్వనాథం గుప్తా. సోమవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి తన కష్టార్జితం నుండి రూ.50 లక్షలను సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి అందించాలని కోరుతూ చెక్‌ అందజేశారు. 78 సంవత్సరాల వయసులో, మట్టపల్లిలోని వృద్ధాశ్రమంలో ఉంటూ కాలం వెళ్ల్లదీస్తున్న విశ్వనాథం ‘‘యాభై ఏళ్లు వ్యాపారంలో ఎంతో సంపాదించా.. నేను పుట్టిన తీగుళ్ల (జగదేవ్‌పూర్‌)తో పాటు నేను పెరిగి, వ్యాపారం చేసిన హుజూర్‌నగర్‌ ప్రాంతంలోనూ అనేక దేవాలయాలకు ఆర్థిక సహాయం చేశా.. కానీ ఈ చరమాంకంలో దేశంకోసం పోరాడుతున్న సైన్యం, వారి కుటుంబాలకు నాకు తోచిన సహాయం చేయాలని పించింది. మిత్రుడు లక్ష్మణరావు సహకారంతో సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్‌కుమార్‌ను సంప్రదించి రూ.50 లక్షలను గవర్నర్‌ చేతుల మీదుగా సైన్యానికి విరాళమిచ్చా.. ఈ రోజు చేసిన పనే నాకు అత్యంత సంతృప్తిని కలిగిస్తోంది’ అని సాక్షితో చెప్పారు. ఇదే విషయమై సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్‌కుమార్‌ మాట్లాడుతూ విశ్వనాథం భూరి విరాళం ఈ సమాజంలోని అందరికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు