అడవి పందులు, కోతుల పీడ విరగడయ్యేదెలా?

24 Oct, 2017 05:33 IST|Sakshi

అడవి పందులు, కోతుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో పంటలకు తీవ్ర నష్టం

డా. వాసుదేవరావు సారథ్యంలో ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విస్తృత అధ్యయనం

అడవి పందులను పారదోలే ‘ఆర్తనాదాల యంత్రం’.. కోతులను బెదరగొట్టే తుపాకీకి రూపకల్పన

పంటల రక్షణకు మరికొన్ని ఉపాయాలను రూపొందించిన శాస్త్రవేత్తలు

అడవి పందులు, కోతుల సంఖ్య, పంట నష్టంపై క్షేత్రస్థాయి గణాంకాలు సేకరించడం అవసరమంటున్న శాస్త్రవేత్తలు

అడవిలోని పందులు, కోతుల వంటి జంతువులకు ఆహార కొరత ఏర్పడితే ఏమవుతుంది? అవి దగ్గర్లోని పంట పొలాలపై వచ్చి పడుతూ ఉంటాయి. అడవి బలహీనమవుతున్న కొద్దీ పంటల మీద వీటి దాడి తీవ్రమవుతూ వస్తున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో  రైతులకు అడవి పందులు, కోతుల బెడద గత ఐదారేళ్ల నుంచి పెను సమస్యగా పరిణమించింది. వీటిని పారదోలి పంటలను కాపాడుకునే పద్ధతులపై ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం గత కొన్నేళ్లుగా అధ్యయనం చేస్తున్నది. విభాగం అధిపతి, ముఖ్య శాస్త్రవేత్త డా. వైద్యుల వాసుదేవరావు సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం అడవి పందులు, కోతులను పంట పొలాల నుంచి దూరంగా పారదోలేందుకు అనేక పద్ధతులను రూపొందించింది. ఇవి రైతులకు ఊరటనిస్తున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా సంతతిని పెంచుకుంటున్న అడవి పందులు, కోతులను నిర్మూలిస్తే తప్ప తమ కష్టాలు తీరవని కొందరు రైతులు గగ్గోలు పెడుతున్నారు. అయితే, వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం వీటి కాల్చివేత నేరం.

కిం కర్తవ్యం?!
అడవి పందులు, కోతుల సంఖ్య ఎంత? వీటి వల్ల ఏయే పంటల్లో జరుగుతున్న నష్టం ఎంత? స్పష్టంగా తెలియదు! గణాంకాలు అందుబాటులో లేకపోవడంతో విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుకావడం లేదన్నది ఒక వాదన. సమస్య తీవ్రతపై క్షేత్రస్థాయి గణాంకాలు సేకరించినప్పుడే వీటిని పూర్తిస్థాయిలో ఎదుర్కొనే మరింత సమర్థవంతమైన మార్గాలు వెదకడం సాధ్యమవుతుందని అఖిల భారత సకశేరుక చీడల(వెర్బట్రేట్‌ పెస్ట్‌) యాజమాన్య విభాగం అధిపతి డా. వాసుదేవరావు స్పష్టం చేస్తున్నారు.  పాలకులారా వింటున్నారా..?!


అడవి పందులు పంటల వాసనను  పసిగట్టి పొలాలపై దాడి చేస్తుంటాయి..
అడవి పల్చబడిపోవటం వల్ల వ్యవసాయం కూడా దెబ్బతింటున్నది. అడవిలో మానులు నరికివేతకు గురవడంతో అడవి జంతువులు, పక్షులకు ఆహారం దొరకడం లేదు. దాంతో అవి ఆకలి తీర్చుకోవడానికి రైతుల పంట పొలాలపైకి దాడి చేస్తున్నాయి. ఇందువల్లనే అడవి పందులు, కోతుల వంటి జంతువుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో రైతులకు జరుగుతున్న పంట నష్టం ఏటేటా పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. అయితే, ఈ సమస్యపై పాలకులు అంతగా దృష్టి పెట్టకపోవటంతో రైతులకు కష్టనష్టాలే మిగులుతున్నాయి.

∙మన దేశంతోపాటు బర్మా, అమెరికా, రష్యా తదితర దేశాల్లో అడవి పందుల బెడద ఎక్కువగా ఉంది. ఇతర దేశాల్లో వీటిని కాల్చి లేదా విషం పెట్టి చంపుతున్నారు. కానీ, మన దేశంలో వివిధ కారణాల వల్ల వన్యప్రాణి సంరక్షణకే అధికంగా మొగ్గు చూపుతున్నాం

అడవి పందులు సామాన్యంగా వర్షాకాలం ముగిసిన తర్వాత పంట పొలాలపై ఎక్కువగా దాడి చేస్తుంటాయి. గడ్డి భూములు, అటవీ పరిసర ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాలు, పంట పొలాల సమీపంలో రాత్రి వేళల్లో సంచరిస్తూ ఉంటాయి


అనేక రకాల పంటలు, దుంపలు, మట్టిలోని వేరు పురుగులు, పాములు, చిన్న జంతువులను తింటాయి. కలుపు మొక్క తుంగ గడ్డలను ఇష్టపడతాయి

పరిపక్వ దశలోని మొక్కజొన్నకు 23–47%, వేరుశనగకు 20–48%, చెరకుకు 18–36%, వరికి 11–30%, జొన్నకు 10–20% చొప్పున పంట దిగుబడి నష్టం కలిగిస్తాయి. కంది, పెసర, వరి, శనగ, కూరగాయ పంటలకు కూడా అడవి పందులు నష్టం చేస్తాయి

ఘాటైన వాసనను వెదజల్లే పసుపు, అల్లం, వాము, ఆవాలు.. ముళ్లను కలిగి ఉండే వాక్కాయ, కుసుమ, ఆముదం పంటల జోలికి అడవి పందులు రావు

పంటలకు నష్టం కలిగించడంతోపాటు వైరస్‌ సంబంధమైన జబ్బులను ఇతర జంతువుల్లో వ్యాపింప చేస్తాయి

అడవి పందుల్లో వాసన పసిగట్టే గుణం ఎక్కువ. కాబట్టి, దూరం నుంచే ఎక్కడ ఏ పంట ఉందో గ్రహిస్తాయి. చూపు, వినికిడి శక్తి తక్కువ

ఆహార సేకరణకు 15–35 వరకు కలసి గుంపులుగా సంచరిస్తాయి. ఆడ పందులు నాయకత్వం వహిస్తాయి

అడవి పందులు వర్షాకాలంలో 4–12 పిల్లలను కంటాయి ∙అడవి నుంచి బయటకు వచ్చిన అడవి పందులు సర్కారు తుమ్మ చెట్లలో నివాసం ఏర్పాటు చేసుకొని.. రాత్రుళ్లు పంటల పైకి దాడి చేస్తున్నాయి.

ఆర్తనాదాల యంత్రంతో అడవి పందులకు చెక్‌
అడవి పందులను సమర్థవంతంగా పారదోలేందుకు శాస్త్రవేత్తలు అనేక పద్ధతులను రూపొందించారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగినది ‘ఆర్తనాదాల యంత్రం’(బయో అకౌస్టిక్స్‌). బెంగళూరుకు చెందిన గ్రుస్‌ ఎకోసైన్సెస్‌ సంస్థతో కలసి దీన్ని రూపొందించారు. గత మూడేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో 155 మంది రైతుల క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. రైతుల అనుభవాలు, సూచనలకు అనుగుణంగా దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచారు. ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున త్వరలో కంపెనీతో అవగాహన ఒప్పందం జరగబోతోంది.

పులి, అడవి పంది తదితర అటవీ జంతువులు ఆపదలో ఉన్నప్పుడు బిగ్గరగా అరిచే ఆర్తనాదాలను 33 నిమిషాలపాటు రికార్డు చేశారు. ప్రతి జంతువు ఆర్తనాదాలకు మధ్యలో కొద్ది నిమిషాలపాటు.. ఇవి నిజమైన ఆర్తనాదాలేనని భ్రమింపజేయటం కోసం.. విరామం ఇచ్చారు. ఆర్తనాదాల యంత్రాన్ని పొలంలో కరెంటు స్థంభానికి లేదా మరేదైనా కర్రకు బిగించవచ్చు. విద్యుత్‌తో నడుస్తుంది. కరెంట్‌పోతే సౌరశక్తితో నడుస్తుంది. బ్యాటరీ 12–14 గంటలు పనిచేస్తుంది. జీఎస్‌ఎం సిమ్‌ టెక్నాలజీని వాడారు. రైతు పొలానికి వెళ్లకుండానే సెల్‌ ద్వారా ఆన్‌/ ఆఫ్‌ చేయొచ్చు. అరుపులు బాగా బిగ్గరగా (42–37 డెసిబుల్స్‌) 10–15 ఎకరాల వరకు వినిపిస్తాయి.
 
అడవి పందులను అరికట్టే జీవకంచెలు: మొక్కజొన్న, జొన్న పంటల చుట్టూ ఆముదం మొక్కలను 4 వరుసలు దగ్గర దగ్గరగా విత్తుకొని అడవి పందులు లోపలికి రాకుండా చూడవచ్చు. ఆముదం పంటపై ముళ్లు వీటిని అడ్డుకుంటాయి. వేరుశనగ పొలానికి చుట్టూ కుసుమ పంటను 4 వరుసలు వత్తుగా విత్తుకోవాలి. పొలం చుట్టూతా దగ్గర దగ్గరగా వాక్కాయ చెట్లు పెంచటం ద్వారా పొలంలోపలికి అడవి పందులు రాకుండా అడ్డుకోవచ్చు. వాక్కాయ చెట్టుకు ఉండే ముళ్లు వీటిని అడ్డుకుంటాయి. ఈ పంటల ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తుంది.     

ఇనుప ముళ్ల కంచెలు: చిన్న కమతాల్లో పంటలు పండించుకునే రైతులు ముళ్ల కంచెలు వేసుకోవడం ద్వారా అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవచ్చు. బార్బ్‌డ్‌ వైర్‌తో 3 వరుసలుగా పంట చుట్టూ కంచెగా నిర్మించాలి. 2 అడుగుల గుండ్రటి కంచెను పంట చుట్టూ వేయాలి. దీన్నే పోలీస్‌ కంచె అని కూడా అంటారు.

చైన్‌ లింక్‌ ఫెన్స్‌ను పొలం చుట్టూ వేసుకొని పంటను రక్షించుకోవచ్చు. భూమి లోపలికి 9 అంగుళాల మేరకు దీన్ని పాతాలి. లేకపోతే కంచె కింద మట్టిని తవ్వి.. కంత చేసుకొని పొలంలోకి పందులు వస్తాయి. హెచ్‌.డి.పి.ఇ. చేపల వలను పొలం చుట్టూ వేసుకోవచ్చు. 3 ఇంచుల కన్ను ఉండే వలను వాడాలి. 3 అడుగుల ఎత్తు, 2 అడుగుల వలను భూమి మీద పరచి.. మేకులు కొట్టాలి. ఈ వలలో అడవి పందుల గిట్టలు ఇరుక్కుంటాయి.

కందకాలు: పొలం చుట్టూ కందకాలు తవ్వటం ద్వారా అడవి పందులను అడ్డుకోవచ్చు. కందకం 3 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు ఉండాలి. పొలం చుట్టూతా ఒకటే కందకం తవ్వాలి. ఎక్కడా గట్టు వదలకూడదు. పొలం గట్టుకు అడుగు దూరంలో తవ్వాలి. పందులు దూకి రాలేవు. వాన నీటి సంరక్షణ జరుగుతుంది. పక్క పొలాల నుంచి పురుగులు కూడా మన పొలంలోకి రావు.  

విషగుళికలు: పొలం చుట్టూ కర్రలు పాతి ఫోరేట్‌ గుళికలను గుడ్డ మూటల్లో వేలాడగట్టాలి. 200 గ్రా. గుళికలను కిలో ఇసుకలో కలపాలి. ఈ మిశ్రమాన్ని 100 గ్రా. చొప్పున తీసుకొని చిన్న, చిన్న రంధ్రాలు పెట్టిన గుడ్డలో మూట గట్టాలి. 3 – 5 మీటర్ల దూరంలో కర్రలు పాతి వాటికి వేలాడ గట్టాలి.ఈ గుళికల ఘాటు వాసన పందులు పంట వాసనను పసిగట్టకుండా గందరగోళపరుస్తాయి. కాబట్టి పొలంలోకి రావు.

కోడిగుడ్డు ద్రావణం పిచికారీ: పంట చుట్టూ అడుగు వెడల్పున నేలపై గడ్డిని తవ్వేసి.. కోడిగుడ్డు ద్రావణాన్ని పిచికారీ చేస్తే పొలంలోకి పందులు రావు. కుళ్లిన లేదా మామూలు కోడిగుడ్లను పగలగొట్టి ఒక పాత్రలో పోసుకోవాలి. 25 మి.లీ. కోడిగుడ్డు ద్రావణాన్ని లీటరు నీటికి కలిపి పొలం చుట్టూ పిచికారీ చేయాలి.

పంది కొవ్వు + గంధకం పూత: పొలం చుట్టూ 3 వరుసల నిలువు కంచె మాదిరిగా కొబ్బరి తాళ్లు కట్టాలి. పంది కొవ్వులో గంధకాన్ని 3:1 నిష్పత్తిలో కలిపి.. ఆ మిశ్రమాన్ని తాళ్లకు పూయాలి. పందులైనా ఇతర జంతువులైనా ఒక గుంపు ఉన్న చోటకు మరొక గుంపు రావు. పంది కొవ్వు–గంధకం వాసన తగలగానే ఇక్కడ వేరే గుంపు ఉందని భ్రమపడి పందులు వెళ్లిపోతాయి.

వెంట్రుకలు: మనుషులు క్షవరం చేయించుకున్నప్పుడు రాలే వెంట్రుకలు తీసుకువచ్చి.. పొలం చుట్టూ ఒక అడుగు వెడల్పున వేయాలి. గడ్డిని చెక్కి శుభ్రం చేసిన నేలపై వెంట్రుకలు వేయాలి. అడవి పందులు ముట్టెతో వాసన చూసినప్పుడు ఈ వెంట్రుకలు ముక్కులోకి వెళ్లి గుచ్చుకుంటాయి. దాంతో వెనుదిరిగి వెళ్లిపోతాయి.

కోతులకు తిండి పెట్టటం మానితే 30% పంట నష్టం తగ్గుతుంది!
తెలుగు రాష్ట్రాల్లో పంట పొలాలకు అడవి పందులతోపాటు కోతుల బెడద ఎక్కువగా ఉంది. వీటి సంతతి వేగంగా పెరుగుతుండటంతో పంట నష్టం ఏటేటా పెరుగుతున్నది. అడవుల్లో, రోడ్ల పక్కన వివిధ రకాల పండ్ల చెట్లను అభివృద్ధి పేరిట నరికివేస్తుండటం వల్ల కోతులు ఆహారం కోసం పంటల మీదకు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రజల్లో కొన్ని రకాల సెంటిమెంట్ల కారణంగా కోతులకు పండ్లు, ఇతర ఆహార పదార్థాలను తినిపించడం కూడా కోతుల సంతతి తామరతంపరగా పెరిగి సమస్యాత్మకంగా తయారవుతున్నదన్నది నిపుణుల మాట. కోతులకు మనుషులు ఆహారం వేయటం మానేస్తే వీటి మూలంగా జరుగుతున్న పంట నష్టం 30% మేరకు తగ్గిపోతుందని గత రెండేళ్లుగా ఈ సమస్యపై అధ్యయనం చేస్తున్న ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ముఖ్యశాస్త్రవేత్త డా. వాసుదేవరావు చెప్పారు.

మన ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే కోతులకు తోక పొట్టిగా, ముడ్డి ఎర్రగా ఉంటుంది. ఆగస్టు – అక్టోబర్‌ నెలల మధ్య ఇవి పిల్లలను పెడుతూ ఉంటాయి. ఆడ కోతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం వీటి సంతతి వేగంగా పెరగటానికి ప్రధాన కారణమవుతోంది. సాధారణంగా ఒక మగ కోతికి 2.8 ఆడ కోతుల చొప్పున ఉండాలి. కానీ, తాము నిర్వహించిన సర్వేలో ప్రతి మగ కోతికి 6.7 ఆడకోతులు ఉన్నాయని తేలినట్లు డా. వాసుదేవరావు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.

కోతులు తినని పంటలు: కోతుల బెడద బాగా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వాటికి నచ్చని పంటలను సాగు చేయటం మేలని డా. వాసుదేవరావు సూచిస్తున్నారు. పసుపు, అల్లం, కంద, చేమగడ్డ, బంతి, మిర్చి, ఆవాలు, సజ్జ వంటి పంటల జోలికి కోతులు రావని ఆయన తెలిపారు. ఇతర పంటలను సాగు చేసే రైతులు కోతులు తినని పంటలను సరిహద్దు రక్షక పంటలుగా వత్తుగా కొన్ని సాళ్లు వేసుకోవటం వల్ల ప్రయోజనం ఎంత వరకూ ఉంటుందన్న కోణంలో అధ్యయనం జరుగుతోంది.

రోడ్ల వెంట చెట్ల నరికివేతతో సమస్య తీవ్రం..: మన పూర్వీకులు రోడ్లకు ఇరువైపులా నేరేడు, చింత, మద్ది, రావి తదితర పండ్ల జాతులు, మోదుగ, బూరుగ వంటి మకరందాన్ని అందించే పూల చెట్లను ఎంతో ముందు చూపుతో నాటేవారు. ఆ చెట్లపై ఆధారపడి కోతులు ఆకలి తీర్చుకుంటుండేవి. అయితే, రోడ్ల విస్తరణలో భాగంగా మన ముందు తరాల వారు నాటిన పెద్ద చెట్లన్నిటినీ నరికేశాం. అదే విధంగా అడవిలో కూడా పెద్ద మాన్లు నరికివేతకు గురయ్యాయి. చిన్న చెట్లతో కూడిన అడవులే పల్చగా మిగిలాయి. దీంతో కోతులకు చెట్ల ద్వారా ఆహారం లభించక పంటల మీదే ఆధారపడాల్సిన అనివార్య పరిస్థితి వచ్చిందని డా. వాసుదేవరావు అంటున్నారు.

హరితహారం, సామాజిక అడవుల పెంపకం వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇతర పరాయి ప్రాంతపు వృక్ష జాతులకు బదులు సంప్రదాయక పండ్ల జాతుల మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన సూచిస్తున్నారు. వాణిజ్యదృష్టితో టేకు, యూకలిప్టస్‌ వంటి మొక్కలను నాటడం కన్నా పండ్లు, పూల జాతి చెట్లను ఎక్కువగా పెంచి, కోతులను ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి వదిలేలా దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి. ప్రణాళికలన్నీ మనుషుల ఆర్థిక అవసరాలు, సౌలభ్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రచిస్తున్నారని.. సకల జీవరాశి మనుగడను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందనేది ఆయన సూచన.

సోలార్‌ ఫెన్సింగ్‌: కోతులు, అడవి పందులు పంటను పాడు చేయకుండా పొలం చుట్టూ జీఏ వైరుతో సోలార్‌ ఫెన్సింగ్‌ వేసుకోవచ్చు. తక్కువ విస్తీర్ణంలో ఉన్న పొలాలకు ఇది ఉపకరిస్తుంది. ఇది షాక్‌ కొడుతుంది, అయితే చనిపోయే అంత తీవ్రత ఉండదు. కాబట్టి, జంతువులు బెదిరి పారిపోతాయి. ఎకరానికి రూ. 15 వేల ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్తనాదాల యంత్రాన్ని కూడా ఈ సోలార్‌ ఫెన్సింగ్‌కు అనుసంధానం చేసే యోచన ఉందని డా. వాసుదేవరావు తెలిపారు.

కోతులను, పక్షులను పారదోలే గన్‌: కోతులను, పక్షులను బెదరగొట్టి పారదోలటానికి నల్లని పెద్ద తుపాకీని డా. వాసుదేవరావు రూపొందించారు. అనేక పరీక్షల అనంతరం, ప్రయోగాత్మకంగా వాడి చూసిన రైతుల అనుభవాలను బట్టి దీన్ని మెరుగుపరుస్తున్నారు. కోతుల మీదకు ఈ తుపాకీతో పేపర్‌ బాల్స్‌ను ప్రయోగిస్తే.. దాని నుంచి పెద్ద శబ్దం వస్తుంది. బాల్స్‌ దెబ్బ తిన్న కోతులు మళ్లీ ఆ పొలం వైపు రావని చెబుతున్నారు. ప్రయోగాలు పూర్తయిన తర్వాత రైతులకు అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు.


అడవి పందులు కోతుల లెక్కలు తీయాలి
అడవి పందులు, కోతులు తదితర అటవీ జంతువులు పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. అయితే, ఈ పరిస్థితి దాపురించడానికి కారణం మనుషులమే. కాబట్టి వాటి ఆవాస ప్రాంతాలను పరిరక్షిస్తూ ప్రత్యామ్నాయ ఆహార పంటలను పండిస్తూ వన్య జీవుల పరిరక్షణ కూడా ఒక బాధ్యతగా గుర్తించి నిర్వర్తించటం మన కర్తవ్యం. జంతువులను పంట పొలాల నుంచి దూరంగా పారదోలే పద్ధతులపై పరిశోధనలు చేపట్టాం. వన్య ప్రాణులకు ముప్పు కలిగించని పర్యావరణ హిత పద్ధతులను రూపొందిస్తున్నాం. వాటికి పునరావాస ప్రాంతాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తద్వారా వివిధ వన్యజాతులు మనుగడ సాగించడానికి అనువైన పరిస్థితులు, పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా రైతులోకానికి కూడా మేలు జరుగుతుంది. అభివృద్ధి పేరిట వన్యజీవుల ఆవాసాలలోకి చొచ్చుకొని పోయిన మానవులు వన్య జీవుల ఉనికిని ప్రశ్నిస్తున్నారు. సమస్త జీవకోటికి జీవించే హక్కు ఉంది. జీవించే హక్కును కాలరాసే అధికారం మానవునికి నిక్కచ్చిగా లేదు. మానవజాతి ఇప్పటికైనా వన్యజీవుల ఆవాస ప్రాంతాలను ధ్వంసం చెయ్యకుండా.. వాటిని కాపాడే బాధ్యత తీసుకోవాలి.. అడవి పందులు, కోతులు ఎన్ని ఉన్నాయి? వీటి వల్ల పంటలకు జరుగుతున్న నష్టం ఎంత? వంటి విషయాలపై ఇప్పటి వరకు అధికారిక అంచనాలు అందుబాటులో లేవు. ప్రభుత్వాలు పూనికతో కచ్చితమైన గణాంకాలను సేకరిస్తే.. అడవి పందులు, కోతుల బారి నుంచి పంటలను పూర్తిగా కాపాడుకోవటం సాధ్యమవుతుంది. అడవిలో పులులు, చిరుత పులుల మాదిరిగా అడవి పందులు, కోతుల కచ్చితమైన గణాంకాల సేకరణ అసాధ్యమేమీ కాదు. గణాంకాలు సేకరిస్తే.. పంట నష్టాలను పూర్తిగా నివారించటం సాధ్యమవుతుంది.

 

ఆర్తనాదాల యంత్రం వరి పంటను కాపాడింది!
4 ఎకరాల్లో ఈ ఏడాది వరి సాగు చేశాను. పంట వేసిన 30 రోజుల తర్వాత ప్రొ. జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇచ్చిన ఆర్తనాదం యంత్రాన్ని పొలంలో కరెంటు స్థంభానికి బిగించాను. అడవి జంతువుల ఆర్తనాదాలను వినిపించటం ద్వారా అడవి పందులు పంట జోలికి రాకుండా ఇది కాపాడింది. ఈ యంత్రం లేకపోతే ఎకరానికి కనీసం రూ. 5 వేల పంట నష్టం జరిగి ఉండేది.  పదేళ్ల నుంచి అడవి పందులతోపాటు కోతుల సమస్య కూడా బాగా పెరిగిపోయింది. మూసీ నదికి అటూ ఇటూ ఉన్న గ్రామాల్లో సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇళ్లలో ఫంక్షన్లు చేసుకోవటానికి కూడా కోతుల వల్ల భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.  


ఉప్పు చేపల వాసనకు కోతులు పరారీ!
మా ఇంటి పెరట్లో జామ, మామిడి, సీతాఫలం, నిమ్మ వంటి అనేక పండ్ల చెట్లున్నాయి. కాయలను కోతులు బతకనివ్వటం లేదు. ఐదారు ఉప్పు చేపలను గుడ్డలో మూటలు కట్టి నెల క్రితం 6 చోట్ల వేలాడదీశాను. కోతులు ఏయే మార్గాల ద్వారా వస్తున్నాయో అక్కడ కట్టాను. అప్పటి నుంచి కోతులు ఆప్రాంతానికి వచ్చినా మా చెట్ల మీదకు రాలేదు. ఉప్పు చేపల వాసనతో తమకు ముప్పు పొంచి ఉందని భీతిల్లి కోతులు వెళ్లిపోతున్నాయి. ఈ చేపలను వాసన తగ్గిపోయిన తర్వాత రెండు నెలలకోసారి మార్చాలి. వర్షాకాలంలో నెలకోసారి మార్చాలి... మా తోటకు అడవి పందుల బెడద ఉంది. పంది కొవ్వు+గంధకం మిశ్రమంలో తాడును ముంచి.. ఆ తాళ్లను వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఉన్న ముళ్ల కంచెకు కట్టాం. తల వెంట్రుకలను సేకరించి పొలం చుట్టూ వేసిన తర్వాత అడవి పందులు రావటం లేదు.  


అడవి పందులు పంటలను బతకనివ్వటం లేదు..
ఎమ్మే, బీఈడీ చదివా. ఉద్యోగం రాలేదు. పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. ఐదారేళ్ల నుంచి అడవి పందుల సమస్య పెరుగుతూ వచ్చింది. అడవిలో తినటానికి గడ్డల్లేక పొలాల మీదకు వస్తున్నాయి. ఏ పంట వేసినా కష్టంగానే ఉంది. మొదట్లో మొక్కజొన్న కంకులను మాత్రమే తినేవి. ఇప్పుడు వరి కంకులను, చివరికి పత్తి కాయలను కూడా నమిలేస్తున్నాయి. అన్ని ఊళ్లలో వీటి సంఖ్య బాగా పెరిగిపోయింది. సంవత్సరం క్రితం శాస్త్రవేత్తలు ఇచ్చిన ఆర్తనాదాల యంత్రాన్ని 8 ఎకరాల వరి పొలంలో పెట్టా. అడవి పందులు రాలేదు. పొలం చుట్టూ వేసుకోవటానికి ఫెన్సింగ్‌ జాలీని ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వాలి. కొరకరాని కొయ్యలుగా మారిన అడవి పందులను చంపటమే శాశ్వత పరిష్కారం.  
– తోట రఘు (81848 60707), రైతు, కుంటాల, నిర్మల్‌ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
– డా. వైద్యుల వాసుదేవరావు (94404 11166), అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం, ప్రొ.జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్‌
– కాల్య రవికుమార్‌ (80749 19204), రైతు, శోభనాద్రిపురం, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం

– ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి, రైతు, (94924 23875),  పెబ్బేరు, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
కథనం: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

మరిన్ని వార్తలు