నాడు ప్రేమకు... నేడు వివాదాలకు వారధి!

5 Feb, 2016 01:08 IST|Sakshi
నాడు ప్రేమకు... నేడు వివాదాలకు వారధి!

ప్రతిసారీ మారుతున్న రిజర్వేషన్లు
మజ్లిస్ పార్టీకి కంచుకోటగా పురానాపూల్
కాంగ్రెస్‌లో చేరిన మహ్మద్ గౌస్ మారిన సమీకరణలు

 
చార్మినార్: పురానాపూల్... పోలింగ్ నాటి సంఘటనలు...రీ పోలింగ్‌తో ఈ ప్రాంతం ఒక్కసారి వార్తల్లోకి వచ్చింది. గ్రేటర్ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచే కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలింగ్ మొదలైనప్పటినుంచి రెండు పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలకు అక్కడక్కడ వాగ్వాదాలు, ఆందోళనలతో పాటు అరెస్ట్‌లూ చోటుచేసుకున్నాయి. పరిస్థితులను సమీక్షించిన ఉన్నతాధికారులు పురానాపూల్ డివిజన్‌లో శుక్రవారం రీ-పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు.

మారుతున్న రిజర్వేషన్లు
1986 నాటి బల్దియా ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్‌గా ఉన్న పురానాపూల్ డివిజన్ 2002లో బీసీలకు కేటాయించారు. 2009లో మహిళలకు రిజర్వ్ చేశారు. ఇలా 1986 నుంచీ మారుతూ వస్తోంది. పునర్విభజన అనంతరం తాజాగా బీసీ జనరల్‌గా మారింది. 2009లో 23,863 మంది ఓటర్లు ఉండగా... ప్రస్తుతం ఈ సంఖ్య 34,407.
 
రాజకీయ నేపథ్యం
1986లో పురానాపూల్ డివిజన్ ఎస్సీలకు రిజర్వు కావడం తో అప్పట్లో బీజేపీ అభ్యర్థి విజయ్ కుమారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2002లో మజ్లిస్ పార్టీ అభ్యర్థి సున్నం రాజ్‌మోహన్ విజయం సాధించారు. అనంతరం మహిళా రిజర్వేషన్ కావడంతో మజ్లిస్ అభ్యర్థి సున్నం శ్రీలత గెలుపొందా రు. అప్పటి నుంచీ మజ్లిస్‌కు కంచుకోటగా మారింది. ప్రస్తుతం పునర్విభజన అనంతరం రాజకీయ సమీకరణలు మారాయి.  

మహ్మద్ గౌస్ కాంగ్రెస్‌లో చేరడంతో....
పురానాపూల్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్ పోటీ చేస్తున్నారు. ఆయనతో పాటు కుమారుడు, భార్య కూడా రంగంలోకి దిగారు. దీంతో ఒవైసీ సోదరులకు, మహ్మద్ గౌస్‌కు నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దశాబ్దాలుగా మజ్లిస్ పార్టీ కార్యకర్తగా కొనసాగిన గౌస్... 2002లో చార్మినార్ డివిజన్ నుం చి, 2009లో శాలిబండ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయం సాధిం చారు. ఉన్నట్టుండి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాతబస్తీలో రాజకీయాలు వేడెక్కాయి. అంతేకాకుండా తన కుటుంబ సభ్యు లు పోటీ చేస్తున్న మూ డు డివి జన్ల నుంచి విజయం సాధిం చాలనే బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహ్మద్ గౌస్‌కు అప్పగిం చింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టినంతా పురానాపూల్, ఘాన్సీబజార్, శాలిబండ డివి జన్లపై పెట్టింది. మజ్లిస్ పార్టీ తప్పొప్పులను స్థానిక ప్రజ లకు చెబుతూ ప్రజల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసిన మహ్మ ద్ గౌస్ బహిరంగ సభల ద్వారా ఒవైసీ సోదరులకు సవాళ్లు విసిరారు. ఖిల్వత్ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మహ్మద్ అలీ షబ్బీర్‌లను రప్పిం చారు. రోడ్ షోలతో ప్రజలను ఆకట్టుకునేప్రయత్నం చేశారు.

మజ్లిస్ వ్యూహాత్మకంగా...
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో పాటు మహ్మద్ గౌస్‌కు చెక్ పెట్టాలని ఒవైసీ సోదరు లు భావించారు. దీనికి అనుగుణంగానే బహిరంగ సభను నిర్వహించిన మజ్లిస్...కాంగ్రెస్‌కు దీటుగా జవాబిచ్చింది. తమ పార్టీకి కంచుకోటగా ఉన్న పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కనుమరుగవుతుందని... ‘పతంగ్’ను ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేసింది.
 
పోలింగ్ రోజు ఏం జరిగిందంటే...
చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (మజ్లిస్), పురానాపూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ గౌస్ మంగళవారం ఉదయం నుంచీ పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. పోలింగ్ స్టేషన్లను సందర్శిస్తూ.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యం లో మధ్యాహ్నం 1.30 గంటలకు జలాల్‌కుంచా ప్రాంతంలో ఎమ్మె ల్యే, కాంగ్రెస్ అభ్యర్థి ఒకరికొకరు ఎదురు పడ్డారు. దీం తో ఇరువర్గాల్లో ఆగ్రహం కట్టలు తెం చుకుంది. వాగ్వాదాలతో ప్రారంభమై దాడులకు దారి తీసింది. విష యం తెలుసుకున్న దక్షిణ మండల డీసీ పీ వి.సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని ఇరువురినీ అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను చార్మినార్ పోలీ స్ స్టేషన్‌కు... మహ్మద్ గౌస్‌ను మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకుని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి ... ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తమ అనుచరులతో వేర్వేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.
 
ప్రేమకు వంతెన...
ప్రేమకు వారధిగా నిర్మించిన పురానాపూల్ బ్రిడ్జి పేరుతో ఈ డివిజన్ ఏర్పడింది. ప్రిన్స్ మహ్మద్ కులీ కుతుబ్‌షా మూసీ నది ఇవతల ఉన్న భాగమతిని ప్రేమించారు. ఆమెను కలవడానికి మూసీ నదిని దాటుతూ వచ్చేవారు. దీనిని గమనించిన ఆయన తండ్రి సుల్తాన్ ఇబ్రహీం కులీకుతుబ్‌షా 1578లో నదిపై ప్యారానాపూల్ బ్రిడ్జిని నిర్మించారు. ప్యార్ అంటే ప్రేమ. పూల్ అంటే బ్రిడ్జి. ప్రేమకు గుర్తుగా నిర్మించిన ఈ ‘ప్యారానాపూల్’ కాలక్రమంలో పురానాపూల్‌గా మారిం ది. పురానా అంటే పురాతన అని అర్థం. దక్షిణ భారతదేశంలోనే అతి పురాతనమైనదిగా పేరొందిన ఈ వంతెన హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిది.

మరిన్ని వార్తలు