డీసీ సర్క్యూట్‌ కోర్టు జడ్జిగా భారతీయురాలు!

15 Nov, 2018 02:39 IST|Sakshi
నియోమి రావు, శ్వేతసౌధంలో దీపావళి వేడుకల్లో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ట్రంప్‌

వాషింగ్టన్‌: డీసీ సర్క్యూట్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌కు జస్టిస్‌ బ్రెట్‌ కెవెనా స్థానంలో భారతీయ–అమెరికన్‌ న్యాయవాది నియోమి రావు (45)ను అధ్యక్షుడు ట్రంప్‌ నామినేట్‌ చేశారు. వాషింగ్టన్‌లో వైట్‌హౌస్‌లో మంగళవారం భారతీయ–అమెరికన్‌ ఉన్నతాధికారులు, అమెరికాలో భారత రాయబారి నవతేజ్‌ సర్నాతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. అమెరికాలో సుప్రీంకోర్టు తర్వాత రెండో ఉన్నత న్యాయస్థానం డీసీ సర్క్యూట్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌.

తనను జడ్జిగా నామినేట్‌ చేసి తనపై విశ్వాసముంచినందుకు ట్రంప్‌కు నియోమిరావు కృతజ్ఞతలు తెలిపారు. సెనెట్‌ ఆమోదిస్తే డీసీ సర్క్యూట్‌లో కోర్టులో ఆమె రెండో భారతీయ అమెరికన్‌ జడ్జి అవుతారు. కాగా ‘శ్రమజీవులైన భారతీయులు, ఇతర ఆసియన్‌ సంతతి ప్రజలు అమెరికాను వేర్వేరు రంగాల్లో సుసంపన్నం చేస్తున్నారు. ఇది అమెరికా చేసుకున్న అదృష్టం’ అని వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకల్లో ట్రంప్‌ అన్నారు.  భారత్, అమెరికాల మధ్య సత్సంబంధాలు ప్రపంచశాంతి, శ్రేయస్సు, స్వేచ్ఛకు రక్షణ కవచంలా మారుతాయన్నారు.
 

మరిన్ని వార్తలు