సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థులకు హింసాత్మక నిరసనలు వీడాలని హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. భారత పౌరులు ఏ ఒక్కరి నుంచీ పౌరసత్వం లాగేసుకునే ఎలాంటి నిబంధన ఈ చట్టంలో లేదని స్పష్టం చేశారు. విపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం సాగించే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విద్యార్థులను ఆయన హెచ్చరించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ పార్టీలు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఈ తరహా ప్రచారాన్ని చేపడుతున్నాయని ఆరోపించారు. పౌర బిల్లును విద్యార్థులు అథ్యయనం చేయాలని, ఈ బిల్లులో ఏ ఒక్క భారతీయుడి పౌరసత్వాన్ని తొలగించే నిబంధన లేదని పునరుద్ఘాటించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ సైతం పౌర చట్టంపై హింసాత్మక నిరసనలు దురదృష్టకరమని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.