‘యుగ్‌పురుష్‌ అటల్‌’ వస్తోంది!

26 Dec, 2017 16:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజపేయి జీవిత చరిత్రపై ‘యుగ్‌పురుష్‌ అటల్‌’ పేరిట చిత్రం తీస్తున్నారు. సోమవారం నాడు ఆయన 93వ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ విషయాన్ని దర్శక, నిర్మాతలు వెల్లడించారు. స్పెక్ట్రమ్‌ మూవీస్‌కు చెందిన రాజీవ్‌ ధమీజా, అమిత్‌ జోషి, రంజీత్‌ శర్మలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కాలా సచ్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన మయాంక్‌ శ్రీవాత్సవ దర్శకత్వం వహిస్తున్నారు.

వాజపేయి పెంపుడు కూతురు నమితా, ఆమె భర్త రంజన్‌ భట్టాచార్య సహా వాజపేయి కుటుంబ సభ్యులందరి అనుమతితోనే ఈ సినిమాను నిర్మిస్తున్నామని, ఈ ప్రాజెక్టును చేపట్టడంలో వాజపేయి మేనకోడలు మాలా తివారీ తమకు ఎంతో సహకరించారని దర్శకుడు శ్రీవాత్సవ తెలిపారు. వాజపేయి రాసిన ఓ కవిత ఆధారంగా ఆయన సినిమాకు ఓ పాటను బప్పీలహరి కంపోజ్‌ చేశారు. 1998 నుంచి 2004 మధ్య ఐదేళ్లపాటు పూర్తికాలంలో అధికారంలో కొనసాగిన కాంగ్రేసేతర వ్యక్తిగా రికార్డు సష్టించిన వాజపేయి తీవ్ర అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన విషయం తెల్సిందే. ఆయన తాను రాసిన కవిత్వాన్ని అప్పుడప్పుడు చదివి వినిపించిన సందర్భాలున్నాయనే విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు