నిర్భయ కేసులో తీర్పు రిజర్వ్‌..

2 Feb, 2020 19:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ కేసులో దోషుల ఉరిశిక్షపై ప్రత్యేక కోర్టు స్టే విధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వాదనలు ముగియడంతో తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్‌ చేసింది. హైకోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకూ దోషుల ఉరి నిలిపివేయనున్నారు. ఇక క్షమాభిక్ష పిటిషన్‌లు, క్యూరేటివ్‌ పిటిషన్‌లతో దోషులు ఉరిశిక్షను తప్పించుకునేందుకు తమ ముందున్న అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటుండంతో దోషులకు ఉరి శిక్ష అమలు వాయిదాల పర్వంతో సాగుతోంది. నిర్భయ కేసులో నలుగురు దోషులు దేశ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని ఢిల్లీ హైకోర్టుతో కేంద్రం పేర్కొంది. 2012లో ఢిల్లీలో కదులుతున్న బస్‌లో నిర్భయపై సామూహిక హత్యాచారం కేసులో దోషులుగా తేలిన వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా, ముఖేష్‌ సింగ్‌, అక్షయ్‌ సింగ్‌లను శనివారం ఉరి తీయాల్సి ఉండగా, దోషుల్లో ఒకరైన వినయ్‌ శర్మ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను క్షమాభిక్ష కోరుతూ దరఖాస్తు చేయడంతో చివరినిమిషంలో ఉరి శిక్షలో జాప్యం నెలకొంది.

కాగా, శర్మ అప్పీల్‌ను రాష్ట్రపతి తోసిపుచ్చడంతో మరో దోషి అక్షయ్‌ సింగ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ ఈ కేసులో ఉరి శిక్షను అమలు చేయరాదని పటియాలా హౌస్‌కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు తమ ముందున్న అన్ని అవకాశాలను ఇప్పటికే వాడుకున్న ఇద్దరు దోషుల ఉరిశిక్షకు అభ్యంతరాలు ఏముంటాయని కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నారు. నిందితులు జాతి సహనాన్ని పరీక్షిస్తునానరని, శిక్ష అమలులో ఇలాంటి జాప్యాలు న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

చదవండి : దిశ ఘటనపై సినిమా తీస్తున్నా

మరిన్ని వార్తలు