కశ్మీర్‌లో ప్లెబిసైట్‌ సంగతేంటి?

19 Feb, 2019 04:01 IST|Sakshi
కమల్‌హాసన్‌

ఎంఎన్‌ఎం చీఫ్‌ కమల్‌హాసన్‌

చెన్నై: జమ్మూకశ్మీర్‌లో ఇంకా ప్లెబిసైట్‌(ప్రజాభిప్రాయ సేకరణ) ఎందుకు నిర్వహించలేదని మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ ప్రశ్నించారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులను క్రీడా ప్రముఖుల తరహాలో కీర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌ ఎన్నడూ ఆ దారిలో నడవకూడదని అభిప్రాయపడ్డారు. చెన్నైలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కమల్‌.. సర్జికల్‌ స్ట్రైక్స్, పుల్వామా దాడి సహా పలు అంశాలపై యువతీయువకులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ..‘ప్రతీఒక్కరి అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు చేపట్టాల్సిన ప్లెబిసైట్‌ను కశ్మీర్‌లో ఇంకా ఎందుకు చేపట్టలేదు? ఎందుకు భయపడుతున్నారు? మన దేశం 1947లో రెండు ముక్కలుగా విడిపోయింది. ఎవరితో ఉంటారో జమ్మూకశ్మీర్‌ ప్రజలను మీరు(ప్రభుత్వం)ఇంకోసారి ఎందుకు అడగరు? రాజకీయ నాయకులు ఈ పని చెయ్యరు’ అని తెలిపారు. పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం, పాక్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించాలన్న డిమాండ్లపై స్పందిస్తూ.. ‘సాధారణగా ఎవరిౖనా రక్తస్రావమైతే తొలుత దాన్ని ఆపాలి. ఆ తర్వాతే సర్జరీకి(సర్జికల్‌ స్ట్రైక్స్‌కు) ఏర్పాట్లు చేసుకోవాలి. ఆజాద్‌ కశ్మీర్‌(పీవోకే)లో రైళ్లపై జీహాదిస్టుల పోస్టర్లు దర్శనమిస్తుంటాయి.

ఉగ్రవాదులను ప్రముఖ క్రీడాకారుల తరహాలో అక్కడ కీర్తిస్తుంటారు. ఇలాంటి మూర్ఖపు చర్యలను భారత్‌ పునరావృతం చేయకూడదు. ఎందుకంటే పాక్‌ కంటే భారత్‌ చాలా మెరుగైన దేశం’ అని అన్నారు. ‘మీ తల్లిదండ్రులు ఆర్మీలో చేరొద్దని సూచిస్తే వారికి ఒకటే చెప్పండి. ప్రతిఏటా ఆర్మీలో కంటే తమిళనాడులో రోడ్డు ప్రమాదాల కారణంగానే ఎక్కువ మంది చనిపోతున్నారు. అర్హులైనవారు చాలా ఉన్నతస్థానాలకు వెళ్లవచ్చు. కానీ ఆర్మీలో చేరాలన్న ధైర్యం మీకు ఉందా? లేదా? అన్నదే అసలు ప్రశ్న. రాజకీయ నేతలు సక్రమంగా ప్రవర్తిస్తే సరిహద్దులో సైనికులు చనిపోవాల్సిన అవసరమే ఉండదు’ అని అన్నారు.

మరిన్ని వార్తలు