ప్రతిపక్షాల ఉమ్మడి ప్రకటనపై కేంద్రమంత్రుల మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్థాన్లో భారత సైన్యం జరిపిన వైమానిక దాడుల్ని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, అరుణ్ జైట్లీ మండిపడ్డారు. సరిహద్దుల్లో భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో చర్చించేందుకు బుధవారం మధ్యాహ్నం భేటీ అయిన 21 విపక్ష పార్టీలు చేసిన ఉమ్మడి ప్రకటనపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు ఆధారరహితమైనవని, వారి ప్రకటనతో పాకిస్థాన్, ఆ దేశ ఆర్మీ, మీడియా ఆనందంగా ఉన్నాయని జవదేకర్ తప్పుబట్టారు. జైట్లీ కూడా ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. ‘యావత్ దేశం ఒకే గొంతుకను వినిపిస్తోంది. ఈ సమయంలో ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ రాజకీయం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సమయంలో యావత్ దేశం ఒకే గొంతుకను వినిపించాలని నేను అభ్యర్థిస్తున్నాను. పాకిస్థాన్ తనకు అనుకూలంగా జబ్బలు చరుచుకునేలా మీరు (ప్రతిపక్షాలు) ఇచ్చిన దురుద్దేశపూరిత ప్రకటనపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను కోరుతున్నాను’ అని జైట్లీ ట్విటర్లో పేర్కొన్నారు.