ఆసీస్‌కు ఇన్నింగ్స్ విజయం

16 Feb, 2016 00:15 IST|Sakshi
ఆసీస్‌కు ఇన్నింగ్స్ విజయం

కివీస్‌తో తొలి టెస్టు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టును మరో రోజు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా గెల్చుకుంది. స్పిన్నర్ లియోన్ (4/91), పేసర్ మిషెల్ మార్ష్ (3/73) ధాటికి సోమవారం నాలుగో రోజు కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 104.3 ఓవర్లలో 327 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్‌కు ఇన్నింగ్స్ 52 పరుగులతో ఘనవిజయం లభించింది. కివీస్ జట్టులో లాథమ్ (164 బంతుల్లో 63; 3 ఫోర్లు), నికోల్స్ (134 బంతుల్లో 59; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించగా గప్టిల్ (55 బంతుల్లో 45; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.

నాలుగోరోజు 178/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ తమ మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో 218 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. అయితే చివరి వరుస బ్యాట్స్‌మెన్ క్రెయిగ్ (64 బంతుల్లో 33 నాటౌట్; 6 ఫోర్లు) పోరాడగా... టిమ్ సౌతీ (23 బంతుల్లో 48; 5 ఫోర్లు; 3 సిక్సర్లు) వన్డే తరహా ఆటతీరుతో విజృంభించాడు.

వీరిద్దరి మధ్య తొమ్మిదో వికెట్‌కు 59 పరుగులు వచ్చాయి. ఓవరాల్‌గా చివరి మూడు వికెట్ల మధ్య 109 పరుగులు జత చేరాయి. హాజెల్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. సిరీస్‌లో చివరిదైన రెండో టెస్టు 20 నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుంది.

>
మరిన్ని వార్తలు