ఆక్లాండ్: గతేడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో గుజరాత్ లయన్స్కు ప్రాతినిథ్య వహించిన న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్.. ఈసారి ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తరపున బరిలోకి దిగనున్నాడు. శని, ఆదివారాల్లో జరిగిన ఐపీఎల్ వేలంలో మెకల్లమ్కు రూ. 3.60 కోట్లు వెచ్చించి ఆర్సీబీ దక్కించుకుంది. గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీకి ఆడుతూ వస్తున్న క్రిస్ గేల్ను పక్కకు పెట్టిన ఆర్సీబీ యాజమాన్యం.. మెకల్లమ్పై ఎక్కువ ఆసక్తి చూపింది.
తనను ఆర్సీబీ కొనుగోలు చేయడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన మెకల్లమ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆర్సీబీ జట్టులో ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. దీనిలో భాగంగా విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్లతో కలిసి ఆడాలనే తన డ్రీమ్ అని మెకల్లమ్ తెలిపాడు. ఇప్పటివరకూ ఐపీఎల్ టైటిల్ను సాధించడంలో విఫలమైన ఆర్సీబీ.. మెకల్లమ్ రాకతో తన తలరాతను మార్చుకుంటుందేమో చూడాలి.