సచిన్ మూవీకి శిష్యుడు డుమ్మా!

26 May, 2017 15:45 IST|Sakshi
సచిన్ మూవీకి శిష్యుడు డుమ్మా!

ముంబై: భారత జట్టు చాంపియన్స్‌ ట్రోఫీకి బయల్దేరే ముందు క్రికెట్ దేవుడు సచిన్‌ టెండూల్కర్ బయోపిక్‌ ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ను బుధవారం ముంబైలోని వెర్సోవా థియేటర్‌ లో ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. కానీ ఈ ప్రిమియర్ షోకు ఓ వ్యక్తి  గైర్హాజరు కావడంపైనే అందరు చర్చించుకున్నారు. అతడే టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.

తనకు గురువు, దేవుడు అని సచిన్ ను కీర్తించే శిష్యుడు సెహ్వాగ్ బయోపిక్‌ షో ఎందుకు హాజరుకాలేదో ఓ వీడియో ద్వారా తెలిపాడు. 'వాస్తవానికి నాకు ఆహ్వానం అందింది. కానీ ఆ సమయంలో భార్యతో హాలీడే ట్రిప్ లో ఉన్నాను. దేవుడి(సచిన్) ప్రసాదాన్ని ఆస్వాదించకుండా భార్య ఆర్తీతో సమయం గడపాల్సి వచ్చిందని' తనదైన శైలిలో సెహ్వాగ్ వివరించాడు.

'నాన్ స్ట్రైకర్ గా ఉన్నప్పుడు, డ్రెస్సింగ్ రూములో కూర్చుని కూడా సచిన్ బ్యాటింగ్ ను ఫ్రీగా చూశాను. ఇప్పుడు సచిన్ బ్యాటింగ్ చూసేందుకు డబ్బులు, సమయం ఖర్చు చేస్తాను. కోట్ల మంది సచిన్ బయోపిక్ చూస్తారని ఆశిస్తున్నాను. ఎంతోమందికి ఆయన రోల్ మోడల్ గా నిలిచారు. ఈ మూవీ ద్వారా మరికొంత మందిలో స్ఫూర్తిని రగిలిస్తాడని' సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. జేమ్స్ ఇర్స్ కిన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. నేడు (శుక్రవారం) ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ విడుదలైన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు