ప్రశాంతంగా ముగిసిన జేసీజే పరీక్షలు

9 Mar, 2015 02:20 IST|Sakshi

హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) నియామక పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణకు సంబంధించిన ఒకేఒక్క సెంటర్ హైదరాబాద్ మీర్‌పేటలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్షలను నిర్వహించారు. 3,069 మంది న్యాయవాదులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 2,386 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ముగ్గురు డీసీపీల పర్యవేక్షణలో 200 మంది రిజర్వ్ పోలీసులతో గట్టి బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహించారు.

తెలంగాణ న్యాయవాదుల నిరసన
ఉమ్మడి హైకోర్టును విభజించి వెంటనే తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు  ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు కోర్టులకు సంబంధించిన ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆదివారం పరీక్షలను అడ్డుకోబోయారు. పరీక్ష కేంద్రమైన టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకొని కేంద్రప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు   వారిని అడ్డుకొని మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై నిరసనకారులను విడిచి పెట్టారు.

>
మరిన్ని వార్తలు