ఆ నలుగురు పిల్లలకు అండగా ఉంటాం

15 Apr, 2020 11:44 IST|Sakshi
పిల్లల అమ్మమ్మకు నిత్యావసరాలు, నగదు అందిస్తున్న డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌

డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌

సికింద్రాబాద్‌: అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందడంతో అనాథలుగా మారిన నలుగురు పిల్లలకు అండగా ఉంటామని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ హామీ ఇచ్చారు. సీతాఫల్‌మండి డివిజన్‌ బీదలబస్తీకి చెందిన రాధ అనే మహిళ భర్త కొద్ది నెలల క్రితమే మృతి చెందాడు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో రాధ కూడా మృతి చెందింది. కూలీనాలీ చేసుకుని బతికే రాధకు నలుగురు సంతానం. ముగ్గురు బాలురు, ఒక బాలిక ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన నలుగురు పిల్లలు ప్రస్తుతం అమ్మమ్మ సంరక్షణలో ఉన్నారు. మంగళవారం రాధ పిల్లలను పరామర్శించిన పద్మారావుగౌడ్‌ వారికి నెలకు సరిపడా రేషన్‌ సరకులు అందించారు. తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.10 వేల సహాయాన్ని అందించారు. పిల్లలకు ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రెవెన్యూ అధికారులను పద్మారావుగౌడ్‌ ఆదేశించామన్నారు. నలుగురు పిల్లలకు గురుకుల పాఠశాలలో ఉచిత విద్యాబోధనలు అందిస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు