గీతన్నల నాడి ఎలా పడదాం!

14 Mar, 2018 02:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గీత కార్మిక సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

అసెంబ్లీ లాబీలో గౌడ ప్రజాప్రతినిధులతో ఉపసంఘం భేటీ 

గీత పన్ను రద్దు, నీరా ఉత్పత్తులకు ప్రోత్సాహం 

ప్రమాదంలో మరణించిన గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా

సాక్షి, హైదరాబాద్‌ : మత్స్య, గొల్లకుర్మల తరహాలోనే గీత కార్మికులను ప్రసన్నం చేసుకోడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాజ్యాధికారంలో గీత కార్మిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినా టీఆర్‌ఎస్‌కు ఆ వర్గం దూరంగానే ఉండటంతో వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కోరుతున్నారో క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, జోగు రామన్న, పద్మారావుగౌడ్‌లతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏర్పాటు చేశారు. గౌడ కుటుంబాలు, కుల సంఘం నాయకులు, ఎక్సైజ్‌ అధికారులతో మాట్లాడి గీత సామాజిక వర్గం సమస్యలు, పరిష్కార మార్గాలతో సమగ్ర నివేదిక రూపొందించాని ఆదేశించారు. అందులో భాగంగానే మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో గౌడ సామాజిక వర్గ ప్రజా ప్రతినిధులు ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ, ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులతో ఉపసంఘం తొలి విడత సమావేశమై గంటన్నరపాటు చర్చించింది.  

గీత కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు  
తాటి చెట్లు ఎక్కుతూ ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తూ 2017లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ జీవోను సవరించి 2014 జూన్‌ 2 తరవాత మరణించిన వారి కుటుంబాలకూ ఎక్స్‌గ్రేషియా వర్తింపజేయాలని ప్రజా ప్రతినిధులు ఉపసంఘం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం గ్రామాల్లో ప్రతి చెట్టుకు రూ. 25, మున్సిపాలిటీల్లో రూ. 50 చొప్పున గీత పన్ను విధానం అమల్లో ఉందని, దాన్ని రద్దు చేయాలని గౌడ ప్రజాపతినిధులు సూచించారు. గీత కార్మిక కార్పొరేషన్‌కు రూ. 500 కోట్ల నిధులిచ్చి గీత వృత్తిని ఆధునీకరించటంతో పాటు నీరా ఉత్పత్తులను ప్రోత్సహించటానికి పరిశ్రమలు నెలకొల్పాలని కోరారు. గీత భవన్‌ కోసం 10 ఎకరాల స్థలం, నిర్మాణానికి రూ. 25 కోట్లు కేటాయించాలన్నారు. త్వరలోనే క్షేత్ర స్థాయిలో గీత కార్మిక సంఘం నేతలు, కుటుంబాలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై అభిప్రాయాలు సేకరించనుంది. 3, 4 వారాల్లో పూర్తి సమాచారంతో నివేదిక రూపొందించి సీఎంకు అందజేయనుంది. తర్వాత గీత కార్మిక సంక్షేమంపై కేసీఆర్‌ కార్యాచరణ ప్రకటించనున్నారు.

మరిన్ని వార్తలు