సాధారణ మెకానిక్‌లు ఇప్పుడు ఈవీ టెక్నీషియన్లు.. ట్రైనింగ్‌ ఇస్తున్న ప్రముఖ సంస్థ

28 Jul, 2023 17:41 IST|Sakshi

వారంతా ఒకప్పుడు సాధారణ మెకానిక్‌లు. ఇప్పుడు ఈవీ టెక్నీషియన్స్‌గా మారారు. ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ASDC) ఎలక్ట్రానిక్‌ వెహికల్‌ పరిశ్రమలో టెక్నీషియన్‌లుగా పనిచేయడానికి 300 మంది సాధారణ టూ వీలర్‌, త్రీ వీలర్‌ మెకానిక్‌లకు శిక్షణ ఇచ్చింది. 

లివ్‌గార్డ్ బ్యాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈవీ పరిశ్రమకు నైపుణ్యత కలిగిన వర్క్‌ఫోర్స్‌ను అందించడం ఈ చొరవ లక్ష్యం. 2022 డిసెంబర్ 1న ప్రారంభమైన పైలట్ ప్రాజెక్ట్ ఇప్పుడు విజయవంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌ ఫిరోజాబాద్‌లోని ఆగ్రాలో అభ్యర్థులకు పది రోజులపాటు రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ విధానం ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈవీ పరిశ్రమలో అభ్యర్థుల నైపుణ్యాలను మెరుగుపర్చడం, కొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించడం, రిపేర్ టెక్నిక్‌లను మెరుగుపర్చుకోవడంపై ఈ శిక్షణలో తర్ఫీదు ఇచ్చారు. 

ప్రపంచంలో అతిపెద్ద మోటార్‌సైకిల్ మార్కెట్‌ అయిన భారత్‌లో మోటార్‌సైకిల్ పరిశ్రమ నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను ఎదుర్కొంటోందని టోమోటివ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సీఈవో అరిందమ్‌ లహిరి పేర్కొన్నారు. యువతకు మెరుగైన శిక్షణ అందించడం ద్వారా నైపుణ్య కొరతను తగ్గించవచ్చని, పరిశ్రమ  డిమాండ్లను తీర్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇదీ చదవండి GST on EV Charging: ఎలక్ట్రిక్‌ వెహికల్‌ చార్జింగ్‌పై జీఎస్టీ! పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లలో వర్తింపు

శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్, వేతన ఆధారిత ప్రోత్సాహకాలు, టూల్ కిట్, ఒక సంవత్సరం ప్రమాద బీమా కవరేజీని అందించారు. ఈ సర్టిఫికెట్‌, టూల్ కిట్‌లు, ప్రోత్సాహకాలు అభ్యర్థులకు పరిశ్రమలో ఉపాధిని పొందేందుకు, బ్యాంకు రుణాల సహాయంతో సొంతంగా పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తాయని వివరించారు. 

మరిన్ని వార్తలు