ఆండ్రాయిడ్‌ యూజర్లకు అలర్ట్‌..! కొత్తగా..

10 Aug, 2021 18:07 IST|Sakshi

ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ జింపెరియం ఆండ్రాయిడ్‌ యూజర్లను హెచ్చరించింది. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలోకి ప్లైట్రాప్‌ అనే ట్రోజాన్‌(పలు సైట్ల నకిలీ రూపం) ఫేస్‌బుక్‌ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రోజన్‌ వల్ల ఇప్పటివరకు భారత్‌తో కలిపి 144 దేశాలలో పదివేల మంది ఆండ్రాయిడ్‌ యూజర్లను ప్రభావితం చేసినట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ జింపెరియం వెల్లడించింది. దీనిని వియత్నాంకు చెందిన సైబర్‌నేరగాళ్లు రూపోందించనట్లుగా తెలుస్తోంది. ఈ ట్రోజన్‌ ఈ ఏడాది మార్చి నుంచే ఆండ్రాయిడ్‌ యూజర్లపై దాడి చేస్తున్నట్లు జింపెరియం పేర్కొంది. 

ఈ ట్రోజన్‌ ఏం చేస్తుందటే..!
నెట్‌ఫ్లిక్స్‌, గూగుల్‌ యాడ్స్‌కు సంబంధించిన యాప్‌ల కూపన్‌ కోడ్‌లను ఫ్లైట్రాప్‌ ట్రోజన్‌ ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఎరగా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కూపన్‌ కోడ్‌లకోసం ఇచ్చిన లింక్‌లను ఓపెన్‌ చేయగానే యూజర్ల ఫేస్‌బుక్‌ ఖాతాల ద్వారా వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడానికి హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని జింపెరియం తన పరిశోధనలో వెల్లడించింది. ఒకసారి యూజర్‌ స్మార్ట్‌ఫోన్‌లోకి ట్రోజన్‌ చేరితే ఫేస్‌బుక్‌ ఖాతాల ద్వారా యూజర్ల ఫేస్‌బుక్‌ ఐడీ, లోకేషన్‌, ఈ-మెయిల్‌, ఐపీ అడ్రస్‌లను హాకర్లు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. 


ఫోటో కర్టసీ: జింపెరియం

ఎలా వస్తాయంటే...!
ఫ్లైట్రాప్‌ ట్రోజన్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లోని పలు యాప్‌ల ద్వారా, ఇతర థర్డ్‌పార్టీ యాప్స్‌ ద్వారా యూజర్ల స్మార్ట్‌ఫోన్లలోకి హ్యాకర్లు చొప్పిస్తున్నట్లు జింపెరియం పేర్కొంది. గూగుల్‌ ఇప్పటికే హానికరమైన యాప్‌లను తొలగించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కాగా ఇతర థర్డ్‌పార్టీ యాప్స్‌ ద్వారా ఈ ట్రోజన్‌లు ఫోన్లలోకి వచ్చే అవకాశం ఉందని జింపెరియం హెచ్చరించింది. థర్డ్‌పార్టీ యాప్స్‌ను ఫోన్లనుంచి వెంటనే తీసివేయాలని ఆండ్రాయిడ్‌ యూజర్లకు జింపెరియం సూచించింది.

మరిన్ని వార్తలు