పిఠాపురం: ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీలను ఆయన ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఎమ్మెల్యే జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు గండేపల్లి బాబీ, తలిశెట్టి వెంకటేశ్వరరావు, ప్రవీణ్కుమార్, కొత్తపల్లి బుజ్జి, బాలిపల్లి రాంబాబు, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పాల్గొన్నారు.
పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు
రాయవరం: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు గడువు పెంచుతూ ప్రభుత్వ పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి/ఏప్రిల్లో జరిగే పది పరీక్షల గడువు ఈ నెల 10వ తేదీతో ముగియనుండగా, మరో పది రోజులు గడువును పెంపుదల చేస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ జనరల్ డి.దేవానందరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 20వ తేదీలోగా చెల్లించే విధంగా గడువును పెంచారు. రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 21 నుంచి 25వరకు, రూ.200ల అపరాధ రుసుంతో ఈ నెల 26 నుంచి 30 వరకు, రూ.500ల అపరాధ రుసుంతో డిసెంబరు 1 నుంచి ఐదవ తేదీ వరకు చెల్లించేలా గడువును పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.