ఆత్రేయపురం: వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం స్వామి కల్పవృక్ష వాహనం, కల్కి అలంకరణతో అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని అంగరంగ వైభవంగా మేళతాళాలతో గ్రామంలో ఊరేగించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఉదయం 6 గంటలకు సుప్రభాతసేవ అనంతరం స్వామివారికి అభిషేకాలతో పాటు గోత్రనామాలతో పూజలు, నిత్యహోమాలు జరిగాయి. సాయంత్రం స్వస్తి వచనం, ప్రధాన హోమాలు, మహాలక్ష్మి హోమం, దిగ్దేవతా బలిహరణ, నీరాజన మంత్రపుష్పం, చూర్ణో త్సవం, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు.
నేటి కార్యక్రమాలు
శుక్రవారంతో ఉదయం సంకల్పం, విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, మహాశాంతి హోమం, మహ పూర్ణాహుతి, చక్రస్నానం, ధ్వజావరోహణ, నీరాజన మంత్రపుష్పాలు, సాయంత్రం మహదాశీర్వాచనం, ఏకాంత సేవ, నీరాజన మంత్రపుష్పాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై
రేపటి నుంచి రాకపోకలు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): గోదావరిపై రాజమహేంద్రవరం – కొవ్వూరు మధ్య ఉన్న రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై శనివారం నుంచి వాహనాల రాకపోకలను అనుమతించనున్నారు. కలెక్టర్ కె.మాధవీలత గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. రహదారి మరమ్మతుల కోసం ఈ బ్రిడ్జిని సెప్టెంబర్ 27 నుంచి మూసివేశామన్నారు. ప్రస్తుతం మరమ్మతులు పూర్తవడంతో ఆర్అండ్బీ అధికారుల సూచనల మేరకు ద్విచక్ర వాహనాలు, లైట్ మోటార్ వెహికల్స్, ఆటోలు, ఏపీఎస్ ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.