ఐసీఎంఆర్‌ సీరో సర్వేలో కరోనాపై షాకింగ్ విషయాలు వెల్లడి

23 May, 2021 17:23 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి విషయంలో ఐసీఎంఆర్‌ నిర్వహించిన సర్వేలో కొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఐసీఎంఆర్ 2020 డిసెంబర్ నుంచి 2021 జనవరి వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వే ఫలితాలను విడుదల చేసింది. దేశం మొత్తం మీద 24.1 శాతం మందికి కరోనా సోకినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. 21 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 70 జిల్లాల్లో 700 గ్రామాలు / వార్డులలో 28,589 మంది సాధారణ జనాభా, 7,171 మంది ఆరోగ్య కార్యకర్తలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వేలో భాగంగా సేకరించిన నమూనాలను పరీక్షించిన తర్వాత పదేళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బాధితులే అని పేర్కొంది. 

ఒక్క కరోనా కేసు గుర్తిస్తే వారి ద్వారా అప్పటికే 27 మందికి వైరస్‌ సోకినట్లే అని తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఎక్కువమంది కరోనా బాధితులు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి శాతం 26.2 ఉంటే, అదే గ్రామీణ ప్రాంతాలలో 19.1 శాతంగా ఉంది. వైద్యులు, నర్సులు, ఫీల్డ్ స్టాఫ్, పారామెడిక్స్ స్టాఫ్ మధ్య ఎక్కువ గణాంక వ్యత్యాసం లేనప్పటికీ, వైద్యులు నర్సులలో సంక్రమణ శాతం 26.6 శాతం ఉంటే, పరిపాలనా సిబ్బందిలో 24.9 శాతంగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన సర్వేలోనే వ్యాప్తి రేటు ఇంత ఉంటే మార్చి, ఏప్రిల్ లో ఏ విధంగా ఉంటుంది మనం అర్ధం చేసుకోవాలి. అందుకని, ప్రతి ఒక్కరూ కరోనా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి.

చదవండి:
కరోనా థర్డ్‌ వేవ్‌, సెంట్రల్‌ యాక్షన్‌ ప్లాన్‌

మరిన్ని వార్తలు