Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఫేక్‌..! ఆప్‌ నేతకు క్షమాపణలు చెప్పిన ఈడీ..

3 May, 2023 16:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో పొరపాటుగా పేరు చేర్చినందుకు ఆప్ నేత సంజయ్ సింగ్‌కు క్షమాపణలు చెప్పింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్. టైపోగ్రాఫికల్/క్లరికల్ తప్పిదం వల్ల రాహుల్ సింగ్ పేరుకు బదులు సంజయ్ సింగ్‌ అని అచ్చయ్యిందని తెలిపింది. ఈ మేరకు ఆయనకు అధికారిక లేఖ పంపింది.

లిక్కర్‌ స్కాం కేసు ఛార్జ్‌షీట్‌లో ఆప్ నేత సంజయ్ సింగ్ పేరును కూడా ఈడీ చేర్చింది. అసలు ఏ సంబంధం లేని తన పేరును ఛార్జిషీట్‌లో చేర్చడంపై సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రతిష్ఠ దెబ్బతీశారని ఈడీకి లీగల్ నోటీసులు పంపారు. దీంతో తప్పు తమవైపు నుంచే జరిగిందని ఈడీ అంగీకరించింది. సంజయ్‌ సింగ్‌కు క్షమాపణలు చెప్పింది. అనంతరం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చరిత్రలో తొలిసారి ఈడీ క్షమాపణలు కోరతూ తనకు లేఖ రాసిందని సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం ఫేక్ కేసు: కేజ్రీవాల్..
ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఏ సంబంధం లేని సంజయ్‌ సింగ్‌ను కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంలోకి లాగాలని ఈడీ చూసిందని , కానీ లీగల్ నోటీసులు పంపడంతో క్షమాపణలు చెప్పిందని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఫేక్ అని తెలిపేందుకు ఇదే పెద్ద నిదర్శనమన్నారు.  నిజాయితీ గల తమ పార్టీని, నాయకుల ప్రతిష్టను మసకబార్చాలనే దురుద్దేశంతోనే ప్రధాని మోదీ ఈడీతో ఈ పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీకి ఆదరణ పెరగడం చూసి ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ‍మేరకు ఆయన ట్వీట్ చేశారు.

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన రిమాండ్‌లోనే ఉన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా తెలంగాణ ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొందరు ప్రముఖులను సీబీఐ ఈ కేసులో విచారించిన విషయం తెలిసిందే.
చదవండి: శరద్ పవార్ రాజీనామా చేశారంటే.. దేశ రాజకీయాల్లో ఏదో జరగబోతోంది..!

మరిన్ని వార్తలు