-
నాగర్ కర్నూల్: ఈదురుగాలుల బీభత్సం.. గోడ కూలి నలుగురు మృతి
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: తాడూరు మండలం ఇంద్రకల్లో విషాదం చోటుచేసుకుంది. అకాల వర్షం కూలీ కుటుంబాల బతుకులను చేసింది. ఈ విషాద సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఆదివారం సాయంత్రం అకాలంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల తాకిడికి గ్రామంలో నిర్మాణంలో ఉన్న కోళ్ల షెడ్డు కూలి నలుగురు మృత్యువాత పడగా మరో ఇద్దరి కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.ఇంద్రకల్ గ్రామంలో కోళ్ల ఫారం నిర్మాణానికి 6 మంది కూలీలు వెళ్లారు. గోడలు కడుతుండగా ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది పని ముగించుకొని నిర్మాణంలో ఉన్న గోడ పక్కనే కూర్చున్నారు. తీవ్రమైన ఈదురుగాలులతో ఒక్కసారిగా గోడకూలి కూలీలపై పడింది. దీంతో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ఇద్దరు కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
వీడని అలసత్వం
● జెడ్పీ చైర్పర్సన్ బి.శాంతకుమారి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా ముందుకుసాగాలని కోరారు. జెడ్పీ వైస్చైర్మన్ బాలాజీ సింగ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకాధికారులు పక్కా ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. ● అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అధికారులు ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. పేదలకు వైద్యసేవలపై నిర్లక్ష్యం చేయరాదన్నారు. రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేవిధంగా చూడాలన్నారు. అచ్చంపేటలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చే ప్రస్తుత ఏజెన్సీని తొలగించి, స్థానిక పౌరులకు ఉద్యోగాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అడవి ఆధారంగా జీవించే స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని కోరారు. అంగన్వాడీ భవనాల నిర్మాణానికి సంబంధించి నిధుల డ్రాపై విచారణ చేయాలన్నారు. ● జెడ్పీ సమావేశానికి అసంపూర్తి సమాచారంతో అధికారుల హాజరు ● సభ్యుల ప్రశ్నలపై స్పష్టత కరువు ● మినిట్స్ బుక్లో ‘సమీక్షించనైనది’ అనే పదంపై జెడ్పీటీసీల మండిపాటు ● సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ నాగర్కర్నూల్: జిల్లాలోని పలు శాఖల అధికారులు అలసత్వం వీడటం లేదు. జెడ్పీ సమావేశం నిర్వహించే ప్రతిసారి అసంపూర్తి సమాచారంతో రావడం.. వచ్చే సమావేశంలో పూర్తి సమాచారంతో వస్తామంటూ చెప్పడం పరిపాటిగా మారింది. శనివారం స్థానిక ఎస్జేఆర్ ఫంక్షన్ హాల్లో చైర్పర్సన్ శాంతకుమారి అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ ఇదే తంతు కొనసాగింది. సమావేశానికి ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరు కాగా.. ఎజెండాలో పొందుపర్చిన అంశాలపై చర్చ జరిగింది. సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో రాకపోవడం.. గత సమావేశం దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి సంబంధించి తీసుకున్న చర్యలపై మినిట్స్ బుక్లో సమీక్షించనైనది అని సమాధానం రాయడంపై పలువురు జెడ్పీటీసీలు మండిపడ్డారు. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితుల ఖాతాల్లో నష్టపరిహారం డబ్బులు జమ చేశారా అని జెడ్పీ వైస్చైర్మన్ బాలాజీ సింగ్ అధికారులను ప్రశ్నించగా.. సరైన సమాధానం రాలేదు. జిల్లా అధికారులు సరైన సమాచారం లేకుండా వస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలోని సమాచారాన్నే అధికారులు చదివి వినిపిస్తున్నారని పదర జెడ్పీటీసీ రాంబాబు మండిపడ్డారు. నిధుల గోల్మాల్కు సంబంధించి ఓ ఎంపీఓపై తాను ఫిర్యాదు చేశానని.. ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అచ్చంపేట జెడ్పీటీసీ మంత్య్రానాయక్ ప్రశ్నించారు. దీనిపై డీపీఓ కృష్ణ స్పందిస్తూ.. రూ. 2.60 లక్షల నిధులు గోల్మాల్ జరగగా, రూ. 1.40 లక్షలు రికవరీ చేసి, కలెక్టర్కు నివేదిక సమర్పించామని సమాధానమిచ్చారు. సదరు ఎంపీఓపై చర్యలు తీసుకోకపోవడంపై జెడ్పీటీసీతో పాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. సక్రమంగా పనిచేయని పంచాయతీ కార్యదర్శిని బదిలీ చేయాలని చెప్తే, ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మిల్లుల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన సీఎంఆర్ ఎంత పెండింగ్లో ఉందని ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రశ్నించగా.. డీఎస్ఓ స్వామి, మేనేజర్ బాల్రాజు సమాధానం చెప్పలేకపోయారు. దీంతో సరైన సమాచారం లేకుండా సమావేశాలు ఎలా నిర్వహిస్తారని జెడ్పీ సీఈఓ దేవసహాయంను ఎమ్మెల్యేతో పాటు జెడ్పీటీసీలు ప్రశ్నించారు. కాలక్షేపం కోసం సమావేశాలు నిర్వహించడం సరికాదని జెడ్పీటీసీ భరత్ ప్రసాద్ అన్నారు. ● నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల సమస్యలను అధికారులు ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లి, పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లా పరిషత్ కార్యాలయానికి సొంత భవన నిర్మాణానికి ఏకవాక్య తీర్మానంచేసి, ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ● కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని రైతులు సేంద్రియ ఎరువులతో పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. జీనుగా విత్తనాల కొరత లేకుండా చూడాలన్నారు. ఈదురు గాలులకు చెట్లకొమ్మలు కరెంటు తీగలపై పడకుండా ముందస్తుగానే తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సతి వెంట పతి.. జెడ్పీ సమావేశంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సమావేశానికి వంగూరు ఎంపీపీ భీమమ్మతో పాటు ఆమె భర్త లాలూ యాదవ్ కూడా హాజరయ్యారు. ఈవిషయాన్ని ఎవరూ గమనించలేదో.. లేక గమనించినా అడ్డు చెప్పలేకపోయారో తెలియదు కాని సమావేశం అయ్యేంత వరకు సదరు ఎంపీపీ భర్త అక్కడే ఉన్నాడు. -
రికవరీకి ప్రత్యేక బృందాలు..
జిల్లా ఎస్పీగా గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చోరీల కట్టడి కోసం పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. చోరీ కేసులను త్వరగా ఛేదించడం.. సొమ్మును రికవరీ చేసేందుకు గాను ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. చోరీ కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. దొంగలకు న్యాయస్థానాల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకతపై అవగాహన.. జిల్లాలో చోరీల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సీసీ కెమెరాల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణ, గ్రామాల్లోని అన్ని కాలనీలతో పాటు దుకాణాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. సీసీ కెమెరాలతో నేరాలు, చోరీలను నియంత్రించడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులను త్వరగా గుర్తించేందుకు వీలుంటుందని పేర్కొంటున్నారు. -
బీసీజీ వ్యాక్సినేషన్కు ప్రణాళిక
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో వందశాతం బీసీజీ వ్యాక్సినేషన్కు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డా.సుధాకర్లాల్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో బీసీజీ వ్యాక్సినేషన్పై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఆశా నోడల్ పర్సన్స్, టీబీ నోడల్ పర్సన్స్కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ అన్ని గ్రామపంచాయతీల్లో పెద్దలకు బీసీజీ వ్యాక్సిన్ అందించేందుకు అవసరమైన కార్యాచరణ చురుకుగా సాగుతోందన్నారు. ఇప్పటికే వివిధ స్దాయిల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. పీహెచ్సీలు, వెల్నెస్, వ్యాక్సినేషన్ కేంద్రాల్లో బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారిని ఇంటింటి సర్వేతో గుర్తిస్తామన్నారు. హెచ్ఐవీ బాధితులు, అవయవ మార్పిడి చేసుకున్నవారు, గర్భిణులు, బాలింతలు ఇతర వ్యాక్సిన్ల రియాక్షన్ ఉన్న వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వమని తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారందరితో పాటు మద్యం, దూమపానం తాగే వారు, గతంలో పొగ తాగిన వారికి, క్షయ వ్యాధిగ్రస్తులతో సన్నిహితంగా ఉన్నవారికి, ఐదేళ్లుగా క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్న ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ డా.వెంకటదాసు, డా.భీమానాయక్, ప్రోగ్రాం అధికారులు డా.రవికుమార్ నాయక్, డా.కృష్ణ్ణమోహన్, డా.లక్ష్మణ్, డా.సాయినాథ్రెడ్డి, డా.రాజశేఖర్, డా.ప్రదీప్, రేణయ్య పాల్గొన్నారు. -
No Headline
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో కొన్ని రోజులుగా ఎక్కడో ఒకచోట నిత్యం చోరీలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా విహార యాత్రలు, పట్టణాల నుంచి స్వగ్రామాలకు వెళ్తున్న వారి ఇళ్లను దొంగలు టార్గెట్ చేసుకొని తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పలు ప్రాంతాల్లో వరుస చోరీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంటికి తాళంవేసి ఎక్కడికయినా వెళ్లాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట ప్రాంతాలలో చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. పట్టణ శివారు ప్రాంతాల్లోని ఇళ్లలో చోరీలను అరికట్టేందుకు రాత్రివేళ పోలీసు గస్తీని పెంచింది. పట్టణాల్లోని కాలనీలు, గ్రామాల్లో అనుమానిత వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు. చోరీల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
కార్మిక హక్కులపై అవగాహన ఉండాలి
నాగర్కర్నూల్ క్రైం: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు తమ హక్కులపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జి జి.సబిత అన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం మున్సిపాలిటీలోని ఎండబెట్లలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు తప్పనిసరిగా ఈ శ్రమ్ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. బాధిత కార్మికులకు ఉచితంగా న్యాయ సలహాలు, సేవలు అందించేందుకు జిల్లా, మండల స్థాయిలో న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తోందని అన్నారు. గతంలో నేరస్తుడికి తగిన శిక్ష పడాలని ప్రాధాన్యం ఇచ్చేవారని.. ఇప్పుడు నేరస్తులకు శిక్షతో పాటు బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సబ్ జైలును తనిఖీ చేశారు. జైల్లో ఉన్న 23 ఖైదీలకు అందిస్తున్న సదుపాయాలను జైలర్ నాగరాజుతో తెలుసుకున్నారు. కార్యక్రమంలో రెండవ అదనపు జూనియర్ సివిల్జడ్జి శ్రీనిధి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
చదువుతోపాటు క్రీడలు అవసరం
నాగర్కర్నూల్ క్రైం: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని జిల్లా యువజన క్రీడల శాఖ అఽధికారి సీతారాం అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న కరాటే శిక్షణ శిబిరాన్ని శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో శారీరక దారుఢ్యం, చురుకుదనం పెంపొందుతుందన్నారు. ఆత్మరక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని.. ప్రస్తుత సమాజంలో బాలబాలికలు కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో మాస్టర్లు రవికుమార్, స్వాతి ఉన్నారు. విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలి నాగర్కర్నూల్రూరల్: వానాకాలం పంటసాగుకు సంబంధించి విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలని డీఏఓ ఎం.చంద్రశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయాధికారుల సూచనల మేరకు లైసెన్స్ కలిగిన డీలర్ వద్దనే విత్తనాలను కొనుగోలుచేసి, తప్పనిసరిగా రసీదు పొందాలని సూచించారు. రసీదులో విత్తనం రకం, లాట్ నంబర్, కంపెనీ నంబర్ను, గడువు తేదీ, డీలర్ సంతకం ఉండేవిధంగా చూసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లూజ్ విత్తనాలు, పగిలిన ప్యాకెట్, డబ్బాల విత్తనాలను కొనుగోలు చేయకూడదని తెలిపారు. ప్యాకెట్లపై ముద్రించిన సమాచారం, బిల్లులో సమాచారాన్ని సరిచూసుకోవాలని సూచించారు. బీటీ కాటన్ విత్తన ప్యాకెట్లపై జీఈఏసి అప్రూవల్ నంబర్ తదితర సమాచారంతో పాటు మన ప్రాంతంలో సాగుకు అనువైనదో కాదో తెలుసుకోవాలని తెలిపారు. రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలన్నారు. బీటీ–3 పిలువబడే రకాలైన విత్తనాలకు ప్రభుత్వ అనుమతి లేదని.. ఈ విత్తనాల తయారీ, అమ్మకాలను నిషేధించినట్లు తెలిపారు. విత్తనాల కొనుగోలుపై ఈనెల 31వ తేదీ వరకు వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామన్పాడుకు కొనసాగుతున్న వరద మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయానికి వరద స్వల్పంగా కొనసాగుతోంది. శనివారం జలాశయంలో 1,012 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ సింగిరెడ్డి రనీల్రెడ్డి తెలిపారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా నీటి సరఫరా లేదని.. సమాంతర కాల్వ ద్వారా 27 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు వివరించారు. తాగునీటి అవసరాలకు నిత్యం 20 క్కూసెక్కులు వినియోగిస్తున్నామని చెప్పారు. -
నంది వడ్డెమాన్ ఆధ్యాత్మిక ప్రాంతం
బిజినేపల్లి: నందివడ్డెమాన్ పూర్వం నుంచే ఆధ్యాత్మిక ప్రదేశమని.. ఈ ప్రాంతం నిత్యం పూజలు, హోమాలతో కళకళలాడుతూ ఉండేదని ఇక్కడి ఆలయాలు, వాటిలోని శిల్పకళ, చరిత్రను చూస్తే తెలుస్తుందని ఉజ్జయిని పీఠాధిపతి జగద్గురు సిద్ధలింగ రాజదేశి శివాచార్య భగవత్పాదులు అన్నారు. శనివారం ఆయన గ్రామంలోని జైష్ట్యాదేవి సమేత శనైశ్వరస్వామిని దర్శించుకుని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి పీఠాధిపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం పీఠాధిపతి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో త్రికూట, కాళీమాత ఆలయాలు ఉండటం విశేషమన్నారు. చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలదేనని.. ఆలయాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్రావు, అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య, మల్లికార్జున్, కమిటీ సభ్యులు వీరశేఖరాచారి, ప్రభాకర్, పుల్లయ్య పాల్గొన్నారు. ఉజ్జయిని పీఠాధిపతి జగద్గురు సిద్ధలింగ రాజదేశి శివాచార్య భగవత్పాదులు -
విద్యుత్ బకాయిలపై దృష్టి సారించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యుత్ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వినియోగదారుల సమస్యలు తెలుసుకోవాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్అలీ ఫారుఖీ అన్నారు. శాఖ పనితీరుపై శుక్రవారం మహబూబ్నగర్లోని విద్యుత్ భవన్లోని మీటింగ్ హాల్లో ఉమ్మడి జిల్లా యంత్రాంగంతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీల్డ్ విజిట్ చేస్తేనే విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తాయన్నారు. వినియోగదారులను ఇబ్బందులకు గురి చేయకుండా సమయంలోపు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. ప్రతినెలా 9లోపు బిల్లింగ్ చేయాలని అప్పుడే కరెక్ట్గా బిల్లులు వస్తాయన్నారు. వినియోగదారులకు తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడే పరిష్కరించి వారికి నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులపై, విధుల పట్ట నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతోపాటు ప్రతినెలా విద్యుత్ బిల్లుల వసూలుపై అధికార యంత్రాంగం దృష్టిసారించి వసూలు చేయాలని సూచించారు. పెండింగ్ బిల్లులు వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టి వసూలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వచ్చే వానాకాలంలో విద్యుత్ సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఓవర్ లోడింగ్ గుర్తించి అక్కడ సరిపడా విద్యుత్ను సరఫరా చేయాలని, సబ్ స్టేషన్ల వారీగా ఎంత విద్యుత్ వినియోగం అవుతుందో తెలుసుకోవాలని చెప్పారు. అంతకు ముందు జిల్లాకు తొలిసారిగా వచ్చిన సీఎండీ ముషారఫ్ అలీ ఫారుఖీకి ఘన స్వాగతం పలికారు. ఎస్ఈ పీవీ రమేష్ సిబ్బందితో కలిసి మొక్కను అందజేశారు. సీఎండీ మహబూబ్నగర్ జిల్లాకేంద్రానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. కార్యక్రమంలో డీఈటీ చంద్రమౌళి, శివరాం, ఈఈ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. -
పక్కాగా జంతు సంరక్షణ చట్టాలు అమలు
నాగర్కర్నూల్: జంతు సంరక్షణ చట్టాలను పక్కాగా అమలుచేయాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతు సంరక్షణ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. బక్రీద్ పండగ నేపథ్యంలో జంతువులను అక్రమంగా తరలించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోవధ నిషేధ చట్టం 1977 ప్రకారం ఆవులను తరలించడం పూర్తిగా నిషేధమని.. 14 ఏళ్లు దాటిన మగ జంతువులను మాత్రం రవాణా చేయడానికి సంబంధిత పశువుల డాక్టర్ ధ్రువీకరణ అవసరమని తెలిపారు. మార్కెటింగ్ సిబ్బంది సంతలపై నిఘా పెట్టి, పశువులను కొనుగోలుచేసే వారి వివరాలను అధికారులకు తెలియజేయాలని సూచించారు. పోలీస్ శాఖ అధికారులు జిల్లాలోని ప్రధాన రహదారులపై చెక్పోస్టులను ఏర్పాటుచేయాలని.. రవాణా చేస్తున్న ఆవు లు, లేగ దూడలను మున్సిపల్ సిబ్బందికి అప్పగించడంతో పాటు పశువులను అక్రమంగా తరలించే వారి పై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రత్యేక పర్మిట్ ఉన్న వాహనాలను మాత్రమే పశువుల రవాణాకు అనుమతించాలని తెలిపారు. పాఠశాలల విద్యార్థులు జంతువులు, పక్షులపై జాలి, దయా కరుణ చూపేవిధంగా కథల రూపంలో అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి జీవీ రమేష్, డీఎస్పీ శ్రీనివాసులు, డీఈఓ గోవిందరాజులు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహేష్, ఎఫ్ఆర్ఓ శరత్చంద్రారెడ్డి, వ్యవసాయాధికారి చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ నరేష్బాబు ఉన్నారు. -
డీసీసీబీ రుణాల అవకతవకలపై సీఐడీ విచారణ
అమ్రాబాద్: అచ్చంపేట డీసీసీబీ రుణాల మంజూరులో చోటు చేసుకున్న అవకతవకలపై శుక్రవారం సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. సీఐ లక్ష్మణ్ వివరాల మేరకు.. డీసీసీబీ రుణాల అవకతవకలపై డీసీఓ పత్యానాయక్ ఫిర్యాదు మేరకు అచ్చంపేట పోలీస్స్టేషన్లో కేసు నమోదు కాగా, సీఐడీకి అప్పగించారు. ఈమేరకు పదర మండలం వంకేశ్వరంలో సీఐడీ మహబూబ్నగర్ డీఎస్పీ శంకర్, సీఐలు సైదులు, లక్ష్మణ్ విచారణ నిర్వహించారు. 2017, 2018, 2019 సంవత్సరాలలో రుణాలు పొందిన వారి వివరాలను సేకరించారు. డీసీసీబీ పరిధిలో మొత్తం 1,827 ఖాతాలు ఉండగా.. రుణాల మంజూరులో దాదాపు రూ. 10 కోట్ల అవకతవకలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈమేరకు 215 మందితో నేరుగా వాంగ్మూలం తీసుకోగా.. విచారణకు చాలా మంది ఖాతాదారులు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. మూడు రోజులుగా విచారణ కొనసాగుతుండగా.. కేవలం 28 మంది మాత్రమే విచారణకు వచ్చారని తెలిపారు. చనిపోయిన వారు, భూమిలేని వారి పేర్లమీద రుణాలు తీసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. -
36వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
కొల్లాపూర్: జిల్లాలో ఇప్పటివరకు 6,212 మంది రైతుల నుంచి 36,560 మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ఉదయ్కుమార్ వెల్లడించారు. శుక్రవారం కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సీతారామారావుతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ధాన్యం కొనుగోలు వివరాలతో పాటు రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరించాలని నిర్వాహకులకు సూచించారు. మిల్లుల వద్ద ధాన్యం అన్లోడింగ్ సందర్భంగా ఏమైనా సమస్యలు తలెత్తితే అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 148 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నట్లు వివరించారు. ధాన్యం విక్రయించిన వారిలో 3,968 మంది రైతులకు రూ. 50.11 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. మిగతా వారికి కూడా త్వరలోనే డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ నాగరాజు, తహసీల్దార్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. -
రాజీమార్గమే రాజమార్గం
నాగర్కర్నూల్ క్రైం: చిన్నచిన్న కేసుల పరిష్కారానికి రాజీమార్గమే రాజమార్గమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జి సబిత అన్నారు. జిల్లా కోర్టులో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. జూన్ 8న జిల్లా కోర్టులో జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులను గుర్తించి, కక్షిదారులకు నోటీసులు పంపాలని మెజిస్ట్రేట్లకు సూచించారు. చెల్లని చెక్కుల కేసులు, భార్యాభర్తల గొడవలు వంటి కేసుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని తెలిపారు. జాతీయ లోక్అదాలత్ ప్రయోజనాలను కక్షిదారులకు వివరించి, వారిని రాజీ దిశగా ప్రోత్సహించాలని అన్నారు. రుణ వసూలు కేసులకు సంబంధించి సులభ వాయిదాల రూపంలో కూడా అప్పు చెల్లించేలా రాజీ పడవచ్చని, ఈ కేసులలో లోక్అదాలత్ ఇచ్చే అవార్డును చట్టప్రకారం అమలు చేయవచ్చని చెప్పారు. వివిధ రకాల కేసులతో ఇబ్బందులు పడుతున్న జిల్లా ప్రజలు జాతీయ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో రెండవ అదనపు జూనియర్ సివిల్జడ్జి శ్రీనిధి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణ, కార్యదర్శి పర్వత్రెడ్డి తదితరులు ఉన్నారు. -
పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్..
గోదాంలో భద్రపరుస్తున్నాం.. జిల్లాకు 3,14,016 పాఠ్యపుస్తకాలతో పాటు 61,656 నోట్బుక్స్ చేరుకున్నాయి. వీటిని జిల్లా కేంద్రంలోని గోదాంలో భద్రపరుస్తున్నాం. ప్రస్తుతానికి పార్ట్–1 పుస్తకాలు రాగా.. పార్ట్–2కు సంబంధించిన పుస్తకాలు సెప్టెంబర్లో వస్తాయి. గోదాము నుంచి మండలాలకు, అక్కడి నుంచి పాఠశాలలకు సరఫరాచేస్తాం. విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందిస్తే, వారిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. పుస్తకాలు పక్కదారి పట్టకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. – గోవిందరాజులు, డీఈఓ ● విడతల వారీగా జిల్లాకు సరఫరా ● ఇప్పటికే గోదాముకు చేరిన 74 శాతం పుస్తకాలు ● విద్యార్థులకు సకాలంలో అందించేందుకు విద్యాశాఖ కసరత్తు ●అచ్చంపేట: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 2024–25 విద్యా సంవత్సరం పాఠ్యపుస్తకాలను సకాలంలో పంపిణీ చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా విడతల వారీగా జిల్లాకు అవసరమైన పుస్తకాలను పంపిణీ చేస్తోంది. జిల్లాకు మొదటి విడతగా వచ్చిన పుస్తకాలను జిల్లా కేంద్రంలోని గోదాములో భద్రపరిచారు. అన్ని ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్ స్కూళ్లలోని ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు.. కేజీబీవీ, మోడల్, ఆశ్రమ, గురుకులాల్లో 5నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. గతేడాది మార్చి–ఏప్రిల్లోనే పాఠ్యపుస్తకాలు రావ డం మొదలు కాగా.. ఈసారి కొంత ఆలస్యమైంది. ఆలస్యమైతే ఒత్తిడి.. కొన్నేళ్లుగా సకాలంలో పాఠ్యపుస్తకాలు రాకపోవడం.. వచ్చినవి కూడా అంతంతమాత్రం కావడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంలో కూడా పుస్తకాలు అందించడంలో తీవ్ర జాప్యం జరిగింది. పుస్తకాలు సకాలంలో అందకపోతే విద్యార్థులతో పాటు సిలబస్ పూర్తిపై టీచర్లపైనా ఒత్తిడి ఉంటుంది. పాఠశాలల పునఃప్రారంభం రోజే అన్ని తరగతుల వారికి పాఠ్యపుస్తకాలు అందిస్తే ఉపయోగం ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పుస్తకాల పంపిణీ ప్రక్రియను మే నెలలోనే ప్రారంభించారు. జూన్లో బడులు తెరుచుకునే నాటికి పూర్తి స్థాయిలో అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాకు చేరుకున్న పుస్తకాలను జిల్లా కేంద్రంలోని గోదాములో భద్రపరుస్తున్నారు. 4,25,119 పుస్తకాలు అవసరం.. జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల కింద పనిచేస్తున్న పాఠశాలలు మొత్తం 1,120 ఉన్నాయి. అందులో పదో తరగతి వరకు దాదాపు 1,22,345 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైతే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా జిల్లాకు 4,25,119 పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయని విద్యాశాఖ అధికారులు నివేదికలు సమర్పించారు. ప్రస్తుతానికి మొదటి విడతగా 3,14,016 పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. వీటిని ఎమ్మార్సీలు, అక్కడి నుంచి పాఠశాలలకు తరలించాల్సి ఉంది. ఓవైపు ఇంగ్లిష్, మరోవైపు తెలుగు మీడియంలో పాఠ్యాంశాలు ఉండేలా పుస్తకాలు ముద్రించారు. నోట్బుక్స్ పంపిణీ ఇలా.. 1నుంచి 5వ తరగతి వారికి వర్స్ బుక్కులు.. 6నుంచి 10వ తరగతి వారికి రాత పుస్తకాలు అందించనున్నారు. వీటిని పిల్లలకు ఉచితంగా అందించడం వల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గనుంది. 5నుంచి 10వ తరగతి చదివే ఒక్కో విద్యార్థికి 6 నోట్ పుస్తకాల చొప్పున అందించనున్నారు. పాఠ్యపుస్తకాలతో పాటు నోట్బుక్స్ను కూడా ఎంఈఓలు తమ మండలాలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 61,656 నోట్బుక్స్ వచ్చాయి. -
ప్రజల జీవన స్థితిగతులు మెరుగు
నాగర్కర్నూల్: జిల్లాలో సాగునీటి వనరులతో ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడ్డాయని కలెక్టర్ ఉదయ్కుమార్ అన్నారు. గ్రామాల వనరులపై నాలుగు రోజులపాటు అధ్యయనం చేసిన కేంద్ర సెక్రటేరియట్ పరిధిలోని వివిధ శాఖల అసిస్టెంట్ సెక్షన్ అధికారులు శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్తో సమావేశమయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని చందుపట్ల, గన్యాగుల, అల్లాపూర్, బిజినేపల్లి, తెల్కపల్లి గ్రామాల్లో పర్యటించి గ్రామీణ వనరులపై అధ్యయనం చేసినట్లు వివరించారు. ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు, మానవ వనరులు, మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాల సరళిని పరిశీలించడంతో పాటు మండల, గ్రామస్థాయి అధికారులతో సమావేశమై పలు అంశాలను తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో వనరులపై కేంద్ర అధికారులు సంతృప్తిని వ్యక్తంచేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ఎంతో తోడ్పాటు అందిస్తున్నాయన్నారు. ప్రతి గ్రామంలో విద్య, వైద్యం, రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యుల ఆర్థిక వనరులను అభివృద్ధికి ప్రభుత్వం చేయూత అందిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించి.. డిజిటల్ తరగతుల ద్వారా విద్య అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ తదితరులు ఉన్నారు. -
ధాన్యం తడవకుండా జాగ్రత్తలు పాటించాలి
చారకొండ: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. చారకొండ, జూపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి స్వామికుమార్తో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ధాన్యం నాణ్యతను పరిశీలించడంతో పాటు కొనుగోలు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. రైతుల నుంచి కొనుగోలుచేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ధాన్యం తరలింపులో ఏమైనా సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. వారి వెంట తహసీల్దార్ కేసీ ప్రమీల, ఆర్ఐ నబి, పీఏసీఎస్ సీఈఓ వెంకటయ్య, భీమయ్య, యాదయ్య ఉన్నారు. -
త్వరలో పోడు భూములకు పట్టాలు
మన్ననూర్: అచ్చంపేట నియోజకవర్గంలో రైతులు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చే ప్రక్రియను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుందని అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. గురువారం మన్ననూర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమ్రాబాద్, లింగాల, బల్మూర్, అచ్చంపేట మండలాల్లో పోడు భూములను సాగుచేస్తున్న రైతులకు ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని అటవీశాఖ అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. వానాకాలంలో పోడు భూముల సాగుపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొత్తగా అడవిని నరికి సాగుచేసే ప్రయత్నాలు మాత్రం చేయవద్దని ఎమ్మెల్యే సూచించారు. ఈప్రాంత రైతులకు సాగునీటి వసతి కల్పించేందుకు ఉమామహేశ్వర రిజర్వాయర్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న రైతులకు ఆశించిన స్థాయిలో నష్టపరిహారం అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఫేజ్–2లో రాయలగండి రిజర్వాయర్ నిర్మాణానికి సర్వే నిర్వహించి, పనులు చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేల కోట్లు ఖర్చుచేసి, వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. విద్య, వైద్యరంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే, పీడీ యాక్టు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. కాగా, స్థానిక అంబేడ్కర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులకు ఒకే గది ఉందని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా.. మరో మూడు గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. జూన్ 5, 6 తేదీలలో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 24 రకాల శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారని.. నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీటీసీలు రహీం, శ్రీనివాసులు, రవి బాలమ్మ, నాయకులు మేరాజ్, బుచ్చయ్య, వెంకటేశ్వర్లు, వెంకటరమణ, సత్యనారాయణ, గెలువయ్య, రాజారాం, రాజేంద్ర ప్రసాద్, గోపాల్, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, తుల్చా, రవూఫ్ ఉన్నారు. -
గోవిందా.. గోవింద
పెంట్లవెల్లి: మండలంలోని జటప్రోల్లో మదనగోపాలస్వామి రథోత్సవాన్ని గురువారం కనులపండువగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సురభి వంశస్తులు ఆదిత్య లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన రథోత్సవానికి వందలాది భక్తులు తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ రథంపై స్వామివారిని పురవీధుల గుండా ఊరేగించారు. ఈసందర్భంగా గోవింద నామస్మరణ మార్మోగింది. మహిళలు, చిన్నారులు బొడ్డెమ్మలు, కోలాటాలతో అలరించారు. కార్యక్రమంలో గోవింద్గౌడ్, వైస్ఎంపీపీ భీంరెడ్డి, నాగిరెడ్డి, మాజీ సర్పంచ్ ఎస్కే ఖాజా, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. రథంపై ఊరేగిన జటప్రోల్ మదనగోపాలస్వామి -
నమో.. నారసింహా
తాడూరు: మండలంలోని శిర్సవాడలో గురువారం లక్ష్మీ నారసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన రథోత్సవానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చా రు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులు కొలువుదీరగా.. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈసందర్భంగా నమో నారసింహా స్మరణ మార్మోగింది. అనంతరం శకటోత్సవం నిర్వహించారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు ఇతర వాహనాలతో ఆలయం వద్ద ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారికి పల్లకీసేవ నిర్వహించారు. కార్యక్రమంలో పూజారులు జగదీశ్వరాచారి, సాయిచంద్ర, ఎంపీటీసీ రమేష్రెడ్డి, మాజీ సర్పంచ్ రాజేందర్రెడ్డి, ఆనంద్కుమార్ పాల్గొన్నారు. ఘనంగా శిర్సవాడ లక్ష్మీ నారసింహస్వామి రథోత్సవం -
మన సంస్కృతి సంప్రదాయాలు గొప్పవి
తెలకపల్లి: భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవని.. విదేశీ వ్యామోహంలో పడి వాటిని మరిచిపోవద్దని డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. గురువారం తెలకపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో వందేమాతరం ఫౌండేషన్, శృతిలయ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి సంగీత, నృత్య శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమానికి డీఎస్పీ హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, కళలు వంటి అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. వందేమాతరం ఫౌండేషన్, శృతిలయ అకాడమీ వారు విద్యార్థులను శాసీ్త్రయ సంగీతం, నృత్యంలో తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ఎస్ఐ నరేష్, సీఎల్ఆర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ రాజమహేందర్రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రకాష్రెడ్డి పాల్గొన్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
నాగర్కర్నూల్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఇంటర్మీడియట్ నోడల్ అఽధికారి వెంకటరమణ గురువారం ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటాయని తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,037, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 2,511 మంది విద్యార్థులు హాజరవుతారని.. మొత్తం 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 21 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 21 మంది డిపార్ట్మెంట్ అదికారులు, ఏడుగురు అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు, నలుగురు పరీక్షల కస్టోడియన్లతో పాటు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం నాగర్కర్నూల్ రూరల్: జిల్లా కేంద్రం సమీపంలోని 220 కేవీ సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా శుక్రవారం పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని సంబంధిత అధికారులు గురువారం ప్రకటనలో తెలిపారు. నాగర్కర్నూల్, మంతటి, పెద్దముద్దునూర్ 33/11 కేవీ సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని.. వినియోగదారులు గమనించాలని కోరారు. సీఎంను కలిసిన ఎమ్మెల్యే కల్వకుర్తి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని గురువారం హైదరాబాద్లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా నియోజకవర్గ అబివృద్ధికి సహకరించాలని సీఎంను కోరగా.. సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకుడు సురబి వెంకటేశ్వర్రావు ఉన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి పాలమూరు: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై మహబూబ్నగర్ కలెక్టరేట్లో గురువారం జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఏడీలు, అధికారులు, కేవీకే శాస్త్రవేత్తలు, ముఖ్య ప్రణాళిక అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే ఆర్థిక నష్టం జరగకుండా బీమా రైతులకు ప్రయోజనకరంగా రిస్క్ కవరేజీ కల్పిస్తుందన్నారు. ఫసల్ బీమా పథకం వానాకాలం సీజన్ నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రస్థాయిలో వ్యవసాయ శాఖ, ప్రభుత్వం ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరింత సమర్థవంతంగా అమలుకు మార్గదర్శకాలు రూపొందిస్తుందని చెప్పారు. ఫసల్ బీమా పథకం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని, అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. పంటలకు నష్టం జరిగినప్పుడు దీని ద్వారా పరిహారం అందుతుందని, ఇందుకు సంబంధించి ప్రీమియం సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తాయని వివరించారు. అధికారులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులు ఆర్థిక అభివృద్ధి చెందేలా కృషి చేయాలన్నారు. ఫసల్ బీమా మార్గదర్శకాల మేరకు గ్రామం, మండలం యూనిట్గా పరిగణిస్తారని, పంట దిగుబడి, వాతావరణ పరిస్థితుల అనుగుణంగా బీమా నిర్ణయిస్తారని చెప్పారు. మహబూబ్నగర్ రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయాధికారి, మాస్టర్ ట్రైనర్ కృపాకర్రెడ్డి ఫసల్ బీమాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన పరిశీలకులు జేడీ శైలజ మాట్లాడుతూ ఫసల్ బీమాపై ఉమ్మడి జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయ ఏడీ శ్రీదేవి, మహబూబ్నగర్ జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారులు తదితరులు ఉన్నారు. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
తెలకపల్లి/తాడూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ట్రైనీ ఏఎస్ఓల బృందం సూచించింది. బుధవారం తెలకపల్లిలోని పలు శాఖల కార్యాలయాలను సందర్శించి.. పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలుసుకున్నారు. మండల మహిళా సమాఖ్యలో ఏపీఎం నిరంజన్, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ ఇతర అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. పశువైద్యశాలలో మూగజీవాలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల వద్దకు వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. కొలతల ప్రకారం ఉపాధి పనులు చేసి, నిర్ణీత కూలి డబ్బు పొందాలని సూచించారు. అనంతరం మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను చూశారు. అదనపు కలెక్టర్ శ్రీకుమార్ దీపక్, ఎంపీడీఓ కృష్ణయ్య ఉన్నారు. ● తాడూరు మండలంలోని అల్లాపూర్లో కేంద్ర ట్రైనీ ఏఎస్ఓల బృందం రెండో రోజు కొనసాగింది. టీం సభ్యులు ఆదిత్య స్వరూప్, దీపక్, ఉజ్వల్ సంఘం, ప్రమీజ్కుమార్ వర్మ ఉపాధి కూలీలతో వారు మమేకమై వారు పనులు ఏవిధంగా చేయాలనే దానిపై అవగాహన కల్పించారు. గ్రామానికి మంజూరైన ఉపాధి పనుల వివరాలతోపాటు కూలీల వివరాలను సేకరించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను సూపర్వైజర్ వనజతో తెలుసుకున్నారు. ఏపీఓ చంద్రసిద్దార్థ, పంచాయతీ కార్యదర్శి వినోద్ ఉన్నారు. -
కల్తీ విత్తనాలపై నిఘా
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో కల్తీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. కల్తీ విత్తనాల కట్టడి కోసం 10 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ అధికారులతో కలిసి ప్రత్యేక బృందం ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించడంతో పాటు విత్తనాల నాణ్యతను పరిశీలించనున్నట్లు తెలిపారు. రైతులకు ఎవరైనా కల్తీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీసీఎస్ సీఐ శంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం పనిచేస్తుందని.. వంగూర్, తాడూరు, లింగాల ఎస్ఐలు మహేందర్, మహేష్, జగన్మోహన్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. 25న ఉమ్మడి జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25న జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లాస్థాయి బాల, బాలికల బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్గౌడ్, ఎల్.రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్– 13, 15, 17, 19 విభాగాల బాల, బాలికలు, సీనియర్ పురుషులు, మహిళలు, వెటరన్స్లో అండర్–35, 45, 55, 65 విభాగాల్లో ఎంపికలు ఉంటాయన్నారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు ఇండోర్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు కార్య నిర్వాహక కార్యదర్శి సాదత్ఖాన్కు రిపోర్టు చేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 98480 85211, 98669 28835 నంబర్లను సంప్రదించాలని వారు కోరారు. -
కుట్టడమే తరువాయి..
జిల్లాకు చేరిన స్కూల్ యూనిఫాం క్లాత్ తొలిరోజే పంపిణీకి చర్యలు.. పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. మహిళా సంఘాలతో ప్రత్యేకంగా చర్చించి, యూనిఫా మ్స్ కుట్టు బాధ్యతలను అప్పగిస్తున్నాం. మొ దట విద్యార్థులకు ఒక జత చొప్పున దుస్తులు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఎం.గోవిందరాజులు, డీఈఓ నాగర్కర్నూల్: జిల్లా, మండల పరిషత్.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 2024 – 25 విద్యా సంవత్సరంలో అందించాల్సిన యూనిఫామ్స్ను వేసవిలోనే రెడీ చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. యూనిఫామ్స్కు సంబంధించిన క్లాత్ ఇప్పటికే జిల్లాకు చేరుకోగా.. స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో దుస్తులు కుట్టించేందుకు విద్యాశాఖ, డీఆర్డీఓ అధికారులు కసరత్తు ప్రారంభించారు. గతానికి భిన్నంగా ఈఏడాది తరగతుల వారీగా విద్యార్థులకు వేర్వేరు నమూనాల్లో యూనిఫాం కుట్టేలా రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను జారీ చేశారు. తప్పనిసరిగా అదే మోడల్లో యూనిఫామ్స్ కుట్టించి, విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. ● ఒకటి నుంచి మూడు తరగతుల బాలికలకు బాడీ ఫ్రాక్లు, షర్ట్లకు సంబంధించి కొలతలతో సహా నిర్దేశించిన రీతిలోనే ఉండాలనే షరతు విధించారు. నాలుగు, ఐదు తరగతుల వారికి కూడా స్కర్టులు, చొక్కాలకు రెండు జేబులు, భుజాలపై క్లాకులు, రెండు చేతులకు క్లిప్పులు ఉండాలని నిబంధన పెట్టారు. 6నుంచి 12 తరగతుల వారికి పంజాబీ డ్రెస్సులు కుట్టించి ఇవ్వాలని ఆదేశించారు. డ్రెస్సులకు హ్యాండ్ క్లిప్స్, కాలర్ నెక్ పట్టీ, డ్రెస్పై వాస్కోటు ఉండాలని సూచించారు. విద్యార్థులకు ప్యాంట్లు, నిక్కర్లు గతంలో మాదిరిగానే ఉండాలని సూచిస్తూ, జిల్లా అధికారులకు విధివిధానాలను జారీ చేశారు. పాఠశాలల వారీగా ఇలా.. జిల్లాలో ప్రస్తుతం 1నుంచి 8 తరగతుల వరకు 46,529 మంది విద్యార్థులు కేజీబీవీ, మోడల్, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. వారిలో బాలురు 22,796, బాలికలు 23,733 మంది ఉన్నారు. 9, 10 తరగతుల్లో మొత్తం 12,418 మందికిగాను 6,213, మంది బాలురు, 6,205 మంది బాలికలు ఉన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్లో 11 నుంచి 12వ తరగతి వరకు 1,476 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 99మంది బాలురు, 1377మంది బాలికలు ఉన్నారు. ఎంఈఓల పర్యవేక్షణలో.. జిల్లాలోని మహిళా సంఘాలకు స్కూల్ యూనిఫామ్స్ తయారీ బాధ్యతను అప్పగించనున్నారు. అందుకు ఆసక్తిగల మహిళా సంఘాల నుంచి టెండర్లను ఆహ్వానించి, ఖరారు చేయాల్సి ఉందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. డీఆర్డీఓ అధికారుల సహకారంతో మండలాల వారీగా యూనిఫామ్స్ స్టిచ్చింగ్ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించి.. ఎంఈఓల పర్యవేక్షణలో సిద్ధం చేయించనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు యూనిఫామ్స్ కుట్టించి, విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. మహిళా సంఘాలకు తయారీ బాధ్యత పాఠశాలల పునఃప్రారంభం నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక జిల్లాలో 60,423 మంది విద్యార్థులు -
కమనీయం.. లక్ష్మీ నారసింహుడి కల్యాణం
తాడూరు: మండలంలోని శిర్సవాడలో బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నారసింహస్వామి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కల్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అంతకుముందు ఆలయంలో సుదర్శన హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, నాగర్కర్నూల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్తి భరత్ ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజేందర్రెడ్డి, ఎంపీటీసీ రమేష్రెడ్డి, ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- శ్రీదేవికి ఇష్టమైన ఆలయంలో జాన్వీ కపూర్.. ఫోటోలు వైరల్!
- Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
- IPL 2024: వారికి భారీ నజరానా.. బీసీసీఐ కీలక ప్రకటన
- నాగోలులో లిఫ్ట్ ప్రమాదం.. 8 మందికి తీవ్ర గాయాలు
- ఈవీఎం ట్యాంపర్ అయిందా? లేదా?.. చెక్ లిస్ట్తో చూసుకోండిలా..
- అసలు ‘రేవ్’ రచ్చ గురించి తెలుసా?
- జూన్ 1న ఇండియా కూటమి మీటింగ్!.. కీలక విషయాలపై చర్చ
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక: కొనసాగుతున్న పోలింగ్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- మౌంట్ ఎవరెస్ట్పై భారీగా ట్రాఫిక్జామ్!
Advertisement