-
పేదల భూములు ఇచ్చేయండి
సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్ అనంతగిరి: వికారాబాద్ మండల పరిధిలోని జైదుపల్లి గ్రామంలో సర్వేనంబర్ 11, 117, 122లో పలువురు రైతుల నుంచి ఫారెస్టు ఽఅధికారులు తీసుకున్న భూములను వెంటనే తిరిగి రైతులకు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన బాధిత రైతులతో కలిసి ఫారెస్టు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. 65 ఎకరా ల్లో 35 కుటుంబాలు ఈ భూములను నమ్ముకు ని పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారన్నా రు. 2013లో ప్రభుత్వం ఒక్కొక్కరికి మూడు ఎకరాలు పట్టాలు ఇచ్చిందన్నారు. 2020–21 లో ఫారెస్టు అధికారులు అక్రమంగా మా భూ ముల్లో ప్రవేశించి జేసీబీలు పెట్టించి భూముల్లోకి రైతులు రాకుండా అడ్డుకున్నారన్నారు. సర్వేచేయించి మా భూములు మాకు ఇవ్వాలన్నారు. సుదర్శన్, అనసూయ, లక్ష్మి, హన్మమ్మ, అనంతయ్య, పోచయ్య పాల్గొన్నారు. -
దాడి చేసిన వారిని సస్పెండ్ చేయాలి
తాండూరు టౌన్: ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వి ద్యార్థి సంఘం నాయకుడిపై దాడి చేసిన కానిస్టేబుల్, అతడికి వత్తాసు పలికిన ఎస్ఐను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. గురువారం రాత్రి ఫిర్యాదు నిమిత్తం పోలీస్స్టేషన్కు వచ్చిన పీడీఎస్యూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్పై కానిస్టేబుల్ సత్తార్ దాడి చేశాడని.. ఎస్ఐ కాశీనాథ్ దూషించాడని ఆందోళన చేసిన విదితమే. ఈ మేరకు దాడిచేసిన కానిస్టేబుల్, వత్తాసు పలికిన ఎస్ఐను వెంటనే సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘ నాయకుడిపై పోలీసు స్టేషన్లోనే దాడి జరిగితే, ఇక సామాన్య ప్రజానీకానికి దిక్కెవరని ప్రశ్నించారు. ఈఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్, టీజేఎస్ కౌన్సిలర్ సోమశేఖర్, సీఐటీయూ శ్రీనివాస్, ఎరాన్పల్లి శ్రీనివాస్, గీతామహేందర్, చంద్రయ్య, శివకుమార్, దీపక్ రెడ్డి, సంజయ్ గౌడ్, అనిల్ తదితరులు డిమాండ్ చేశారు. డీఎస్పీకి ప్రజా, విద్యార్థి సంఘాల వినతి -
పనులు పూర్తి చేయండి
దౌల్తాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డీఈఓ రేణుకాదేవి సూచించారు. శుక్రవారం మండలంలోని సురాయిపల్లి, చల్లాపూర్, సలీంపూర్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలల పునఃప్రారంభం నాటికి పనులు పూర్తి కావాలన్నారు. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, పీఆర్ఏఈ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. డీఈఓ రేణుకాదేవి -
ఉత్కంఠకు తెర!
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా బర్ల మంగయాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీఓ అనంతరెడ్డి శుక్రవారం ఉదయం వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపాలిటిలో ఉన్న 24 మంది కౌన్సిలర్లకుగాను 14 మంది కౌన్సిలర్లు ఉదయం 11 గంటలకు సమావేశ మందిరంలోకి ప్రవేశించారు. అనంతరం వైస్ చైర్పర్సన్గా బర్ల మంగను ఎన్నుకునేందుకు 18వ వార్డు కౌన్సిలర్ ఇందిరాల రమేశ్ ప్రతిపాదించగా, మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి ఆమెను బలపరిచారు. సమావేశ మందిరంలో ఉన్న మరో 12 మంది కౌన్సిలర్లు చేతులెత్తి తమ మద్దతును తెలిపారు. ఈ పదవిని ఆశిస్తూ పోటీలో ఎవరూ లేకపోవడంతో 14 మందితో ఏకగ్రీవంగా బర్ల మంగ ఎన్నికై నట్లు ప్రిసైడింగ్ అధికారి అనంతరెడ్డి ప్రకటించారు. మంగకు మెజార్టీ ఉండటంతో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే రంగారెడ్డి ఎన్నికకు హాజరుకాలేదు. పోటీలో ఉన్నా గెలిచే అవకాశాలు లేనికారణంగా ఇద్దరూ బీజేపీ సభ్యులు, ఎనిమిది మంది బీఆర్ఎస్ సభ్యులు గైర్హాజరైనట్లు సమాచారం. కాగా కాంగ్రెస్కు చెందిన చైర్పర్సన్ స్రవంతిపై గత ఫిబ్రవరిలో పెట్టిన అవిశ్వాసం వీగిపోవడం, అనంతరం బీఆర్ఎస్కు చెందిన వైస్ చైర్మన్ ఆకుల యాదగిరిపై గత నెలలో పెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు వైస్ చైర్పర్సన్గా బర్ల మంగ ఎన్నిక కావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత, ఉద్యమకారుడైన బర్ల జగదీశ్యాదవ్ మాట్లాడుతూ.. తన సతీమణి మంగను మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా ఎన్నుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన వైస్ చైర్పర్సన్గా ఎన్నికై న మంగకు శాలువ కప్పి, పూలదండలతో పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తాను కృషిచేస్తానని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. ఎన్నికకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ సత్యనారాయణ, ఎస్ఐ మారయ్యల ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు బందోబస్తు నిర్వహించాయి. మున్సిపల్ కార్యాలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి ఇతరులు లోనికి రాకుండా చూశారు. ప్రత్యర్థులేవ్వరూ సమావేశానికి రాకపోవడంతో ఏకగ్రీవంగా వైస్ చైర్పర్సన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ‘పట్నం’మున్సిపల్ వైస్ చైర్పర్సన్గాబర్ల మంగ ఎన్నిక 14 మంది కౌన్సిలర్ల మద్దతుతో విజయం గైర్హాజరైన బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
ఇబ్రహీంపట్నం రూరల్: అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. శుక్రవారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని టీసీఎస్ ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలను కమిషనర్ బాలకృష్ణ, టీపీఓ అబీబ్ ఉన్నీసాలు సిబ్బందితో కలిసి కూల్చివేశారు. జేసీబీలతో నిర్మాణాలు కూల్చగా, డ్రిల్లింగ్ మిషన్లను పెట్టి ఇంటిపై కప్పులను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ.. మున్ముందు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు. మున్సిపాలిటీలో నిర్మాణాలు చేపట్టడానికి సులభతర పద్ధతుల్లో అనుమతులు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. -
వైద్యం.. చోద్యం
వైద్యో నారాయణ హరి.. అలాంటి దేవుళ్లకు కొందరు మచ్చ తెస్తున్నారు. అర్హత లేని వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. క్లినిక్ల పేరిట డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. ప్రథమ చికిత్స చేయాల్సిన వారి ఆపరేషన్ల వరకు కానిచ్చేస్తున్నారు. దీంతో రోగుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది.పరిగి: అర్హత లేని వైద్యం ప్రజల ప్రాణాలు తీస్తోంది. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండానే ఎంబీబీఎస్ డాక్టర్ అవతారం ఎత్తుతున్నారు. క్లీనిక్ల పేరిట వైద్య సేవలు అందిస్తున్నారు. రోగి పరిస్థితి చేయి దాటితే మరో ఆస్పత్రికి రెఫర్ చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఇదేదో మారుమూల గ్రామాల్లో జరుగుతున్న సంఘటనలు అనుకుంటే పొరపాటే. పరిగి పట్టణం తోపాటు మండల కేంద్రాల్లో జరుగుతున్న తతంగం. ఇటీవల కాలంలో ఇలాంటి క్లీనిక్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. అనర్హులే అధికం జిల్లాలోని 19 మండలాల పరిధిలో దాదాపు వందల సంఖ్యలో ఆర్ఎంపీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అందులో సగానికిపైగా అనర్హులే వైద్యం చేస్తున్నారు. ప్రథమ చికిత్స చేయాల్సిన వారు చిన్న వ్యాధులు మొదలుకొని పెద్ద పెద్ద రోగాలకు చికిత్స అందిస్తున్నారు. సీరియస్ కేసులను తమకు తెలిసిన ప్రైవేటు ఆస్పత్రులకు 20 నుంచి 30శాతం కమీషన్ తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. పట్టణాలు, మండల కేంద్రాల్లో క్లీనిక్లు నిర్వహిస్తున్న వారు వాటికి అనుబంధంగా రక్త పరీక్ష కేంద్రాలు, మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. రోగులు ఏ వ్యాధితో వచ్చినా సరే ముందుగా రక్త, మూత్ర పరీక్షలు రాసి.. వారు సూచించిన కేంద్రాలకే వెళ్లాలని చెబుతున్నారు. చికిత్స నిమిత్తం రాసిన మందులను వారు పేర్కొన్న మెడికల్ దుకాణాల్లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా వైద్య పరీక్షలు, మెడికల్ దుకాణాల నుంచి కమీషన్ దండుకుంటున్నారు. అంతేకాకుండా ఆర్ఎంపీలు అన్ని రకాల వైద్యసేవలను అందిస్తూ ఎంబీబీఎస్ డాక్టర్టుగా చలామని అవుతున్నారు. క్లీనిక్లలో నిబంధనలకు విరుద్ధంగా మందులు వాడుతున్నారు. దీంతో వైద్యం వికటించి రోగులు చనిపోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కొంత మంది చావు అంచుల వరకు వెళ్లి బతికి బయట పడ్డారు. వైద్యం వికటించి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు డబ్బులు ఇచ్చి బయటికి రాకుండా చూసుకుంటున్నారు. సీజ్ చేసినా.. ఇటీవల పరిగి పట్టణంలో, దోమ మండల కేంద్రంలో వైద్యం వికటించి ఇద్దరు ప్రాణాలు కొల్పోయారు. దీంతో వైద్యారోగ్యశాఖ అధికారులు రెండు క్లీనిక్లను సీజ్ చేశారు. నెలరోజుల వ్యవధిలోనే మళ్లీ రోగులకు చికిత్సలు అందిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్లీనిక్ నిర్వాహకుల నుంచి ముడుపులు వస్తున్నందునే చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జ్వరంతో వెళ్లి.. శవంగా వచ్చి.. పరిగి: జ్వరంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన యువతి విగతజీవిగా వచ్చిన సంఘటన పరిగి పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ సంతోష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండల కేంద్రానికి చెందిన రుక్మొద్దీన్ చిన్న కూతురు యాస్మిన్బేగం(22) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈ నెల 22న పరిగి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు మందులు ఇచ్చి ఇం టికి పంపాడు. అయినా జర్వం తగ్గకపోవడం, మరింత ఎక్కువ కావడంతో మరుసటి రో జుమరో ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి వైద్యు లు యాస్మిన్బేగంను అడ్మిట్ చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున యువతి పరిస్థితి విషమించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్లగా వైద్యులు పరిశీలించి చనిపోయినట్లు ధ్రువీకరించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కూతురు చనిపోయిందని మృతురాలి తండ్రి రుక్మొద్దీన్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్లు పట్టా లేకుండానే డాక్టర్ అవతారం వచ్చీరాని వైద్యంతో రోగుల ప్రాణాలు తీస్తున్న వైనం సీరియస్ అయితే మరో ఆస్పత్రికి రెఫర్ పట్టించుకోని అధికారులు చర్యలు తీసుకుంటాం అర్హత లేకుండా క్లినిక్లు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేసి అర్హతలు లేని క్లినిక్లను సీజ్ చేస్తాం. – పల్వన్కుమార్, జిల్లా వైద్యాధికారి -
మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ
పహాడీషరీఫ్: అవుటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డులో వాకింగ్ చేస్తున్న మహిళ మెడలోని మూడున్నర తులాల బంగారు మంగళసూత్రాన్ని దుండగులు తెంచుకొని ఉడాయించిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ప్రతిఘటించేందుకు యత్నించిన బాధితురాలితో పాటు ఆమె కూతురు తలపై దాడి చేశారు. అయినప్పటికీ బాధితురాలి నిందితుల బైక్ తాళంచెవి లాక్కొవడంతో, చేసేది లేక బైక్ అక్కడే వదిలేసి గొలుసుతో పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంఖాల్ గ్రామానికి చెందిన గడ్డమీది మహేందర్ భార్య కల్పన(32) వేసవి సెలవులు కావడంతో ఆమె పిల్లలు లక్ష్మీ ప్రసన్న, హేమ చందర్, హేమంత్, పక్కింటి పిల్లలు పావనీ, నేహశ్రీ, మనీష్ కుమార్లతో కలిసి శుక్రవారం ఉదయం 5 గంటలకు ఓఆర్ఆర్ శంషాబాద్ వైపు సర్వీస్ రోడ్డులో కిలోమీటర్ నడిచి తిరిగి మంఖాల్కు వస్తున్నారు. 5.50 గంటల సమయంలో ఇద్దరు యువకులు రోడ్డు పక్కన హెల్మెట్లు ధరించి షైన్ బైక్తో నిలబడ్డారు. పిల్లలు ముందు నడుస్తుండగా కల్పన వెనుకాల నడుచుకుంటూ పోతుంది. ఈ సమయంలో ఒక్కసారిగా నిందితులు తమ చేతిలోని ఎర్రటి వాటర్ బాటిల్లో ఉన్న నీటిని కల్పన కళ్లల్లో చల్లారు. ఆమె కల్లు మూసుకోవడంతో మెడలోని మూడున్నర తులాల బంగారు మంగళసూత్రాన్ని తెంచారు. గొలుసును ఒక వైపు లాగి పట్టుకోగా, నిందితులు కర్రతో ఆమె నుదుటిపై బాదారు. ఇది గమనించిన కల్పన కుమార్తె లక్ష్మీ ప్రసన్న పట్టుకునేందుకు యత్నించగా ఆమెను కూడా కర్రతో కొట్టారు. గాయాలైనప్పటికీ కల్పన చాకచక్యంతో బైక్ తాళం చెవి గుంజుకొని గట్టిగా కేకలు పెట్టారు. భయపడిపోయిన నిందితులు బైక్ను అక్కడే వదిలేసి మంగళసూత్రంతో అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొనిదర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు డీఐ సుధీర్కృష్ణ పర్యవేక్షణలో స్థానికంగా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అడ్డుకున్న కుమార్తైపె దాడి చేసిన స్నాచర్లు కేకలు వేయడంతోబైక్ను వదిలేసి పరారు -
నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు
అనంతగిరి: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో అడ్మిషన్ల కోసం అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్డబ్ల్యూఆర్ఎస్ అనంతగిరిపల్లి ప్రిన్సిపాల్ జేజే ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గోపాల్ అనంతగిరి: నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. విడిగా, గుర్తింపు పొందని పత్తి విత్తనాలు విక్రయించరాదని సూచించారు. విత్తన సంచి మీద జీఈఏసీ సంఖ్య తప్పని సరిగా ఉండాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవన్నారు. స్టాకు వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. ప్రశాంతంగా పాలిసెట్ అనంతగిరి: పాలిసెట్ ప్రవేశ పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగిందని జిల్లా కోర్డినేటర్ పరవేశ్వర్ తెలిపారు. వికారాబాద్లోని మూడు సెంటర్లలో 1,325 మంది విద్యార్థులకు గాను 1,145మంది హాజరైనట్లు తెలిపారు. మత్స్యకార్మికుల సమస్యలు పరిష్కరించాలి ఇబ్రహీంపట్నం: చేప, రొయ్య పిల్లల పంపిణీని టెండర్ల విధానం ద్వారా కాకుండా.. ఈ సంవత్సరం మత్స్య సొసైటీ బ్యాంకు ఖాతాలో నగదు జమచేయాలని మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహ ప్రభుత్వాన్ని కోరారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన టీఎంకేఎంకేఎస్ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు గడిచినా మత్స్యశాఖకు మంత్రిని నియమించలేదని విమర్శించారు. జూన్ నెల సమీపిస్తున్నా మత్స్యకారులకు ఇచ్చే చేపపిల్లల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మృగశిర కార్తెను చేపల పండువగా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. చెరువులు, కుంటలు కబ్జాలకు గురికాకుండా చర్యలు చేపట్టాలని, ఎఫ్టీఎల్ హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు కొండల్, రాములు, కె.రాములు తదితరులు పాల్గొన్నారు. జీవాల సంరక్షణకు జాగ్రత్తలు అవసరంరంగారెడ్డి జిల్లా పశువైద్యాధికారి విజయ్కుమార్రెడ్డి మొయినాబాద్: జీవాల సంరక్షణకు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా పశువైద్యాధికారి విజయ్కుమార్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని సురంగల్లో శుక్రవారం పశువైద్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గొర్రెలకు చిటుక రోగం నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం కురిసే వర్షాలకు భూమిపై మొలకెత్తే గడ్డిని తినడం ద్వారా గొర్రెలకు చిటుకరోగం వచ్చే అవకాశం ఉందన్నారు. చిటుకరోగం వస్తే గొర్రెలు వెంటనే మృతి చెందుతాయన్నారు. ఈ రోగం రాకుండా గొర్రెల కాపర్లు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ముందు జాగ్రత్త చర్యగా చిటుక వ్యాధి నివారణ టీకాలు ప్రభుత్వం ద్వారా ఉచితంగా వేస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి శ్రీలత, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు ‘క్రాస్’ గుబులు!
తాండూరు: కాంగ్రెస్ నేతలకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. దశాబ్ద కాలంగా ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఓట్లు వేయించడం మండల, జిల్లా స్థాయి నాయకులకు సర్వసాధారణంగా మారింది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరి తాము మద్దతు ఇచ్చినందుకే గెలిచిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఆరు నెలల క్రితం వరకు బీఆర్ఎస్లో ఉన్న చాలా మంది నాయకులు, ప్రజాప్రతినిధులు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తాము క్రాస్ ఓటింగ్ను ప్రోత్సహించడం వల్లే హస్తం పార్టీ విజయం సాధించిందంటూ ప్రచారం చేసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న నాయకులంతా బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన వారే. గతంలో బలమైన కేడర్తో కనిపించిన పార్టీలు నాయకుల వలస బాట కారణంగా ఓటమిని చవిచూశాయి. కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో సీనియర్లు, చాలా కాలంగా పార్టీనే నమ్ముకొని ఉన్నవారు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి వారంతా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వైపు క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు తెలుస్తోంది. అందరి దృష్టి చేవెళ్లపైనే.. కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతల భవితవ్యం చేవెళ్ల లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంది. జిల్లా పరిధిలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వికారాబాద్, తాండూరు, పరిగి చేవెళ్ల పరిధిలోకి వస్తాయి. కొడంగల్ పాలమూరు పరిధిలోకి వెళుతుంది. జిల్లాలకు చెందిన వారే సీఎంగా, అసెంబ్లీ స్పీకర్గా ఉండటంతో అందరి దృష్టి చేవెళ్ల లోక్సభ అభ్యర్థి గెలుపుపై పడింది. అయితే ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. బీఆర్ఎస్ పోలింగ్కు మూడు రోజుల ముందు నుంచే ప్రచారం నుంచి తప్పుకుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్కు వర్గపోరు, క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. సొంత పార్టీ నాయకులే బీజేపీకి ఓట్లు వేయించినట్లు సమాచారం. తాండూరు అసెంబ్లీ బాధ్యతలను నాయకులు, కేడర్కు అప్పగించకుండా ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, అతని సోదరులు, కుటుంబ సభ్యులే చూసుకోవడం కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడలేదు. ఇది కూడా క్రాస్ ఓటింగ్కు దోహదం చేసిందనే అనుమానాలు ఉన్నాయి. బీజేపీకి కలిసొచ్చేనా? చేవెళ్ల పార్లమెంట్ స్థానం ఆవిర్భవించిన నాటి నుంచి బీజేపీకి ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు. అసెంబ్లీ ఎన్నికలైనా, లోక్సభ ఎన్నికలైనా 2 లక్షల నుంచి 3.50 లక్షల ఓట్లకే పరిమితమవుతూ వచ్చింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు శాశనసభ నియోజకవర్గాల్లో 3.30లక్షల ఓట్లు వచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టిపోటీ ఇవ్వకపోవడంతో ఆ ఓటు బ్యాంక్ తమకే అనుకూలంగా పడుతుందని బీజేపీ భావిస్తోంది. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఓట్లు వేయించిన నేతలు అధికారం ఉన్నచోట వాలిపోతున్న నాయకులు తమ వల్లే అధికారంలోకి వచ్చిందంటూ ప్రచారం కాంగ్రెస్ నుంచి ఇద్దరి సస్పెండ్ తాండూరు టౌన్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు కార్యకర్తలపై కాంగ్రెస్ జిల్లా కమిటీ సస్పెండ్ చేసింది. తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే శ్రీనివాస్ తోపాటు కొర్విచేడ్ గ్రామానికి చెందిన యూత్ ప్రభంజనం అధ్యక్షుడు శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీ రామ్మోహన్ రెడ్డి ఉత్వర్వులు జారీ చేశారు. వీరిద్దరూ లోక్సభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల సస్పెండ్ చేసినట్లు తెలిపారు. -
భూ సమస్య పరిష్కారానికి కృషి
యాచారం: రైతులు ఏళ్లుగా భూ సమస్యలు ఎదుర్కొంటూ సమయంతో పాటు డబ్బును సైతం వృథా చేసుకుంటున్నారని లీఫ్స్ సంస్థ(లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మార్స్ సొసైటీ) ఉపాధ్యక్షుడు జీవన్ పేర్కొన్నారు. యాచారం మండల కేంద్రంలో శుక్రవారం భూ సమస్యలపై రైతులకు అవగాహన కల్పించి, తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 24 గ్రామాల్లో దాదాపు 3 వేలకు పైగానే భూ సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. అనేక సమస్యలు పట్టాదారు, పాసుపుస్తకాల్లో రైతుల పేర్ల మార్పు, మ్యూటేషన్లు, రికార్డుల్లో పేర్లు నమోదు కాకపోవడం వంటివే అన్నారు. వాటి పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులకు సూచించినట్లు తెలిపారు. భవిష్యత్లో మండలంలో భూ సమస్యలు లేని విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నానక్నగర్ మాజీ సర్పంచ్ ముత్యాల వెంకట్రెడ్డి, రైతులు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లీఫ్స్ సంస్థ ఉపాధ్యక్షుడు జీవన్ -
ఇంకెన్నాళ్లు..!
వికారాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం పేదలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చే విషయంలోనూ తాత్సారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదట్లో రేషన్కార్డులు జారీ చేశారు. ఏడాది క్రితం దారఖాస్తు చేసుకున్న వారిలో సగం మందికి కార్డులు ఇచ్చారు. కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఆహార భద్రత పథకంలో భాగంగా లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఆ సమయంలో కుటుంబ సభ్యుల పేర్లను కార్డులో నమోదు చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు సంఖ్య పెరిగినా చేరికలు కాలేదు. సాంకేతిక సమస్యల వల్ల కొంత మంది పేర్లను తొలగించారు. చనిపోయిన వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి వెంటనే తొలగిస్తున్న ప్రభుత్వం జన్మించిన వారి పేర్లు, కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిన వారి పేర్లను మాత్రం నమోదు చేయడం లేదు. ఇలాంటి అర్జీలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. లోక్సభ ఎన్నికల కోడ్ మరో పది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, పేర్ల చేరికపై నిర్ణయం తీసుకోవాలని పేదలు కోరుతున్నారు. పెండింగ్లో వేల దరఖాస్తులు ఎనిమిదేళ్ల క్రితం ఆహార భద్రత కార్డులు మంజూరు చేసిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన జాబితాను ఆన్లైన్లో పొందుపరిచింది. లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు చేయకుండా ఏడాదికి సరిపడా కూపన్లు ఇచ్చింది. ఆ తర్వాత కూపన్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో నెట్ సెంటర్లలో కూపన్లు తెచ్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 35వేల మంది కార్డుల్లో పేర్లు చేర్చాలని దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో మరో 39 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులే ఎక్కువ. 2,41,622 ఆహార భద్రతా కార్డులు జిల్లాలోని 20 మండలాల్లో 588 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. 2,41,622 ఆహార భద్రత కార్డులు మంజూరు చేశారు. ఇందులో 2,08,162 ఎఫ్ఎస్సీ కార్డులు, 26,730 అంత్యోదయా కార్డులు, 39 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా 4,673 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు కొత్త పేర్ల నమోదుకు మోక్షమెప్పుడో? ప్రజాపాలనలో వేల అర్జీలు జిల్లాలో 588 చౌక ధరల దుకాణాలు ఫుడ్ సెక్యూరిటీ కార్డులు 2,41,622 -
‘మాట్రిమోనియల్’ మోసగాడి అరెస్టు
రాయదుర్గం: పెళ్లి సంబంధాలు కుదుర్చుతామని నకిలీ మాట్రిమోనియల్ సైట్ల ద్వారా మోసాలకు పాల్పడున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేకు శుక్రవారం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. మారం అశోక్రెడ్డి అనే వ్యక్తి నకిలీ వెబ్సైట్లు, స్నాప్ చాట్ ద్వారా మహిళలను ఆకర్షిస్తూ మోసగిస్తున్నాడు. ఇటీవల ఓ మహిళకు పెళ్లి సంబంధం పేరిట మాయమాటలు చెప్పి రూ.14 లక్షలు కొట్టేశాడు. దీనిపై ఫిర్యాదు మేరకు విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ఫిట్స్తో మహిళ మృతి
చేవెళ్ల: మతిస్థిమితం లేని ఓ మహిళ ఫిట్స్తో మృతి చెందిన సంఘటన శంకర్పల్లి మండలంలోని మోకిల పోలీస్స్టేషన్ పరిధిలోని మహారాజ్పేటలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలంలోని మహారాజ్పేట్ గ్రామానికి చెందిన వెంకటయ్య, లక్ష్మిలకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు సరిత(25)ను నాలుగేళ్ల క్రితం షాబాద్ మండలంలోని మద్దూర్ గ్రామానికి చెందిన రమేశ్కి ఇచ్చి వివాహం చేశారు. ఆమె మూడు సంవత్సరాలుగా మతిస్థిమితం లేకుండా కుటుంబసభ్యులకు దూరంగా ఉన్నారు. ఇటీవలే సరితను తల్లిదండ్రులు గుర్తించి ఇంటికి తీసుకువచ్చారు. వచ్చిన వారం రోజులు కూడా కాకముందే ఫిట్స్తో ఆమె మృతి చెందారు. కూతురు ఇంటికి వచ్చిందనే సంతోషం కూడా తీరకముందే తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విత్తన ఎంపికలో జాగ్రత్త అవసరం
తాండూరు: విత్తనాల ఎంపికలో రైతులు జాగ్రత్తలు పాటించాలని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి.సుధారాణి అన్నారు. శుక్రవారం తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో విత్తన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రైతులకు నాణ్యమైన విత్తనాలు గుర్తించే పద్ధతిని రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం పంట సాగు విషయంలో శాస్త్రవేత్తలు రైతుల అనుమానాలను నివృత్తి చేశారు. జన్యుపరమైన భౌతిక స్వచ్ఛత కలిగిన విత్తనాలు వాడితే పది నుంచి 15 శాతం వరకు అధిక దిగుబడుగులు సాధింవచ్చునన్నారు. విత్తన శుద్ధితో పంట లాభం ఉంటుందన్నారు. కందిలో అతరపంటగా పెసర, మినుము, సోయా, కొర్రలు సాగు చేసుకుంటే అధిక లాభాలు ఆర్జించవచ్చునని వివరించారు. నల్లరేగడి భూముల్లో కంది జంటసాళ్ల పద్ధతిలో సాగు చేయాలని సూచించారు. నీటి ముంపున్న భూముల్లో బోదెలు, కాల్వల పద్దతిలో పంటలకు అనుకూలంగా మార్చుకోవాలని చెప్పారు. పరిశోధన స్థానం రూపొందించిన కంది విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తెలంగాణ కంది–3(టీడీఆర్జీ–59), ఆశ (ఐసీపీఎల్ 87119) రకాల విత్తనాలు రైతులకు అందజేశామన్నారు. శాస్త్రవేత్తలు డాక్టర్.సుధాకర్చౌరట్, యము న, శేఖర్, రాజేశ్వర్రెడ్డి రైతులు తదితరులున్నారు.తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి -
నీటి ఎద్దడి నివారణ కు నిధులు
● అసంపూర్తి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి ● పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పూడూరు: నీటి ఎద్దడి నివారణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం పూడూరు మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో 200 యూనిట్ల లోపు వా డుతున్న విద్యుత్ వినియోగదారుల నుంచి బిల్లు లు తీసుకోవద్దని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల అభివృద్ధి, అసంపూర్తిగా ఉన్న పనులు, మౌలిక సదుపాయాల కోసం రూ.2కోట్ల నిధులు కే టాయించామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు నియోజవకర్గానికి రూ.2కోట్ల నిధులు కేటాయించామన్నారు. గ్రామా ల్లోని పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. అనంతరం మంచన్పల్లిలో ఆలయం వద్ద బెల్ట్ షాప్ బంద్ చేయాలని ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మణ్ సభ దృష్టికి తెచ్చారు. అధికారులు ప్రజాప్రతిఽనిధులతో కలిసి మండల అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, జెడ్పీటీసీ సభ్యురాలు మేఘమాల, అధికారులు, ఆయా గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
సీజ్ చేసిన ఇసుక వేలం
101 ట్రాక్టర్లకు గాను ప్రభుత్వానికి రూ.2లక్షల ఆదాయం తాండూరు రూరల్: అక్రమంగా తరలిస్తున్న ఇసుకను పోలీస్లు, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఇలా సీజ్ చేసిన 101 ట్రాక్టర్ల ఇసుకకు శుక్రవారం అధికారులు వేలం వేశారు. వివరాల ప్రకారం మండల పరిధిలో చెన్గేస్పూర్ సమీపంలో చేసిన ఇసుకకు ఉదయం తహసీల్దార్ తారాసింగ్, కరన్కోట్ ఎస్ఐ విఠల్రెడ్డి ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. వేలంలో తొమ్మిది మంది పాల్గొన్నారు. ప్రభుత్వం ట్రాక్టర్కు రూ.1,200 ధర నిర్ణయించగా.. రజాక్ రూ.600తో వేలం ప్రారంభించారు. గోపాల్రెడ్డి ఒక్కో ట్రాక్టర్కు రూ.2,425 చొప్పున వేలం దక్కించుకున్నారు. మొత్తం 101 ట్రాక్టర్లకు రూ.2,44,925 కలెక్టర్ పేరుమీద డీడీ చెల్లించి ఆదివారం సాయంత్రం ఇసుక తీసుకెళ్లాలని తహసీల్దార్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ బాలరాజు, పూజరి పాండు, అబ్దుల్రజాక్, సాయిబ్ హుసేన్, వెంకటేశ్, మునీద్, హైమద్, ఎండీ సమీర్ తదితరులు పాల్గొన్నారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ప్రిన్సిపాల్ ఆనంద్రావు తాండూరు రూరల్: మండల పరిధిలోని గౌతపూర్లోని ఎక్స్పర్టేక్ ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని స్వీకరిస్తున్నా మని ప్రిన్సిపాల్ ఆనంద్రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, శానిటరీ ఇన్స్పెక్టర్ డ్రాఫ్ట్మెన్(సివిల్)కోర్సుల్లో సీట్లున్నాయని పదో తర గతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలెపల్లి ఎల్లమ్మ ఆలయ హుండీ లెక్కింపు రూ.5.67లక్షలు సమర్పించిన భక్తులుబొంరాస్పేట: పోలెపల్లి ఎల్లమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కించారు. దుద్యాల మండల పరిధిలోని పోలెపల్లిలో ఈ ఏడాది ఫిబ్రవరి 29 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించిన జాతర ఉత్సవాలకు భక్తులకు అమ్మవారికి సమర్పించిన కానుకలను ఎంచారు. రూ.5,67,108 నగదు వచ్చిందని ఆల య మేనేజర్ రాజేందర్రెడ్డి తెలిపారు. కుమారుడితో కలిసి గృహిణి అదృశ్యం పహాడీషరీఫ్: రెండేళ్ల కుమారుడితో కలిసి గృహిణి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. హర్షగూడ గ్రామానికి చెందిన మోహన్ కుమార్తె అంగోతు శిరీష(22)కు రెండేళ్ల కుమారుడు చోటూ ఉన్నాడు. ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో 15 రోజుల క్రితం పుట్టింటికి తీసుకొచ్చారు. ఈ నెల 23న శిరీష తన కుమారుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో, తల్లి మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 62367 నంబర్లో సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. -
సన్నాలకే సై
దౌల్తాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హమీ మేరకు వరి ధాన్యానికి బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. కేవలం సన్నరకం వడ్లకే బోనస్ అందించాలని ప్రభుత్వం తెలపడంతో వరి సాగు చేసే రైతుల్లో కొందరికే తీపికబురు అందినట్లయింది. వానాకాలం నుంచి బోనస్ చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సన్నరకం సాగు చేసే రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. తక్కువ దిగుబడి మండల పరిధిలో చాలా వరకు రైతులు బోరు బావుల కింద, చెరువుల కింద అత్యధికంగా వరిసాగు చేపడుతారు. సుమారు 10వేల ఎకరాలకు పైగా సాగు చేయనుండగా ఇందులో 80శాతం మంది రైతులు దొడ్డురకం సాగుకే ప్రాధాన్యతనిస్తారు. వానాకాలంతో పోల్చితే యాసంగిలో సన్నరకం వరిసాగులో దిగుబడి సైతం తక్కువగా వస్తుంది. దీంతో దొడ్డురకం సాగుకే మొగ్గుచూపుతారు. బోనస్కు గ్రీన్ సిగ్నల్ తాజాగా ప్రభుత్వం కేవలం సన్నరకం వడ్లకు మాత్రమే క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించడంతో వరిసాగు రైతులు అయోమయంలో పడ్డారు. యాసంగిలో తేమ శాతంతో పనిలేకుండా సన్నరకం ధాన్యానికి ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్కు రూ.2వేల నుంచి 2200 వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో 17లోపు ఉంటే ఏ గ్రేడ్ ధాన్యానికి 2,203, సాధారణ రకానికి రూ.2,183 చెల్లిస్తున్నారు. మార్కెట్లో సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం చెల్లించే ధర కంటే అధికంగా వస్తుండడంతో రైతులు ప్రైవేట్గానే విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వానాకాలంలో రైతులు ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తారా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తారా చూడాలి. తగ్గనున్న దొడ్డురకం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటి వరకు రైతులు వానాకాలంలో సన్నరకం, యాసంగిలో దొడ్డురకం వరిసాగు చేశారు. బోనస్ ప్రకటించడంతో దొడ్డురకం వరి సాగు తగ్గిపోనుంది. దొడ్డురకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ మిల్లర్లు, ప్రైవేట్ వారు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాల్సి ఉంటుంది. క్వింటాలుకు రూ.500 బోనస్ వస్తుండడంతో సన్నరకం వరిసాగు పెరిగే అవకాశం ఉంది. వానాకాలం పంటలకు రూ.500 బోనస్ సన్నరకానికే చెల్లింపు అంటూ ప్రభుత్వ ప్రకటన పెరగనున్న సాగు దొడ్డు వడ్లకు ఇవ్వాలి ప్రభుత్వం కేవలం సన్నరకం వడ్లకు మాత్రమే బోనస్ చెల్తిస్తామని ప్రకటించడం సరికాదు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు పండిస్తున్నాం. కేవలం సన్నరకానికే రూ.500 బోనస్ ఇస్తామనడం సరికాదు. పంటలకు ఏదానికై నా అంతే పెట్టుబడి వస్తుంది. – బసయ్య, దౌల్తాబాద్ తేడాలు చూపొద్దు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే ధాన్యం అంతటికీ బోనస్ చెల్లించాలి. దొడ్డురకం, సన్నరకం తేడా లు చూపవద్దు. దొడ్డురకం ధాన్యాన్ని సాగు చేసే రైతులను ప్రోత్సహించాల్సిన భాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేపట్టి రైతులను ఆదుకోవాలి. – నరోత్తంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు -
కల్లు కోసం గొడవ
కేసు నమోదు చేసిన పోలీసులు అనంతగిరి: ఓ కల్లు దుకాణంలో డబ్బులు విషయంలో జరిగిన గొడవ దాడికి దారితీసింది. వివరాల ప్రకారం.. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గిరిగేట్పల్లిలో జాతరకు ఆలంపల్లికి చెందిన శ్రీనివాస్ తన స్నేహితుడు శంకర్తో కలిసి వెళ్లాడు. గురువారం రాత్రి జాతర చూసుకుని కల్లు తాగేందుకు ఓ కల్లు దుకాణానికి వెళ్లారు. అక్కడ రూ.50 చెల్లించి రెండు సీసాల కల్లు తీసుకున్నారు. దుకాణాదారుడు దత్తుగౌడ్ ఫోన్ మాట్లాడుతూ మళ్లీ డబ్బు అడిగాడు. దీంతో వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఇరువురూ చేయి చేసుకున్నారు. అక్కడ నుంచి శ్రీనివాస్ బయటకు వెళ్తున్న క్రమంలో దుకాణదారుడి స్నేహితులు వచ్చి చితకబాదారు. దీంతో ఆయనకు తలకు, వీపులో తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయమై వికారాబాద్ పోలీస్స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్ సీఐ నాగరాజు తెలిపారు. -
విద్యుదాఘాతంతో దుకాణం దగ్ధం
రూ.20 లక్షల వరకు ఆస్తినష్టం చేవెళ్ల: ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఓ కిరాణా దుకాణం దగ్ధమైంది. ఈ సంఘటన మోకిల పోలీస్స్టేషన్ పరిధిలోకి కొండకల్ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలంలోని కొండకల్ గ్రామంలో గణపతిరెడ్డి కొన్నేళ్లుగా కిరాణ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. రోజు మాదిరిగానే గురువారం రాత్రి దుకాణం బంద్ చేసి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు తెల్లవారుజామున దుకాణంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. ఈ విషయం గమనించి స్థానికులు గణపతిరెడ్డికి సమాచారం అందించారు. వెంటనే ఆయన అక్కడికి చేరుకొని స్థానికుల సహాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు ఎక్కువగా వ్యాపించడంతో దుకాణం బూడి దయింది. దాదాపు రూ.20 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు వాపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్పందించని ఫైర్ సిబ్బంది ప్రమాదంపై స్థానికులు 101కి డయల్ చేశా రు. ఆ సమయంలో గచ్చిబౌలి, మాదాపూ ర్, పటాన్చెరు అగ్నిమాపక కేంద్రాలు శంకర్పల్లి మా పరిధి కాదంటూ కాలయాపన చేశారు. బాధితుడు, స్థానికులు కలిసి మంటలను ఆర్పివేసేందుకు ఇబ్బందులు పడ్డా రు. దీంతో ఫైర్ శాఖ నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పినా స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైర్ సిబ్బంది సకాలంలో స్పందిస్తే ఆస్తినష్టం తగ్గేదని బాధితుడు వాపోయారు. బండ్లగూడ జాగీరు మేయర్ ఎన్నిక ఏకగ్రీవం బండ్లగూడ: గండిపేట మండలం బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ రెండో మేయర్గా లతాప్రేమ్గౌడ్ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజేంద్రనగర్ ఆర్డీ వో వెంకట్రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. మొత్తం 21 మంది కార్పొరేటర్లకుగాను డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి సహా 17 మంది మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మేయర్ ఎన్నిక సమావేశానికి హాజరయ్యారు. కార్పొరేటర్లు అందరూ లతాప్రేమ్ గౌడ్కు మద్దతు తెలపడంతో ఆమె మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ బి.శరత్చంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. కాగా, జనవరి 12న అప్పటి బీఆర్ఎస్ మేయర్ మహేందర్ గౌడ్పై కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్కు అవిశ్వాస నోటీసు ఇవ్వగా ఆయన హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అనంతరం 17 మంది కార్పొరేటర్లు మార్చి 21న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మహేందర్గౌడ్ను తొలగించారు. బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికై న లతాప్రేమ్గౌడ్ కాంగ్రెస్లో చేరి తాజాగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం గమనార్హం. -
ఉపాధ్యాయ దంపతులకు డాక్టరేట్
తాండూరు టౌన్: పట్టణానికి చెందిన యాదగిరి–శ్రీలక్ష్మి దంపతులు ఉస్మానియా వర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. పట్టణంలోని ప్రభుత్వ నంబర్–1 పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న యాదగిరి 2017లో తెలుగు విభాగంలో డాక్టర్ అన్నదానం వేంకట సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో వరంగల్కు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ కవి బండారు సదాశివరావుకు చెందిన ‘సాహిత్యం– సమగ్ర పరిశీలన’ అనే అంశానికి సంబంధించిన పరిశోధన సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. ఇందుకు ఆయన డాక్టరేట్ సాధించినట్లు ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఫ్రొఫెసర్ అర్జున్రావు తెలిపారు. మూడేళ్లలో పూర్తి చేసిన డిగ్రీ లెక్చరర్ యాదగిరి సతీమణి శ్రీలక్ష్మి గురుకుల డిగ్రీ కళాశాల లెక్చరర్గా పనిచేస్తూ చరిత్ర(హిస్టరీ) విభాగంలో ‘ది రోల్ ఆఫ్ దళిత్ విమెన్–సోషల్ రిఫామ్స్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అండ్ తెలంగాణ మూవ్మెంట్’ అనే అంశంపై పరిశోధన సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అర్జున్రావు పర్యవేక్షణలో పరిశోధన చేశారు. కేవలం మూడేళ్లలోనే తన పరిశోధనను పూర్తిచేయడం ఓయూ చరిత్ర విభాగంలోనే అరుదైన ఘటన అని ఆయన శ్రీలక్ష్మిని కొనియాడారు. డాక్టరేట్ సాధించిన దంపతులు యాదగిరి, శ్రీలక్ష్మిలను ప్రొఫెసర్లు కమలాకర శర్మ, విజయలక్ష్మి, కాశీం, సూర్యాధనుంజయ్, రఘు, లావణ్య, ఇందిర, రమేశ్, యాదగిరి తల్లిదండ్రులు పైళ్ల నర్సింహులు, అనంతమ్మ, కుటుంబ సభ్యులు, తాండూరు వాసులు అభినందించారు. తెలుగు సాహిత్యంలో యాదగిరి చరిత్ర నుంచి శ్రీలక్ష్మి అభినందిన తాండూరు వాసులు -
జిప్సం ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయండి
తాండూరు రూరల్: మండల పరిధిలోని గుంతబాసుపల్లి శివారులోని ఇండోస్ కెమికల్ జిప్సం ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ స్తులు మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతు న్న దుర్వాసనతో గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటితో పాటుగా వ్యవసాయ బోర్ల నుంచి సైతం కలుషితమైన నీరు వస్తోందని ఆందోళన వెల్లిబుచ్చారు. గతంలోనూ ఫిర్యాదు చేసినా అనుమతులిచ్చారని.. మరోసారి ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వకుండా రద్దు చేయాలని కోరారు. ఉదయం పీసీబీ డెరెక్టర్ గుంతబాసుపల్లి, మిట్టబాసుపల్లి గ్రామాల్లోని ఫ్యాక్టరీలను సందర్శించారు. ఆయన్ను గ్రామస్తు లు ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వొద్దని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జగదీశ్, గోవింద్, నగేశ్, దస్తయ్యగౌడ్ తదితరులున్నారు. పీసీబీ కమిషనర్కు గుంతబాసుపల్లి వాసుల వినతి -
ఫిర్యాదు చేసేందుకు వస్తే దాడి
తాండూరు టౌన్: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తనపై ఓ కానిస్టేబుల్ దాడి చేశాడని పీడీఎస్యూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ గురువారం రాత్రి స్థానిక పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టాడు. ఆయనకు సీపీఎం, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. వివరాల ప్రకారం.. టీవీఎస్ ఫైనాన్స్ కంపెనీ వారి వద్ద బైక్ కొనుగోలు చేసి వాయిదాలు చెల్లిస్తున్నప్పటికీ తప్పుడు లెక్కలు చూపి డబ్బు చెల్లించాలని వేధిస్తున్నారని.. ఇదే విషయమై స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు కానిస్టేబుల్ సత్తార్ తనపై చేయి చేసుకున్నాడని , ఎస్ఐ కాశీనాథ్ దూషించాడని శ్రీనివాస్ ఆరోపించారు. ఇదే విషయమై ఎస్ఐను వివరణ కోరగా.. వాయిదాలు సక్రమంగా చెల్లించకపోవడంతో పాటు సిబ్బందిని శ్రీనివాస్ దూషిస్తున్నాడని ఫైనాన్స్ కంపెనీవారు ఫిర్యాదు చేశారన్నారు. ఇదే విషయమై మాట్లాడుదామని లోపలికి రావాలని కోరిన కానిస్టేబుల్ సత్తార్ను శ్రీనివాస్ దూషించాడన్నారు. దీంతో వారిద్దరి మధ్య పెనుగులాట జరిగిందే తప్ప దాడి జరగలేదన్నారు. ఈ కేసు పూర్తి విచారాణ చేస్తానని పట్టణ సీఐ సంతోశ్కుమార్ తెలిపారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిపై కానిస్టేబుల్ దౌర్జన్యానికి దిగడం సరికాదని.. పూర్తి విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ నాయకుడు రాజుగౌడ్, విద్యార్థి సంఘం నాయకుడు దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. కానిస్టేబుల్, ఎస్ఐపై చర్యలు తీసుకోని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్టేషన్ ఎదుట ఆందోదళన చేపట్టిన పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ -
వీర బ్రహ్మేంద్రస్వామి సూక్తులు అక్షర సత్యాలు
తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి బషీరాబాద్: పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వా మి కలియుగ మహా కాలజ్ఞానని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. మండలం పరిధిలోని పర్వత్పల్లి గ్రామంలో రెండు రోజులుగా కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్ర స్వామి జాతర ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం ఆలయాన్ని సందర్శించి రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆయన చెప్పిన మాటలన్నీ అక్షర సత్యమయ్యాయని గుర్తు చేశారు. గ్రామాల్లో పండుగలు, జాతర ఉత్సవాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో భక్తితో పాటు ప్రజల మద్య సత్సంబంధాలు నెలకొంటాయన్నారు. అంతకు ముందు గ్రామస్తులు పోలేరమ్మకు బోనాలతో నైవేద్యం పెట్టారు. ఆలయ కమిటీ నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్, సుధాకర్రెడ్డి జైపాల్రెడ్డి, నర్సిరెడ్డి, ప్రతాప్రెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ.పది లక్షల ఉచిత బీమా కల్పించండి
అనంతగిరి: ప్రైవేట్ పాఠశాలల యజమానులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని వివేకవాణి విద్యాలయంలో జిల్లా ట్రస్మా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పాపిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 11వేలకు పైగా ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నాయన్నారు. ట్రస్మా ఆధ్వర్యంలో 35 ఏళ్లుగా ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు డీసీఈబీ ఫీజు ఒకే విధంగా ఉండాలన్నారు. పాఠశాల యాజమానులకు పాఠశాల సిబ్బందికి రూ.10లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించాలన్నారు. విద్యుత్ బిల్లులో రాయితీ ఇవ్వాలన్నారు. బడ్జెట్ పాఠశాల స్థాయిని బట్టి రుణ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి, కోశాధికారి శ్రీకాంత్రెడ్డి, అధికార ప్రతినిధి చింతల రాంచంద్రయ్య, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు ఎం.నాగయ్య, జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, కార్యదర్శి ప్రశాంత్, కోశాధికారి ప్రకాశ్, పట్టణ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి బస్వరాజ్, తాండూరు అద్యక్షుడు రవీందర్రెడ్డి, కార్యదర్శి మోహన్గౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు లూయిస్, కన్వీనర్ వేణుగోపాల్రావు, సభ్యులు అజారుద్దీన్, బాబురావు, సుధీర్, విక్రంరెడ్డి, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘ఆదర్శం’గా పూర్తి చేయండి
కడ్తాల్: ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో భాగంగా ఎంపికై న మండల పరిధిలోని వాస్దేవ్పూర్ ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం ఆమె సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇంజనీరింగ్ బృందం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలల్లో మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. పనులు వేగవంత చేసి సకాలంలో పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షి ంచాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి, డీఈ శ్రీనివాస్, ఏఈ పరమేశ్, ఎంఈవో సర్ధార్నాయక్, నోడల్ అధికారి జంగయ్య తదితరులు పాల్గొన్నారు. గడువులోపు పూర్తి కావాలి మాడ్గుల: అమ్మ ఆదర్శ పాఠశాల పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని గిరికొత్తపల్లి పాఠశాలను గురువారం ఆమె పరిశీలించారు. విద్యుత్, వైరింగ్, నల్లాల ఏర్పాటు పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. గడువులోగా పనులు పూర్తి చేసి విద్యార్థులకు ఆటంకం లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి, మండల విద్యాధికారి సర్ధార్ నాయక్, ఎంపీఓ సూర్యవంశీ, ఎంపీడీవో సరస్వతి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఎంపికై న అమ్మ ఆదర్శ పాఠశాలలపరిశీలన
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- శ్రీదేవికి ఇష్టమైన ఆలయంలో జాన్వీ కపూర్.. ఫోటోలు వైరల్!
- Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
- IPL 2024: వారికి భారీ నజరానా.. బీసీసీఐ కీలక ప్రకటన
- నాగోలులో లిఫ్ట్ ప్రమాదం.. 8 మందికి తీవ్ర గాయాలు
- ఈవీఎం ట్యాంపర్ అయిందా? లేదా?.. చెక్ లిస్ట్తో చూసుకోండిలా..
- అసలు ‘రేవ్’ రచ్చ గురించి తెలుసా?
- జూన్ 1న ఇండియా కూటమి మీటింగ్!.. కీలక విషయాలపై చర్చ
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక: కొనసాగుతున్న పోలింగ్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- మౌంట్ ఎవరెస్ట్పై భారీగా ట్రాఫిక్జామ్!
Advertisement