-
భక్తిశ్రద్ధలతో వాసవీమాత జయంతి
ఆత్మకూర్: పట్టణంలోని వాసవీమాత ఆలయంలో శనివారం రాత్రి ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం కన్యకాపరమేశ్వరి జయంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. పూజారుల సమక్షంలో కుమారి పూజ, కలశాల ఊరేగింపు, అభిషేకం, చండీహోమం, కుంకుమార్చన, రాత్రి లక్ష పుష్పార్చన, మహా మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని వీధుల్లో ఊరేగింపు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు కల్వ రాజయ్య, రమేష్శెట్టి, నీలేష్, ఉదయ్, బాలకృష్ణ, నవీన్, చంద్రశేఖర్, ఓరుగంటి ప్రవీణ్, రామకృష్ణ, రమేష్, రామ్మోహన్, రాఘవేంద్ర, విజయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కాన్పూర్, బెంగళూరులలోని భారత వాయుసేన విభాగంలో సంగీతకారుడి నియామకానికి అర్హులైన అభ్యర్థులు ఈనెల 22 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఉపాధి కల్పన అధికారి మహ్మద్ జానీపాషా ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు http://agnipathvayu.cdac.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 2004 జనవరి 2 నుంచి 2007 జూలై 2 మధ్య జన్మించిన అవివాహిత పురుషులు, మహిళలు అర్హులని పేర్కొన్నారు. తాత్కాలికంగా అడ్మిట్ కార్డు జారీ చేసిన నమోదిత అభ్యర్థులు మాత్రమే రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతి ఇస్తారని, ముఖ్యంగా రిక్రూట్మెంట్ ర్యాలీ తేదీ, సమయం తాత్కాలిక అడ్మిట్ కార్డులో ఉంటుందని తెలిపారు. -
ప్రాచీన కళలను కాపాడుదాం
ఖిల్లాఘనపురం: ప్రాచీన కళలను కాపాడుకొని డప్పు కళాకారులను బతికించుకుందామని డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలయ్య పిలుపునిచ్చారు. శనివారం డప్పు కళాకారుల సంఘం 6వ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 12 లక్షల మందికిపైగా కళాకారులు డప్పే జీవనంగా సాగిస్తున్నారని, వారందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలని, 50 ఏళ్లు నిండిన వారికి రూ.3 వేలు పింఛన్ ఇవ్వడంతో పాటు జీవిత బీమా కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బి.రాజు, రంగయ్య, ఎం.అశోక్, ఆంజనేయులు, మన్యం, దాసు, శేషన్న, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా గ్రూప్–1 పరీక్ష
వనపర్తి: జిల్లాలో జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తేజస్ పవార్ వెల్లడించారు. శనివారం టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్, అదనపు కలెక్టర్లు, పరీక్ష సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రూప్–1 పరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉదయం 10.30కి పరీక్ష ప్రారంభం కానుండగా.. అభ్యర్థులు పదిలోపే కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 9 నుంచే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు వివరించారు. 10 తర్వాత గేట్లు మూసివేస్తామని.. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని తెలిపారు. అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకుంటామని.. రెండంచెల్లో తనిఖీలు, గేటు వద్ద, లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పెన్ను, హాల్టికెట్ తప్పా ఇతర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతించమని చెప్పారు. ఎస్పీ, సంబంధిత అధికారుల సమన్వయంతో పరీక్షను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారన్నారు. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు.. ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం, కేంద్రాల వద్ద మౌలిక వసతులతో పాటు ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలను నియమించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. పరీక్షలు జరగనున్న ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేసేందుకు తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. స్ట్రాంగ్రూమ్ వద్ద పోలీసు భద్రత, బందోబస్తు ఏర్పాటు చేయాలని అడిషనల్ ఎస్పీ రామదాసు తేజావత్ను ఆదేశించారు. డీఐఈఓ సి.మద్దిలేటి మాట్లాడుతూ.. జిల్లాలో 6,134 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 3,978, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 2,156 మంది ఉన్నారని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. నగేష్, జిల్లా వైద్యాధికారి డా. జయచంద్ర మోహన్, తహసీల్దార్ కిషన్నాయక్ పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
అమరచింత: జిల్లాలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి డి.చంద్రశేఖర్ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంతో పాటు నాగల్కడ్మూర్లోని పలు దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి నిల్వలు, క్రయ, విక్రయాలకు సంబంధించిన రిజిస్టర్లు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులను మోసం చేయడానికి దళారులు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారని, నకిలీ విత్తనాలను విక్రయించేందుకు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారనే సమాచారంతో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. రైతులు గుర్తింపు పొందిన దుకాణాల్లోనే నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి రసీదులు తీసుకొని భద్రపర్చుకోవాలని సూచించారు. పంట దిగుబడి సరిగా రానప్పుడు విత్తనాలు విక్రయించిన వారిపై ఫిర్యాదు చేస్తే శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. దుకాణదారులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలను ఈపీఓఎస్ యంత్రాలతోనే జరపాలని సూచి ంచారు. మండల వ్యవసాయ అధికారులు, క్లస్టర్ వ్యవసాయ అధికారుల సూచన మేరకు ఏ పంటకు ఎంత మేర ఎరువులు వాడాలి.. ఎలాంటి విత్తనాలు ఎలాంటి వాడాలన్న విషయాలను తెలుసుకొని సాగు చేసుకోవాలని కోరారు. ఆయన వెంట ఏఓ వినయ్, ఏఈఓ రాజేష్ తదితరులు ఉన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి డి.చంద్రశేఖర్ -
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తిటౌన్: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరం మొదటి విడత ప్రవేశాలకుగాను దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ బక్కన్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.https//iti.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని.. జూన్ 10వ తేదీ వరకు అవకాశం ఉందని వెల్లడించారు. పూర్తి వివరాలకు సెల్ఫోన్ నంబర్ 98496 43932 సంప్రదించాలని పేర్కొన్నారు. సోనామసూరి క్వింటా రూ.2,419 దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం జరిగిన టెండర్లలో సోనామసూరి ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,419, కనిష్టంగా రూ.2,000 ధరలు నమోదయ్యాయి. సీజన్ తగ్గడంతో మార్కెట్కు 400 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
నిర్వహణ.. నిర్లక్ష్యం
వనపర్తిఆదివారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2024వనపర్తి టౌన్: స్థానిక పురపాలికలోని బండారునగర్, నందిహిల్స్, కేడీఆర్నగర్ పార్క్లలో నాలుగున్నర ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం రూ.30 లక్షలు వెచ్చించి ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసింది. ఉదయం, సాయంత్రం వేళల్లో బాలలు, వాకర్స్, మహిళలు వ్యాయామం చేసేందుకు అవసరమైన ఆధునిక పరికరాలను సమకూర్చినప్పటికీ ప్రస్తుతం నిర్వహణ, శిక్షకులు లేక మరమ్మతులకు గురయ్యాయి. కేడీఆర్నగర్లోని జిమ్కు ప్రహరీ లేకపోవడంతో ఇష్టానుసారంగా వాడటంతో కొన్ని పరికరాలు విరిగిపోయాయి. పరికరాలకు గ్రీస్ పెట్టకపోవడంతో శబ్ధం వస్తున్నాయని, విరిగిపోతున్నాయని జిమ్కు వచ్చే పట్టణవాసులు చెబుతున్నారు. చిన్నారులు వినియోగించే పరికరాలు లేకపోవడంతో వారు నచ్చిన రీతిలో వినియోగిస్తుండటంతో మరమ్మతులకు గురవుతున్నాయని తెలిపారు. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ లేక శిక్షకులను నియమించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. వ్యాయామంపై అవగాహన ఉన్న కొందరు మాత్రం ఉన్న వాటిని సరైన రీతాలో వినియోగిస్తుండగా.. మరికొందరు తమకు వచ్చిన రీతిలో చేస్తూ మరమ్మతులకు గురిచేస్తున్నారు. బండారునగర్ ఓపెన్ జిమ్లోని పలు పరికరాలు విరిగిపోవడం.. వాటికి ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారు. నందిహిల్స్లో ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్లో నాసిరకం పరికరాలను బిగించడంతో కొద్ది రోజులకే మరమ్మతులకు గురయ్యాయని కాలనీవాసులు చెబుతున్నారు. అధికారులు ఏడాది కిందట మరమ్మతులు చేయించినా పూర్తిస్థాయిలో వినియోగంలో లేక కొన్ని పరికరాల విడి భాగాలు పార్క్లో అక్కడక్కడ పడి ఉన్నాయి. ఓపెన్ జిమ్ల నిర్వహణ మూన్నాళ్ల ముచ్చటగా మారడంతో పుర పాలకుల పనితీరుపై పట్టణ ప్రజ లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ శిక్షకులు లేక అలంకారప్రాయంగా మారుతున్నాయి. వనపర్తిలో వృథాగా మారిన ఓపెన్ జిమ్లు కానరాని శిక్షకులు.. విరిగిపోతున్న పరికరాలు పట్టించుకోని పాలకులు, అధికారులు నిర్వహణ మరిచారు.. పార్క్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. కానీ.. నిర్వహణ, సర్వీసింగ్ లేక పరికరాల్లో శబ్ధాలు వస్తున్నాయి. కొన్నింటి భాగాలు విడిపోయాయి. చిన్న పిల్లలకు అవసరమైన కొన్ని యంత్రాలను సమకూర్చాలి. అధికారులతో పాటు ప్రజలు కూడా ఓపెన్ జిమ్, పార్క్ల నిర్వహణకు శ్రద్ధ చూపాలి. – సత్తార్, నందిహిల్స్ మరమ్మతు చేయిస్తాం.. పురపాలికలోని ఒక ఓపెన్ జిమ్లో యంత్రాల భాగాలు విరిగిపోవడం చూశా. మిగతా రెండు జిమ్లు ఎక్కడున్నాయో తెలుసుకొని వాటిని పరిశీలించి మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. ఏఈ సాయిచరణ్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. నిర్వహణ మెరుగుపరిచేలా చూస్తాం. – పూర్ణచందర్, పుర కమిషనర్, వనపర్తి -
రోజు రూ.2 కోట్లకుపైగానే..
ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపించింది. ఈ నెల 12 మినహాయించి మిగతా రోజుల్లో మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ నిత్యం రూ.2 కోట్లపైగా ఆదాయం వచ్చింది. ఆర్టీసీ రీజియన్ అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవడంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా అన్ని డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో అధిక ఆదాయం సమకూరింది. ఈ మార్గంలోని బస్సులు ప్రయాణికులతో కనిపించాయి. మహాలక్ష్మి పథకం ప్రయాణికులతోపాటు ఇతరులు అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. ఈ రోజుల్లో ఆర్టీసీ రీజియన్ మెరుగైన ఆక్యుపెన్షి రేషియోను పొందింది. ఈ ఐదు రోజుల్లో రీజియన్లోని పది డిపోలు 100కుపైగా ఓఆర్ను సాధించింది. -
చి‘వరి’కీ కష్టాలే..
పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి, శుక్రవారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది. కళ్లెదుటే తడుస్తున్న వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడుతున్న కష్టాలు వర్ణాతీతం. తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెబ్బేరులోని మార్కెట్యార్డులో సుమారు రెండు వేల క్వింటాళ్లు, సూగూరులో 600 క్వింటాళ్ల ధాన్యం విక్రయానికి కేంద్రాలకు తీసుకొచ్చామని.. తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకు చూపి నిర్వాహకులు సకాలంలో కొనుగోలు చేయలేదని రైతులు ఆరోపించారు. కేంద్రాలకు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా.. నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతో తడిసి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. – పెబ్బేరు రూరల్ -
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన
వనపర్తి: విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ తేజస్ పవార్ వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం సీఎస్ శాంతకుమారి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో అమ్మ ఆదర్శ పాఠశాల, పాఠ్య పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, వరి ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ అప్పగింత తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 537 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 183 పాఠశాలల్లో మన ఊరు–మన బడి కార్యక్రమంలో సదుపాయాలు కల్పించామని, అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో 317 పాఠశాలలను ఎంపిక చేసి మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతు పనులు గుర్తించి పనులు చేపడుతున్నట్లు వివరించారు. విద్యార్థులకు యూనిఫాం అందించేందుకు అవసరమైన మేర వస్తం వచ్చిందని.. ఇతర సామగ్రి కొనుగోలు చేసి మహిళా సంఘాల ద్వారా కుట్టించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జిల్లాలోని 42,681 విద్యార్థులకు యూనిఫాం ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి యూనిఫాంలు సిద్ధం చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని, అకాల వర్షాలకు తడిచి నష్టపోకుండా ఎప్పటికప్పుడు సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీఎంఆర్ సేకరణకు మిల్లర్లతో తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎం.నగేష్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ పవార్ -
ఈ–శ్రామ్ను సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తిటౌన్: అసంఘటిత కార్మికులు ఈ–శ్రామ్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కోరారు. శుక్రవారం కోర్టు ఆవరణలో అసంఘటిత కార్మికులకు ఈ–శ్రామ్ పోర్టల్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 16 నుంచి 59 ఏళ్లలోపు వయసున్న మత్స్యకారులు, భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేసీ్త్రలు, ప్లంబింగ్, పేయింటర్, టైల్స్, ఎలక్ట్రికల్, వెల్డింగ్, ఇటుక, చేనేత, కుమ్మరి, కమ్మరి, క్షౌ రవృత్తుల ఇలా ఆదాయ పన్ను పరిధిలోకి రాని వారు అర్హులని పేర్కొన్నారు. అనంతరం పోర్టల్కు సంబంధించిన వాల్పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని, మొదటి అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి బి.శ్రీలత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.మోహన్ కుమార్ యాదవ్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎన్.బాలనాగయ్య, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జి.ఉత్తరయ్య, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. రాజీయే రాజమార్గం.. రాజీయే రాజ మార్గమని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో వచ్చే నెల 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్పై శుక్రవారం న్యాయవాదులు, పోలీసులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించాలని, సివిల్, ప్రీలిటిగేషన్, చెక్ బౌన్స్, బ్యాంకు, యాక్సిడెంట్, ఇన్స్యూరెన్స్, చిన్న చిన్న తగాదా కేసులపై దృష్టి సారించాని కోరారు. కార్యక్రమంలో ప్రధాన సివిల్ కోర్టు న్యాయమూర్తి వి.రజని, మొదటి అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి బి.శ్రీలత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.మోహన్కుమార్యాదవ్, న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
వేసవి శిక్షణకు గ్రహణం
జిల్లాలోని 6 మండలాల్లో కనిపించని క్రీడా శిబిరాలు వనపర్తి: జిల్లాలో వేసవి క్రీడా శిబిరాల ఏర్పాటుపై నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది. ఈ నెల ఒకటి నుంచి జూన్ ఒకటి వరకు నెలరోజుల పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లోని విద్యార్థులు, యువకుల ఆసక్తి మేరకు వేసవి శిబిరాలు ఏర్పాటు చేసేందుకు శాట్ అనుమతించింది. అధికారులు ఎన్నికల హడావుడి పేరుతో చొరవ చూపకపోవటంతో రేవల్లి, పాన్గల్, వీపనండ్ల, చిన్నంబావి, కొత్తకోట, అమరచింత మండలాల్లో శిబిరాలు ఏర్పాటు కాలేదు. గతేడాది కలెక్టర్ తేజస్ పవార్ చొరవతో 17 వేసవి క్రీడా శిబిరాలు ఏర్పాటుకాగా.. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల సాకు చూపి అరకొరగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 14 మండలాలు ఉండగా.. కేవలం 8 మండలాల్లో శిబిరాలు కొనసాగుతున్నట్లు అధికారిక లెక్కల ద్వారా స్పష్టమవుతోంది. శిబిరాలు ఏర్పాటు చేసిన మండలాల్లోనూ నేటికీ ఎలాంటి క్రీడా సామగ్రి పంపిణీ చేయలేదని క్రీడాకారులు చెబుతున్నారు. మంత్రి ఇలాఖాలోనూ.. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మూడు మండలాల్లోనూ ఒక్క వేసవి శిబిరం ఏర్పాటు చేయకపోవటం గమనార్హం. ఈ ప్రాంత క్రీడాకారులు కనీసం మాకు సమాచారం కూడా లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 55 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, ఐదుగురు ఫిజికల్ డైరెక్టర్లు, 12 మంది ఆర్వీఎం కాంట్రాక్టు పీఈటీలు ఉన్నారు. జిల్లాలో 255 గ్రామపంచాయతీలు ఉండగా.. కేవలం 8 మాత్రమే వేసవి క్రీడా శిబిరాలు ఏర్పాటు చేయటం శోచనీయం. ఇవీ నిబంధనలు.. క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు వేసవి క్రీడా శిబిరాలు ఏర్పాటు చేస్తారు. శాట్ ద్వారా కోచ్కు గౌరవ వేతనం రూ.4 వేలు, శిబిరం నిర్వహించే మైదానం సిద్ధం చేసేందుకు రూ.వెయ్యి, క్రీడాకారులు గాయపడితే ఔషదాల కొనుగోలుకు రూ.500 చెల్లిస్తారు. మంత్రి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మండలాల్లోనూ.. దరఖాస్తులు రాలేదంటున్న అధికారులు దరఖాస్తులు రాలేదు.. జిల్లావ్యాప్తంగా వేసవి శిబిరాలు ఏర్పాటు చేశాం. రేవల్లి, పాన్గల్, వీపనండ్ల, చిన్నంబావి, కొత్తకోట, అమరచింత మండలాల నుంచి దరఖాస్తులు రాకపోవడంతో ఏర్పాటు చేయలేదు. శిబిరాల నిర్వహణకు శాట్ నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదు. శిబిరాల నిర్వహణకు క్రీడా సామగ్రిని నిర్వాహకులే కొనుగోలు చేస్తే.. బిల్లులు చెల్లిస్తామని చెప్పాం. గతేడాది కలెక్టర్ చొరవతో 17 శిబిరాలు ఏర్పాటుచేసిన మాట వాస్తవమే. – సుధీర్రెడ్డి, డీవైఎస్ఓ -
పుర ఖజానా ఖాళీ : చైర్మన్
వనపర్తిటౌన్: పురపాలికలో ఏ చిన్న పని చేద్దామన్నా.. ఖాజానాలో డబ్బులు లేవని స్థానిక పుర చైర్మన్ పుట్టపాగ మహేశ్ తెలిపారు. శుక్రవారం పుర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత చైర్మన్ గట్టుయాదవ్ చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని.. ఏ దస్త్రం ముట్టుకున్నా అవినీతి మరకే కనిపిస్తుందని ఆరోపించారు. లింగిరెడ్డికుంట షాపింగ్ కాంప్లెక్స్లో డబ్బాల ఏర్పాటులో అవినీతికి పాల్పడ్డారని.. లక్షాధికారులు, కార్లున్న వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించి పేదలను విస్మరించారని మండిపడ్డారు. దుకాణదారులకు ఎందుకు ఇళ్లు కేటాయించారని ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకురాకుండా అన్నింటికీ మున్సిపల్ నిధులు వాడి దొడ్డిదారిన సీఆర్లు ఇచ్చి బిల్లులు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆర్టీసీకి కలిసొచ్చిన ఓట్ల పండుగ
స్టేషన్ మహబూబ్నగర్: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల సమయంలో ఆర్టీసీకి మెరుగైన ఆదాయం వచ్చింది. ఎన్నికలకు ముందు, తర్వాత ప్రజలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడంతో సంస్థకు భారీ ఆదాయం సమకూరింది. చాలామంది ప్రజలు ఓట్లు వేయడానికి తమ స్వస్థలాలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడంతో బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. సిబ్బందికి స్వీట్లు పంపిణీ లక్షే లక్ష్యంలో భాగంగా ఆర్టీసీ రీజియన్ అధిక ఆదాయం సాధించడంతో శుక్రవారం రీజియన్లోని డిపోల ఉద్యోగులు, సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. స్థానిక ఆర్టీసీ డిపోలో జరిగిన కార్యక్రమంలో ఆర్ఎం శ్రీదేవి పాల్గొని ఉద్యోగులకు స్వీట్లు అందజేసి అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ లక్షే లక్ష్యంలో ఈ నెల 14న అధిక ఆదాయం రావడంతో మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశామన్నారు. కార్మికుల కృషి ఫలితమే రీజియన్ మంచి ఆదాయం సాధించిందని, భవిష్యత్లో మరింత స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. డిప్యూటీ ఆర్ఎంలు లక్ష్మీదుర్గ, శ్యామల, డిపో మేనేజర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. డిపోల వారీగా వచ్చిన ఆదాయం ఇలా.. (రూ.లలో) డిపో ఆదాయం మహబూబ్నగర్ 2,05,17,341 వనపర్తి 1,75,92,078 గద్వాల 1,48,22,933 కల్వకుర్తి 1,43,12,034 నారాయణపేట 1,32,16,980 నాగర్కర్నూల్ 1,31,58,317 అచ్చంపేట 1,29,87,379 షాద్నగర్ 1,22,27,375 కొల్లాపూర్ 1,05,87,464 కోస్గి 17,63,092 ఎన్నికల వేళ ప్రతిరోజు రూ.2 కోట్లకుపైగా ఆదాయం తిరుగు ప్రయాణంలో మరింత పెరిగిన రాబడి సిబ్బందికి అభినందనలు తెలిపిన ఆర్ఎం -
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తిటౌన్: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 2024–25 విద్యాసంవత్సరం ప్రవేశాలకుగాను ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నుషిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతి (డే స్కాలర్స్), 5వ తరగతి (రెసిడెన్షియల్)లో ప్రవేశాలకు జిల్లావాసులైన విద్యార్థులు అర్హులని, గ్రామీణ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలు మించకూడదని వెల్లడించారు. 1వ తరగతిలో ప్రవేశాలకు 2018, జూన్ 1 నుంచి 2019, మే 31 మధ్యలో జన్మించిన వారై ఉండాలని.. జూన్ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు కార్యలయంలో సంప్రదించాలని సూచించారు. -
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో గురువారం డిగ్రీ 2, 6వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 49 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉదయం జరిగిన రెండో సెమిస్టర్ పరీక్షకు 11,848 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 11,227 మంది హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం జరిగిన ఆరో సెమిస్టర్ పరీక్షకు 11,448 మందికిగాను 11,108 మంది హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, కొండనాగులలో ఇద్దరు, నాగర్కర్నూల్లో ఒక విద్యార్థి మాల్ ప్రాక్టిస్కు పాల్పడుతూ అధికారులకు పట్టుబడగా.. డిబార్ చేసినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజ్కుమార్ తెలిపారు. -
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
● నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 264 పోలింగ్ కేంద్రాల్లో 2,36,094 మంది ఓటర్లు ఉండగా.. 1,60,394 మంది ఓటేశారు. 75,700 మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో 67.94 శాతం పోలింగ్ నమోదైంది. ● అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో 339 పోలింగ్ కేంద్రాల్లో 2,47,729 మంది ఓటర్లు ఉండగా.. 1,61,301 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇంకా 86,428 మంది ఓటుకు దూరంగా ఉండిపోవడంతో 65.11 శాతంగా నమోదైంది. ● కల్వకుర్తి అసెంబ్లీ పరిఽధిలో 271 పోలింగ్ కేంద్రాల్లో 2,44,405 మంది ఓటర్లు ఉండగా.. 1,77,226 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 67,179 మంది ఓట్లకు దూరంగా ఉన్నారు. 72.51శాతం మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. ● కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 282 పోలింగ్ కేంద్రాల్లో 2,39,463 మంది ఓటర్లుండగా.. 1,55,917 మంది ఓటింగ్ వేశారు. 83,546 మంది ఓటింగ్లో పాల్గొనలేదు. దీంతో ఇక్కడ 65.11శాతం నమోదైంది. ● వనపర్తిలో 307 పోలింగ్ కేంద్రాల్లో 2,73,863 మంది ఓటర్లుకు గాను 1,82,552 ఓట్లు పోల్ అయ్యాయి. 91,311 మంది పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయారు. 66.66శాతం నమైదెంది. ● అలంపూర్లో 291 పోలింగ్ కేంద్రాల్లో 2,40,063 మంది ఓటర్లకు గాను 1,77,780 మంది తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోగా.. 62,283 మంది ఓటుకు దూరంగా ఉండిపోయారు. దీంతో అక్కడ 74.06శాతం నమోదైంది. ● గద్వాల నియోజకవర్గ పరిధిలో 303 పోలింగ్ కేంద్రాల్లో 2,56,637 మంది ఓటర్లకు 1,92,300 మంది ఓటు వేశారు. ఇంకా 64,337 మంది ఓట్లు వేయలేదు. 74.93 శాతం నమోదు కావడంతో పార్లమెంట్ పరిధిలో భారీగా ఓటింగ్ శాతం తగ్గింది. ● మధ్య వయస్కులు, వృద్ధుల కంటే యువతే తక్కువగా ఓటింగ్లో పాల్గొన్నట్లు కనిపిస్తోంది. అంతే కాక గ్రామీణ, గిరిజన తండాల్లో ఓటర్లు అధికంగా పాల్గొన్నప్పటికీ పట్టణాల్లో తగ్గింది. పట్టణ ఓటర్లలో చాలా మంది ఓటేసేందకు ఇష్టపడలేదు. దీంతో పట్టణ ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు గెలుపుపై ప్రభావం చూపనుంది. తగ్గిన పోలింగ్ ఏ అభ్యర్థి విజయావకాశాలను దెబ్బతీస్తుందనే అసక్తి నెలకొంది. -
జూరాలకు 2,451 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి స్వల్పంగా ఇన్ఫ్లోలు వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. స్థానికంగా వర్షాలు కురవడంతో పాటు, ప్రాజెక్టు ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి గురువారం జూరాల ప్రాజెక్టుకు 2,451 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.907 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ప్రాజెక్టు నుంచి 125 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. -
మాటమార్చితే.. సహించం
వనపర్తి: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వరిధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్.. సన్నాలకే ఇస్తామని మాట మార్చితే.. ఊరుకునేది లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ అన్నారు. గురువారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ విషయంపై స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది రైతులు దొడ్డు రకం వరి సాగు చేస్తారని.. కొద్దిపాటి సన్నాలు సాగుచేసే రైతులకే బోనస్ ఇచ్చి చేతులు దులుపుకొనేందుకు కాంగ్రెస్ పాలకులు కొత్తరాగం ఎత్తుకున్నారని ఆరోపించారు. ఇప్పటికే రైతులకు రుణ మాఫీ, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేయకుండా రైతులను గోస పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజకొంటామని, వరికి రూ.500, మక్కలకు రూ.330, చెరుకుకు రూ.850, పప్పుధాన్యాలకు రూ.300 నుంచి రూ.500 వరకు, పసుపు, మిర్చికి రూ.800 బోనస్ ఇస్తామని, రైతుల ఓట్లు దండుకుని గెద్దెనెక్కిన తర్వాత కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులతో కలిసి నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు నాగన్న యాదవ్, బండారు కృష్ణ, నాయకులు ఆవుల రమేష్, మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. ఓటుహక్కు వినియోగంపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సామాజిక మధ్యమాల ద్వారా కొత్త ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారం చేపట్టారు. ఎన్నికల విధుల్లో ఉండి ఓటుకు దూరమయ్యే వారు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు మరిన్ని వర్గాలకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించారు. వైద్యులు, మెడికల్ సిబ్బంది, జర్నలిస్టులు, ఇతర ఎమర్జెన్సీ విభాగాల వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందించారు. మారుమూల ప్రాంతాలు, గిరిజన ఆవాసాలు, చెంచు గూడెల్లోని ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగం కోసం అదనంగా 113 పోలింగ్ ఉపకేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రధానంగా చెంచుపెంటల్లోనూ తాత్కాలిక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల్లో చెంచులు, గిరిజనులు, వృద్ధులు భాగస్వామ్యమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా గత లోక్సభ ఎన్నికలకన్నా ఈసారి ఓటింగ్ పెంచడంలో ఎన్నికల యంత్రాగం సఫలీకృతమైంది. -
ప్రణాళిక ఏదీ..?
మూడేళ్లుగా అంచనాలు లేకుండానే పంటల సాగు ● విత్తన రాయితీ ఎత్తివేయడంతో ప్రణాళికలు తయారు చేయని వ్యవసాయశాఖ ● ప్రభుత్వం మారినా.. దృష్టి సారించని వైనం ● విత్తనాలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వ విత్తన సంస్థలు ● ఎక్కువ శాతం మిగిలిపోవడంతో వేలంలో తక్కువ ధరకు విక్రయాలు రాష్ట్రస్థాయిలో కొనసాగుతోంది.. విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయడంతో పాటు పంటల సాగులో సమతుల్యతకు సాగు ప్రణాళికలు దోహదపడేది. ప్రస్తుతం ప్రణాళికలు వ్యవసాయశాఖ ప్రధాన కార్యాలయంలోనే చేస్తున్నారు. మెట్ట పంటల సాగు తగ్గడానికి ప్రధాన కారణం సాగునీటి లభ్యత పెరగడం. తక్కువ శ్రమతో సాగయ్యే పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. – చంద్రశేఖర్, ఇన్చార్జ్ డీఏఓ, వనపర్తి వనపర్తి: దశాబ్దాలుగా కొనసాగుతున్న సాగు ప్రణాళికలకు వ్యవసాయశాఖ చెల్లుచీటి ఇచ్చేసింది. గత ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేసిన నాటి నుంచి విత్తన రాయితీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇదే అదునుగా భావించిన వ్యవసాయశాఖ జిల్లాల వారీగా ఏటా వానాకాలం, యాసంగి సీజన్లో తయారు చేయాల్సిన సాగు ప్రణాళిక (పంటల వారీగా సాగుచేసే అంచనా వివరాలు)కు నీళ్లొదిలింది. దీంతో జిల్లాకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నా.. వ్యవసాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వరంగ విత్తనాభివృద్ధి సంస్థలు గతేడాది వానాకాలం, యాసంగి సీజన్లో సాగైన పంటల ఆధారంగా విత్తనాలు సిద్ధం చేయడం.. ఎక్కువ శాతం మిగిలిపోవడంతో వేలంలో తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతోపాటు ఆర్కేవీవై లాంటి రైతులకు వ్యవసాయ సామగ్రి ఇచ్చే పథకానికి రైతుబంధు పథకం అమలుతో చెక్ పడినట్లయింది. ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ పథకం నిధులు సైతం ఆగిపోయినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఆర్నెల్లు గడుస్తున్నా.. ఈ విషయంపై పాలకులు దృష్టి సారించకపోవడంతో ప్రస్తుత వానాకాలం సీజన్లోనూ సాగు ప్రణాళిక తయారు చేయలేదని వ్యవసాయ అధికారుల ద్వారా తెలుస్తోంది. జిల్లాలో నాలుగేళ్లుగా వానాకాలం సీజన్లో వరి, పత్తి, కంది పంటలు మాత్రమే ఎక్కువగా సాగు చేస్తున్నారు. గతేడాది 2.39 లక్షల ఎకరాలు.. గతేడాది వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 2.39 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేసినట్లు వ్యవసాయశాఖ ఇదివరకే గణాంకాలు వెల్లడించింది. ఇందులో వరి 1.83 లక్షలు, మొక్కజొన్న 12,077, జొన్న 1,455, పత్తి 20,989, కంది 6,190, ఆముదం 8,87, చెరుకు 1,347 ఎకరాలు సాగు చేయగా.. మిగిలిన విస్తీర్ణంలో వేరే రకాల పంటలు వేసినట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. ఏటా తగ్గుతున్న మెట్ట పంటలు.. జిల్లాలో ప్రతి ఏటా మెట్టపంటల సాగు విస్తీర్ణం తగ్గుతోంది. నూనె, పప్పుగింజల పంటల సాగు తగ్గడం, వాటి స్థానంలో వరి సాగు పెరుగుతుండటం గమనార్హం. అన్ని రకాల పంటల సాగుపై ఏటా రైతులకు అవగాహన కల్పించే రైతు చైతన్య సదస్సులు సైతం నిర్వహించకపోవటం గమనార్హం. -
దాహం తీరినట్లే..!
నీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలుప్రభుత్వం చొరవతోనే.. రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే ఎగువన ఉన్న కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ డ్యాం నుంచి 1.9 టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేసింది. వేసవిలో ప్రజలకు పూర్తిస్థాయిలో నీటి ఇబ్బందులు కలుగకుండా జూరాలలో నీటి నిల్వను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుతం జూన్ చివరి నాటికి తాగునీటి సరఫరాకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. – జగన్మోహన్, ఈఈ అమరచింత: ఉమ్మడి పాలమూర్ జిల్లా వ్యాప్తంగా తాగునీటిని అందిస్తున్న జూరాల ప్రాజెక్టు జలాశయం రోజురోజుకు తగ్గుముఖం పడుతుంది. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎగువన ఉన్న నారాయణపూర్ డ్యాం నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. దీంతో స్పందించిన కర్ణాటక ప్రభుత్వం అడిగిన రెండు టీఎంసీల నీటిని ఇవ్వలేమని, ప్రస్తుతానికి 1.9 టీఎంసీల నీటిని విడుదల చేసింది. దీంతో ఐదు రోజుల నుంచి నెమ్మదిగా జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న నీటితో రోజురోజుకు ఇన్ఫ్లో పెరిగిపోతుండటంతో ఇక వేసవిలో తాగునీటి కష్టాలు గట్టెక్కినట్లేనని అధికారులు తెలియజేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు తాగునీటితో పాటు సాగు, విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని అందించే ప్రాజెక్టుగా పేరుగాంచింది. కాని వరదలు వచ్చినప్పుడు అత్యధికంగా నీటిని నిల్వ ఉంచుకోలేని పరిస్థితిలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో కేవలం 11 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచుకుని, మిగిలిన నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితులు దాపురించాయి. జూరాలపై ఆధారపడిన తాగునీటి పథకాలు.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీటిని అందించేందుకు శ్రీకారం చుట్టారు. రామన్పాడ్ రిజర్వాయర్తో పాటు జూరాల ప్రాజెక్టుతో మొత్తంగా 17 తాగునీటి పథకాలకు నిత్యం నీటిని అందిస్తున్నారు. ఆత్మకూర్, అమరచింత, వనపర్తి, నాగర్కర్నూల్, అచ్చంపేట, దేవరకద్ర, మహబూబ్నగర్, షాద్నగర్కు తాగునీటిని అందించే పథకాలను వీటిపై ఏర్పాటు చేశారు. ప్రజల దాహార్తిని దృష్టిలో ఉంచుకున్న అధికారులు జూరాల నుంచి ఆయకట్టుకు కేవలం వారబంది ద్వారా పంటల సాగుకు నీటిని అందిస్తున్నారు. గతేడాది వర్షాలు అనుకున్న విధంగా కురవకపోవడంతో యాసంగిలో జూరాల ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించారు. అయినా తాగునీటిని వేసవి పూర్తినాటికి అందిచలేమని గ్రహించిన ప్రాజెక్టు అధికారులు, విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఎగువన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు తాగునీటి అవసరాలకు నీటిని నారాయణపూర్ డ్యాం ద్వారా విడుదల చేసింది. సమస్య పరిష్కారానికి.. జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన తాగునీటి పథకాలకు వేసవి కాలం పూర్తయ్యే నాటికి నీటిని అందించాలనే ఉద్దేశంతో సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమస్యను నివేదించాం. తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరగా.. 1.9 టీఎంసీల నీటిని విడుదల చేసింది. – వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మక్తల్ ప్రభుత్వం విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కర్ణాటక నారాయణపూర్ నుంచి జూరాలకు 1.9 టీఎంసీల నీటి విడుదల జూరాలకు కొనసాగుతున్న ఇన్ఫ్లో -
ఓటుకు దూరం
5,30,783 మంది..సాక్షి, నాగర్కర్నూల్/అచ్చంపేట: ప్రజాస్వామ్యానికి ఓటే ఆక్సిజన్.. సమర్థవంతమైన పాలకులను ఎన్నుకోవడంలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటింది. ఎంతటి మహామహులనైనా, ఎంతటి రాజకీయ అనుభవం కలవారైనా.. ప్రజలకు నచ్చకుంటే వారి తిరస్కారానికి గురికాక తప్పదు. అంతటి విలువైన ఓటు హక్కును చాలా మంది ఓటర్లు పలు కారణాలతో వినియోగించుకోలేకపోతున్నారు. కేవలం ఐదు నెలల కిందటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా.. లోక్సభ ఎన్నికల నాటికి సుమారు పదిశాతం మేర ఓటింగ్ తగ్గడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలకన్నా ఈ ఎన్నికల్లో ఓటువేయని వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సర్పంచ్, స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్న ఓటర్లు, లోక్సభ ఎన్నికల్లో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే ఎన్నికల సంఘం చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, ఓటుహక్కు వినియోగం కోసం ప్రత్యేక ఏర్పాట్లతో గత లోక్సభ ఎన్నికలకన్నా ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. ● నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 69.46 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇంకా 30.54 శాతం మంది ఓటింగ్కు దూరంగా ఉన్నట్లు సోమవారం జరిగిన పోలింగ్ ద్వారా స్పష్టమైంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు 11శాతం మేర పోలింగ్ తగ్గింది. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 2,057 పోలింగ్ కేంద్రాల్లో 17,38,254 మంది ఓటర్లు ఉన్నారు. అయితే సోమవారం జరిగిన పోలింగ్లో 12,07,471 మంది ఓటింగ్లో పాల్గొనగా.. ఇందులో 6,13,085(70శాతం) మంది పురుఘులు, 5,94,367(68.06శాతం) మంది మహిళలు, 19 మంది ఇతరులు ఉన్నారు. మిగతా 5,30,783 మంది ఓటర్లు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోలేకపోయారు. నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో పోలైన ఓట్ల శాతం ఇలా.. నియోజకవర్గం 2018 2019 2023 2024 అసెంబ్లీ లోక్సభ అసెంబ్లీ లోక్సభ నాగర్కర్నూల్ 75.62 61.78 78.66 67.94 అచ్చంపేట 74.96 58.92 80.03 65.11 కల్వకుర్తి 84.05 66.60 83.26 72.51 కొల్లాపూర్ 70.15 56.16 81.42 65.11 వనపర్తి 80.83 60.91 77.72 66.66 అలంపూర్ 72.16 66.98 82.80 74.06 గద్వాల 71.95 66.30 83.12 74.93 చేరుకోని లక్ష్యం.. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో 70 నుంచి 80శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. వెనువెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ శాతం తగ్గింది. పోలింగ్ 75 నుంచి 80 శాతం నమోదవుతుందని అధికార యంత్రాంగం అంచనా వేసినా లక్ష్యాన్ని చేరుకోలేదు. మొత్తం ఓటర్లు 17,38,254, ఓటేసింది 12,07,471 మంది ఐదు నెలల వ్యవధిలోనే అనాసక్తి 2023 అసెంబ్లీ ఎన్నిలతో పోలిస్తే 11 శాతానికి పైగా తగ్గిన పోలింగ్ -
విద్యార్థులకు కలెక్టర్ అభినందన
వనపర్తి: షెడ్యూల్డు కులాల వసతిగృహాల్లో ఉంటూ.. పది, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను గురువారం కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అభినందించారు. ఫలితాలు వెల్లడైన సమయంలో పార్లమెంట్ ఎన్నికల ఒత్తిడిలో విద్యార్థులను ప్రోత్సహించలేకపోయానని భావించిన కలెక్టర్, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకించి పిలిపించుకుని తన ఛాంబర్లో అభినందించారు. ఇదే స్ఫూర్తిని ఇక ముందు కొనసాగించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులతో పాటు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారిణి నుషిత, సిబ్బంది పాల్గొన్నారు. స్కాలర్షిప్కు దరఖాస్తుల స్వీకరణ వనపర్తిటౌన్: గిరిజన వ్యవహారాల మంత్రి శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ అభ్యర్థుల నుంచి నేషనల్ ఓవర్సిస్ స్కాలర్షిప్ పథకానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎం. శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరానికి స్కాలర్షిప్ పొందాలనుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మాస్టర్స్, పీహెచ్డీ రీసెర్చ్ ప్రోగ్రాం కోసం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ అందిస్తుందని వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 31వ, తేదీలోగా overseas.triba l.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. సరైన అవగాహనతోనే డెంగీ నివారణ వనపర్తి: సరైన అవగాహన ఉంటేనే డెంగీ నివారణ సాధ్యమవుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జయచంద్రమోహన్ అన్నారు. గురువారం జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. డెంగీని పారదోలేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని, నివాస పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు లేకుండా చూసుకోవాలన్నారు. కూలర్లు వాడే వారు ఎప్పటికప్పుడు అందులో నీటిని మారుస్తూ.. శుభ్రపరుచుకోవాలని చెప్పారు. పగటి పూట కుట్టే దోమలతోనే డెంగీ వచ్చే అవకాశం ఉంటుందని, జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. ఎవరికై నా జ్వరం వస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
దోస్త్ అడ్మిషన్లు షురూ..
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: 2024–25 విద్యా సంవత్సరం ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకుగాను ప్రభుత్వం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ (దోస్త్) ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతోంది. ఈ మేరకు ఈనెల 6 నుంచి 29వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తుదారులు మొదటి దశ వెబ్ ఆప్షన్ ఇచ్చేందుకు ఈ నెల 20 నుంచి జూన్ 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 92 డిగ్రీ కళాశాలలు ఉండగా.. 31,090 సీట్ల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దరఖాస్తుల అనంతరం మొదటి దశ సీట్ల అలాట్మెంట్ జూన్ 6వ తేదీన చేపట్టనున్నారు. దరఖాస్తు చేసుకునే క్రమంలో విద్యార్థుల సందేహాలను తీర్చేందుకుగాను మహబూబ్నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 29 వరకు దరఖాస్తుకు గడువు పలు ప్రభుత్వ కళాశాలల్లో కొత్త కోర్సులకు అవకాశమిచ్చిన ప్రభుత్వం ఎంవీఎస్ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు పీయూ పరిధిలో 92 కళాశాలలు.. 31,090 సీట్ల భర్తీకి అనుమతి జాగ్రత్తలు పాటించాలి.. దోస్త్ అడ్మిషన్ తీసుకునే క్రమంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మీసేవ కేంద్రాల నిర్వాహకులపై పూర్తిగా ఆధారపడవద్దు. ఆప్షన్ ఇచ్చుకునే కళాశాల, కోర్సుల విషయంలో అవగాహన ఉండాలి. విద్యార్థి తన ఫోన్ నంబర్ను మాత్రమే ఎంటర్చేసే విధంగా చూసుకోవాలి. కొత్త కోర్సులను ఉపాధి ఆధారితంగా ఉండేవిధంగా ప్రభుత్వం రూపొందించింది. – మధుసూదన్రెడ్డి, రిజిస్ట్రార్, పాలమూరు యూనివర్సిటీ
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బద్ధిపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వేసవిలో ‘చల్లని’ సేవ
గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివించండి
వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బుద్ధ జయంతిని విజయవంతం చేయాలి
ఎప్సెట్ ఫలితాల్లో ‘శ్రీచైతన్య’ విజయకేతనం
ఏషియన్ పవర్ లిఫ్టింగ్లో బంగారు పతకం
నేటి నుంచి జీల్గుల మల్లికార్జునస్వామి ఉత్సవాలు
వ్యానును ఢీకొన్న కారు
తప్పక చదవండి
- బీజేపీ ఎంపీ- ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో వైరల్!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
Advertisement