పించన్లు, రేషన్‌ కార్డులు.. భారీగా అడుగుతున్నారు | Sakshi
Sakshi News home page

పించన్లు, రేషన్‌ కార్డులు.. భారీగా అడుగుతున్నారు

Published Fri, Jan 5 2018 3:02 AM

chandrababu naidu on janmabhumi programs - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నాలుగు జన్మభూమి కార్యక్రమాల సందర్భంగా అందిన అన్ని అర్జీలన్నీ పరిష్కరించామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇన్నాళ్లూ అర్హులందరికీ రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఇళ్లు, ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా జన్మభూమి సభల్లో జనం నిలదీతలు, నిరసనలతోపాటు అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు కావస్తుండటంతో మాట మార్చారు.

తాను స్వయంగా నిర్వహించిన సర్వే ప్రకారం పింఛన్లు, రేషన్‌ కార్డులు ఇంకా ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోందని జన్మభూమి నిర్వహణ తీరుపై గురువారం కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులుతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత మూడు రోజులుగా జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి 3,00,570 ఆర్జీలు అందినట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ మీడియాకు తెలిపారు. ఇందులో అత్యధికం ఇళ్లు, రేషన్‌ కార్డులు, పెన్షన్లకు సంబంధించినవేనని తెలిపారు. సీఎం నిజాలను ఒప్పుకోవటానికి కారణం సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటమేనని రాజకీయ విశ్లేషకులతోపాటు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement
Advertisement