7న పోలవరంలో గడ్కరీ పర్యటన | Sakshi
Sakshi News home page

7న పోలవరంలో గడ్కరీ పర్యటన

Published Sun, Dec 31 2017 1:41 AM

Gadkari tour in Polavaram on 7th - Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పోలవరం పర్యటన ఖరారైంది. జనవరి 7న ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో ఆయన పరిశీలించి 2019 నాటికి పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమీక్షిస్తారు. ఈనెల 13న ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు.. నితిన్‌ గడ్కరీతో సమావేశమై ప్రాజెక్టు పనులపై చర్చించగా 22న పరిశీలనకు వస్తానని గడ్కరీ ప్రకటించారు. అయితే క్షేత్ర స్థాయి నివేదికలు తెప్పించుకుని, అధ్యయనం చేసిన తర్వాతే సందర్శనకు వెళ్లాలన్న ఉద్దేశంతో పర్యటనను వాయిదా వేసుకున్నారు.

ఈలోగా పోలవరం ప్రాజెక్టు పనులను తనిఖీ చేసి నివేదిక ఇచ్చేందుకు వ్యాప్కోస్‌ కమిటీ, తన సలహాదారు సంజయ్‌ కోలా పుల్కర్‌ను పంపారు. జనవరి 2 లేదా 3న కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ను కూడా క్షేత్ర పరిశీలనకు పంపాలని గడ్కరీ నిర్ణయించారు. వారు ఇచ్చే నివేదికలు అధ్యయనం చేశాక.. వచ్చే నెల 7న పోలవరంలో పర్యటిస్తానని గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపారు.

Advertisement
Advertisement