‘ఓపెన్’ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం | Sakshi
Sakshi News home page

‘ఓపెన్’ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం

Published Sun, Nov 17 2013 3:32 AM

10th open exams date 18th to 28

విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్) ఇంటర్, పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ అధికారులు పూర్తిచేశారు. 1,931 మంది విద్యార్థులు హాజరయ్యే ఇంటర్ పరీక్షలకు ఏడు, 2,852 మంది విద్యార్థులు హాజరయ్యే పదో తరగతి పరీక్షలకు పది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయనగరం, పార్వతీపురం, ఎస్.కోట ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 
 
 జిల్లాకు చేరిన ప్రశ్నపత్రాలు
 సప్లిమెంటరీ పరీక్షల ప్రశ్నత్రాలు ప్రత్యేక వాహనంలో శనివారం జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వాటిని డీఈఓ జి. కృష్ణారావు, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ సాయిబాబా, ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ లక్ష్మణరావు, రూట్ ఆఫీసర్లు పరిశీలించి స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. ఇక్కడ నుంచి సెంటర్ల వారీగా రూట్ ఆఫీసర్లు, పోలీసు ఎస్కార్ట్ సహకారంతో ప్రత్యేక వాహనాల్లో ఆయా కేంద్రాల సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలిస్తారు.
 
 పకడ్బందీగా నిర్వహించాలి: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీఈఓకి ఆదేశాలు
 ఓపెన్ స్కూల్  పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ జి.కృష్ణారావుకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. ఈ మేరకు శనివారం వీడియోకాన్ఫెరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ జరగకుండా చూడాలన్నారు. 
 

Advertisement
Advertisement