బాలుడిని హతమార్చి, పెట్రోలు పోసి దహనం | Sakshi
Sakshi News home page

బాలుడిని హతమార్చి, పెట్రోలు పోసి దహనం

Published Sat, May 31 2014 12:31 PM

12-year-old boy killed in chittoor district

తిరుపతి : చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో ఓ బాలుడి మృతదేహం కలకలం రేపింది. దుండగులు ఓ పన్నెండేళ్ల  బాలుడిని హతమార్చి అనంతరం మృతదేహాన్ని పెట్రోలు పోసి నిప్పు అంటించారు. చంద్రగిరి మండలం తొండవాడ బైపాస్ రోడ్డు ప్రక్కన పూర్తిగా కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సజీవ దహనమైన బాలుడు తిరుపతిలోని సత్యనారాయణపురంకు చెందిన టిటిడి ఉద్యోగి మునిరత్నంరెడ్డి కుమారుడు మురళిగా పోలీసులు గుర్తించారు.

నిన్న సాయంత్రం నుంచి మురళి కనిపించకుండాపోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు  అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. బాబు చేతికి కడియం ఉన్నట్టు ఫిర్యాదులో ఉండడం .. మృతదేహానికి కూడా కడియం ఉండడంతో .. మృతుడు మురళి అని పోలీసులు నిర్థారించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో క్షేమంగా తిరిగొస్తాడనుకున్న కుమారుడు, కనీసం గుర్తుపట్టనంతగా కాలిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే ఈ దారుణానికి పాల్పడింది ఎవరో ఇంకా తెలియలేదు. మృతుడి కుటుంబానికి శత్రువులు ఉన్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement