మరో 15 కేసులు | Sakshi
Sakshi News home page

మరో 15 కేసులు

Published Mon, Apr 13 2020 3:37 AM

15 New Corona Positive Cases Reported In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 420కి చేరింది. శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం సా.6 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరులో ఏడు కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 2, చిత్తూరు, వైఎస్సార్‌  జిల్లాలో ఒకొక్క కేసు చొప్పున నమోదయ్యాయి.

కాగా, గడిచిన ఆరు రోజుల్లో ఒక్క గుంటూరు జిల్లాలోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య 41 పెరిగి మొత్తం 82కు చేరుకుంది. అలాగే, ఒకరు మృతిచెందారు. ఇదే జిల్లా దాచేపల్లికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఈనెల 9న పిడుగురాళ్ల ఆస్పత్రిలో చేరగా 10వ తేది అర్ధరాత్రి మరణించినట్లు ఆదివారం విడుదలైన హెల్త్‌ బులిటెన్‌లో ప్రభుత్వం పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7కు చేరింది. మరోవైపు.. మక్కా నుంచి వచ్చి కరోనా సోకిన ఓ వ్యక్తి పూర్తిగా కోలుకోవడంతో విజయవాడ ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇలా మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 12కు చేరింది. 

916 నమూనాలకు నెగిటివ్‌ రిపోర్టు
కాగా, శనివారం రాత్రి 9గంటల నుంచి ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు మొత్తం 931 నమూనాలను పరీక్షించగా 916 కేసులు నెగిటివ్‌గా వచ్చాయి. అలాగే, రాష్ట్రంలో ఇంతవరకు మొత్తం 7,889 మందికి పరీక్షలు నిర్వహించగా.. అందులో 7,469మందికి నెగిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. ఇప్పటివరకు మరణించిన ఏడుగురు, డిశ్చార్జి అయిన 12 మందిని మినహాయిస్తే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 401గా ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement