సాక్షి, తాడేపల్లి గూడెం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 167వ రోజు ప్రారంభమైంది. వైఎస్సార్సీపీ రాజకీయ సలహాదారు సోమయాజులు మృతి కారణంగా ఆదివారం జననేత వైఎస్ జగన్ పాదయాత్రకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. విరామం అనంతరం సోమవారం ఉదయం వెంకటరామన్న గూడెం శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించారు.
పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనతోపాటు పాదయాత్రలో పాల్గొంటున్నారు. అశేష ప్రజానీకం నడుమ రాజన్న బిడ్డ వెల్లమిల్లి, పెద్ద తాడేపల్లి మీదుగా తాడేపల్లిగూడెం మార్కెట్ ప్లేస్ చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు.