185 మంది పోలీసులకు స్థాన చలనం | Sakshi
Sakshi News home page

185 మంది పోలీసులకు స్థాన చలనం

Published Sun, Jun 10 2018 11:21 AM

177 police transfer in prakasam - Sakshi

ఒంగోలు: జిల్లాలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ మొదలు అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వరకు బదిలీల ప్రక్రియను జిల్లా ఎస్పీ బి.సత్యయేసుబాబు శనివారం నిర్వహించారు. ఈ ప్రక్రియ స్థానిక ఎస్పీ కార్యాలయం ఆవరణలోని గెలాక్సీ కాంప్లెక్స్‌లో జరిగింది. మొత్తం 185 మందిని బదిలీ చేయనున్నట్లు ప్రకటించగా వారిలో 177 మంది మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు.  ఈ బదిలీల ప్రక్రియకు సంబం«ధించి ఎటువంటి ఒత్తిళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉద్యోగుల సర్వీసు రికార్డు ప్రామాణికంగా 5 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన వారిని, స్వస్థలంలో పని చేస్తున్న 11 మంది ఏఎస్సైలు, 61 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 105 మంది కానిస్టేబుళ్లను కౌన్సెలింగ్‌కు రావాల్సిందిగా శుక్రవారం వారి మొబైల్‌ ఫోన్లకు సమాచారం పంపించారు. శనివారం ఉదయం వారిలో 177 మంది మాత్రమే హాజరయ్యారు. నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఆరోగ్య కారణాల రీత్యా దీర్ఘకాలిక సెలవులో ఉండడంతో వారిని వీఆర్‌కు పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే వారు తిరిగి విధుల్లో జాయిన్‌ అయినప్పుడు వారికి పోస్టింగ్‌ ఉత్తర్వులు ఇస్తారు. 

ముందుగానే సూచనలు:
కౌన్సెలింగ్‌కు హాజరైన వారికి ముందుగానే జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఎలా చేపట్టబోతుంది తదితర వివరాలను వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోను నేటివ్‌ ప్లేస్‌ను కోరుకోరాదని, అదే విధంగా గతంలో రెండు సంవత్సరాలకు మించి పనిచేసిన స్టేషన్‌ కోరుకోరాదంటూ పలు సూచనలు చేశారు. అంతే కాకుండా స్టేషన్‌ ప్రాతిపదికన కాకుండా ప్రాంతం ప్రాతిపదికన బదిలీలు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఒంగోలు , చీరాల ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున సిబ్బంది బదిలీ అయ్యారు. వీరిలో చీరాల సిబ్బంది ఒంగోలుకు, ఒంగోలు సిబ్బంది చీరాలకు బదిలీ కాగా, మిగిలిన వారు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు బదిలీ కాక తప్పలేదు. 

ఖాళీల ప్రక్రియను స్క్రీన్‌పై చూపిస్తూ ముందుగా గుర్తించిన ఖాళీలను మాత్రమే కోరుకోవాలని సూచిం చారు. అంతే కాకుండా బదిలీ కోరుకున్న వెంటనే అప్పటికప్పుడు బదిలీ ఉత్తర్వుల కాపీని కూడా సిబ్బందికి కౌన్సెలింగ్‌ సమయంలోనే అందించారు.  కార్యక్రమంలో జిల్లా ఎస్పీతోపాటు నాన్‌ క్యాడర్‌ ఎస్పీ ఏబీటీఎస్‌ ఉదయరాణి, డీటీసీ, డీసీఆర్‌బీ, సీసీఎస్‌ డీఎస్పీలు, ఎస్‌బీ, డీటీఆర్‌బీ, డీటీసీ సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎటువంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా కేవలం ఎంచుకున్న ప్రామాణికత ఆధారంగా సిబ్బంది బదిలీల కౌన్సెలింగ్‌ పట్ల సిబ్బందిలో సంతృప్తి వ్యక్తం అయింది. అయితే స్టేషన్‌ ప్రామాణికంగా కాకుండా ప్రాంతం ప్రాతిపదికగా తీసుకోవడంతో ఎక్కువ పోలీసుస్టేషన్లు ఉన్న ఒంగోలు, చీరాల తదితర ప్రాంతాల్లోని సిబ్బంది సుదూర ప్రాంతాలకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

దీంతో వారు కుటుంబంతో సహా సుదూర ప్రాంతంలో పోస్టింగ్‌ పడడం వారిలో కొంత అసంతృప్తి నెలకొంది. సంవత్సరాల తరబడి రూరల్‌ ఏరియాలకే పరిమితమవుతూ పట్టణాలకు వద్దామనుకున్న సిబ్బందికి మాత్రం ఈ కౌన్సెలింగ్‌ వందశాతం వరంగా నిలిచిందని చెప్పవచ్చు. సాధారణంగా ఏ శాఖలో అయినా బదిలీలకు సంబం ధించి ఒకటి రెండు సంవత్సరాలలో రిటైర్‌ అయ్యేవారు ఉంటే వారికి బదిలీల ప్రక్రియ నుంచి మినహాయింపు ఉండేది. కానీ ఈ బదిలీల్లో మాత్రం రెండు నెలల్లో బదిలీ అయ్యేవారిని కూడా కౌన్సెలింగ్‌కు ఆహ్వానించారు.

Advertisement
Advertisement