20 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు | Sakshi
Sakshi News home page

20 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

Published Sun, Dec 1 2013 2:40 AM

20 grain purchase centers

సీతంపేట, న్యూస్‌లైన్: గిరిజన సహకార సంస్థ(జీసీసీ)ఆధ్వర్యంలో 20 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఐటీడీఏ పీవో కె.సునీల్ రాజ్‌కుమార్ ఆదేశిం చారు.  జీసీసీ సేల్స్‌మెన్‌తో శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆయన మాట్లాడారు.  సీతంపేట, భామిని, హిరమండలం, పాతపట్నం తదితర ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి డీఆర్‌డిపో పరిధిలో నెలకు రూ.లక్ష వ్యాపారం చేయాలన్నారు. ఈ ఏడాది మూడున్నర కోట్ల వ్యాపార లక్ష్యాన్ని పూర్తి చేయాలని, సంతల్లో కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కుశిమి, సీతంపేట, దోనుబాయి, పొల్ల, మర్రిపాడు సంతల్లో మూడు కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.
 
 వీరఘట్టం సంతకు ఇద్దరు సేల్స్‌మేన్లను  కేటాయించాలని ఆదేశించారు. అమ్మహస్తం పథకం ద్వారా  9 రకాల సరుకులను  డీఆర్‌డిపోల్లో ఉండాలన్నారు. రానున్న క్రిస్‌మస్, సంక్రాంతి సీజన్లలో వీటికి బాగా డిమాండ్ ఉంటుందన్నారు. సంతల్లో  నాసిరకం వస్తువులు విక్రయిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇందుకు జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు జీసీసీ అధికారులు కూడా దాడులు చేయాలని  సూచించారు. అలాగే కొండచీపుర్లు కొనుగోలు చేయాలన్నారు. సీతంపేటలో ఉన్న కోల్డ్‌స్టోరేజీని తీసుకుని, అటవీ ఫలసాయాలు అందులో నిల్వ ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డివిజినల్ మేనేజర్ ఎన్.విజయ్‌కుమార్, సీతంపేట బ్రాంచి మేనేజర్ శాంతారాం తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement