ఏర్పేడు: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పాతవీరాపురం గ్రామంలో గురువారం జరిగింది. హైదరాబాద్కు చెందిన నలుగురు ఉద్యోగులు కారులో కానిపాకం నుంచి శ్రీకాళహస్తి వెళ్తుండగా ముసిలిపేడు ఇసుక రీచ్ నుంచి తిరుపతికి ఇసుక తీసుకెళ్తున్న ఓ ట్రాక్టర్ వీరాపురం సమీపంలో ఢీకొట్టింది.
దీంతో కారులో ఉన్న సెక్షన్ ఆపీసర్ బిక్షం(49), అసెంబ్లీ ఉద్యోగి మల్లికార్జున శర్మ(46), పార్ధసారధి(46)లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తిరుపతి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.