ఒక్కరోజు ఆదాయం 5 కోట్లు | Sakshi
Sakshi News home page

ఒక్కరోజు ఆదాయం 5 కోట్లు

Published Tue, Mar 28 2017 12:55 AM

ఒక్కరోజు ఆదాయం 5 కోట్లు - Sakshi

♦  సోమవారం రికార్డు స్థాయిలో
శ్రీవారి హుండీ కానుకలు
పెద్దనోట్ల రద్దు తర్వాత ఇదే అత్యధికం


సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం సోమవారం రికార్డు స్థాయిలో రూ.5 కోట్లు లభించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇంత పెద్ద మొత్తంలో లభించటం ఇదే మొదటిసారి. అజ్ఞాత భక్తులు రూ.రెండు వేల నోట్ల కట్టలు సమర్పించటంతో భారీ మొత్తంలో కానుకలు లభించాయని ఆలయ అధికారుల సమాచారం. ఈనెల 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో  తిరుమల హుండీలో ప్రతి ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో  భక్తులు నోట్ల కట్టలు సమర్పిస్తుంటారు. దీంతో హుండీ కానుకలు పెరుగుతుంటాయి. 2012లో శ్రీరామనవమి పర్వది నం రోజున హుండీ కానుకల్లో వచ్చిన రూ.5.73 కోట్లే ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా ఉంది.

టీటీడీ వద్ద చెల్లని నోట్లు రూ.12.7 కోట్లు
టీటీడీ వద్ద రూ.12.7 కోట్ల వరకు చెల్లని నోట్లు ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం, డిసెంబర్‌ 31 నుంచి మార్చి 26 వరకు రద్దు చేసిన రూ.500, రూ.1,000 నోట్లు మొత్తం రూ.12.7 కోట్లకు చేరుకున్నాయి. ఇవి చెల్లవని ఇప్పటికే ఆర్‌బీఐ టీటీడీకి తెలిపింది. అయితే, రోజువారీగా వస్తున్న ఈ పాత కరెన్సీని ఏమి చేయాలనే దానిపై టీటీడీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భక్తుల మనోభావాలతో కూడిన ఈ నగదు కానుకలపై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని టీటీడీ ఈవో సాంబశివరావు చెప్పారు.

Advertisement
Advertisement