విలువ తెలియక... | Sakshi
Sakshi News home page

విలువ తెలియక...

Published Fri, Jan 3 2014 11:48 PM

50 thousand plants largely redwood

పరిగి, న్యూస్‌లైన్: ఎర్రచందనం దుంగలకు అంతర్జాతీయ మార్కెట్‌లో కోట్ల రూపాయల విలువ పలుకుతోందని ఈ మధ్య ప్రచార మాధ్యమాల్లో వింటున్నాం.. చూస్తున్నాం. ఇంత డిమాండ్ ఉన్న ఈ మొక్కలను పెంచండని ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నా రైతులు ముందుకు రావడం లేదు. దీంతో వన నర్సరీలో పెంచిన ఎర్రచందనం మొక్కలు వృథాగా పడిఉంటున్నాయి. వీటిని పెంచితే కేసులు పెడతారేమోనన్న భయం కొందరిదైతే.. వీటిని ఎవరు కొంటారు.. అనే సందేహం మరికొందరిది.
 
 ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులకు అందజేసేందుకు జిల్లాలోని నర్సరీల్లో 15లక్షల మొక్కలు పెంచారు. అందులో 14.5లక్షల టేకు మొక్కలున్నాయి. పరిగి మండలంలోని ఖుదావన్‌పూర్ వన నర్సరీలో మాత్రం 50వేల ఎర్రచందనం మొక్కలు పెంచారు. అధికారులు అన్ని మండలాల్లోని రైతులకు టేకుమొక్కలు అందజేసి పొలాల్లో, పొలంగట్లపై నాటించారు. అయితే ఖుదావన్‌పూర్ వన నర్సరీలోని ఎర్రచందనం మొక్కలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఒక్కరంటే ఒక్కరు కూడా వీటిని తీసుకెళ్లలేదు. ఈ విషయాన్ని ఉపాధి హామీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. మొక్కలు పెరిగిన తర్వాత ఎర్రచందనం దుంగలు విక్రయించుకునేందుకు ప్రభుత్వం నుంచి తామే అనుమతులు ఇప్పిస్తామని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని రైతులకు చెప్పడంలో వారు విఫలమయ్యారు. అందుకే ఇవి వృథాగా పడిఉన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement