‘శ్రీకృష్ణ నివేదిక 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయండి’
Published
Sat, Oct 19 2013 11:53 PM
సాక్షి, హైదరాబాద్: జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయాలని, పార్లమెంట్, అసెంబ్లీల్లో చర్చించేందుకు వీలుగా ప్రజాప్రతినిధులందరికీ అందుబాటులో ఉంచేలా కేంద్ర హోం కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఫోరం ఫర్ బెటర్ విక్రమ సింహపురి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి కేసరి హరనాథ్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఇందులో కేంద్ర, రాష్ట్ర హోంశాఖల కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు 8వ అధ్యాయంపై చర్చించాల్సిన అవసరం ఉందని, ఇప్పటివరకు దానిని బహిర్గతం చేయకపోవడం వల్ల అందులో ఏముందన్న విషయం ఎవరికీ తెలియదని పిటిషనర్ పేర్కొన్నారు. విభజనను సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.