ఆదిశేషు నివాసంలో ఏసీబీ సోదాలు | Sakshi
Sakshi News home page

ఆదిశేషు నివాసంలో ఏసీబీ సోదాలు

Published Fri, Jan 22 2016 12:18 AM

ACB Raids On Excise Assistant Commissioner Adi Seshu

 చాగల్లు :చాగల్లు ఏపీబీసీఎల్( మద్యం డిపో)లో పనిచేస్తున్న ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ మామిళ్లపల్లి అదిశేషు అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి రెండవరోజు గురువారం కూడా ఏసీబీ అధికారులు చాగల్లులో సోదాలు చేశారు. ఆస్తులకు సంబంధించిన కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు ఏసీబీ సీఐ యుజే విల్సన్ ఆధ్వర్యంలో వచ్చిన ప్రత్యేక బృందం అదిశేషు అద్దెకు తీసుకున్న ఇంటిలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించింది. బుధవారం విజయవాడలో నివసిస్తున్న అదిశేషు ఇంటి వద్ద, అతని బంధువుల ఇళ్లలోను, చాగల్లు డిపోలోను ఏకకాలంలో సోదాలు నిర్వహించి అతని అక్రమ ఆస్తులకు సంబంధించి కీలకమైన పత్రాలు స్వాధీన పరుచుకున్న విషయం తెలిసిందే.
 
 అయితే ఆయన మూడు నెలలుగా స్థానిక వృద్దాశ్రమం సమీపంలోని ఒక ఇంటిలో అద్దెకు నివసిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ఇంటీలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనంతరం ఏసీబీ సీఐ విల్సన్ మాట్లాడుతూ విజయవాడలో ఆదిశేషుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంతో అతనిపై కేసు నమోదయిందని అన్నారు. ఈ కేసును పర్యవేక్షిస్తున్న డీఎస్పీ రమాదేవి ఆదేశాల మేరకు చాగల్లులో ఆయన ఇంటిలో చేసిన తనిఖీల్లో అస్తులకు సంబంధించి కొన్ని పత్రాలు లభించినట్టు తెలిపారు. వాటి గురించి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు ఆయన తెలిపారు.
 

Advertisement
Advertisement