Sakshi News home page

అందుబాటులో ఆర్జిత సేవా టికెట్లు

Published Mon, Mar 10 2014 1:24 AM

Acquired Service Tickets Available for devotees

తిరుమల, న్యూస్‌లైన్: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రతి రోజు ఉదయం వేళలో నిర్వహించే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన  సేవా టికెట్లు సోమవారం లక్కీడిప్‌లో అందుబాటులో ఉంటాయి. మంగళవారం వేకువజామున స్వామివారికి నిర్వహించే తోమాల - 04, అర్చన-10 టికెట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆర్జిత సేవల్లో ఖాళీగా ఉన్న కొన్ని టికెట్లను భక్తుల సౌకర్యార్థం టీటీడీ అధికారులు అదనంగా లక్కీడిప్ ద్వారా సుప్రభాతం-25, అష్టదళం-15, తోమాల-10, అర్చన-10 టికెట్లను అందుబాటులో ఉంచారు.
 
 ఈ టికెట్లను కేంద్రీయ విచారణ కార్యాలయంలోని విజయబ్యాంక్‌లో లక్కీడిప్ పద్ధతిలో భక్తులకు కేటాయిస్తారు. సోమవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు భక్తులు తమ పేర్లు కంప్యూటర్‌లో నమోదు చేసుకోవాలి. 5 గంటల తరువాత ఎంపికైన భక్తులకు  ఎస్‌ఎమ్‌ఎస్‌ల ద్వారా సమాచారం తెలియజేస్తారు. ఎంపికైన భక్తులు రాత్రి 8లోపు టికెట్లు కోనుగోలు చేయాలి. టికెట్లు పొందిన భక్తులు మంగళవారం ఈ సేవల్లో పాల్గొనవచ్చు.
 
 శ్రీవారి దర్శనానికి 22 గంటలు: తిరుమల శ్రీవారి దర్శనానికి 22 గంటల సమయం పడుతోంది. ఆదివారం సెలవురోజు కావటంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగాపెరిగింది. వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 48,324 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement