సాయికుమార్ తండ్రి పీజే శర్మ మృతి | Sakshi
Sakshi News home page

సాయికుమార్ తండ్రి పీజే శర్మ మృతి

Published Sun, Dec 14 2014 12:34 PM

సాయికుమార్ తండ్రి పీజే శర్మ మృతి - Sakshi

హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు సాయి కుమార్ తండ్రి సీనియర్ నటుడు పీజే శర్మ ఆదివారం గుండెపోటుతో మరణించారు. మణికొండలోని ఆయన నివాసంలో పీజే శర్మకు తీవ్రమైన గుండె పోటు వచ్చింది. దీంతో ఆయన ఉదయం 7.30 గంటలకు కన్నుమూశారు. ఈ రోజు సాయంత్రం 3.00 గంటలకు ఎర్రగడ్డలోని శ్మశాన వాటికలో పీజే శర్మ అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

సాయి కుమార్ కుమారుడు హీరో ఆది వివాహం శనివారం హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్లి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న పీజే శర్మ... అంతలోనే తుది శ్వాస విడవడంతో ఆయన ఇంటా విషాద ఛాయలు అలముకున్నాయి.  పీజే శర్మ మృతి పట్ల మా తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది.

పీజే శర్మ అసలు పేరు పూడిపెద్ది జోగీశ్వర శర్మ. 1933, మే 24 వ తేదీన విజయనగరం జిల్లా కళ్లేపల్లి గ్రామంలో ఆయన జన్మించారు. నాటకాలపై మక్కువతో నాటకాలలో నటిస్తుండగా ...1954లో మొదటి సారిగా అన్నదాత చిత్రంలో చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అలాగే 1957లో ఉత్తమ ఇల్లాలు చిత్రంలోని పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత వందలాది డబ్బింగ్ సినిమాలలో నంబియార్, శ్రీరామ్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, రాజ్ కుమార్, ఉదయ్ కుమార్, ప్రేమనజీర్ నటించిన చిత్రాలలో వారి పాత్రలకు పీజే శర్మ డబ్బింగ్ చెప్పారు. దాదాపు 150 చిత్రాలలో పీజే శర్మ నటించారు. అలాగే 500 సినిమాల వరకు ఆయన డబ్బింగ్ చెప్పారు.

1966లో నటి కృష్ణజ్యోతిని పీజే శర్శ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.  పెద్ద కుమారుడు సాయికుమార్, రవి శంకర్, అయ్యప్ప పీ శర్మ, కుమార్తెలు కమల, ప్రియ. సాయి కుమార్ తనయుడు ఆది ప్రేమ కావాలి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement