విమానాశ్రయ అభివృద్ధికి చర్యలు | Sakshi
Sakshi News home page

విమానాశ్రయ అభివృద్ధికి చర్యలు

Published Wed, May 20 2015 1:44 AM

Airport development activities

 కోరుకొండ : మధురపూడి విమానాశ్రయం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ అన్నారు. మంగళవారం నిడిగట్ల గ్రామంలో రోడ్డు శంకుస్థాపనలో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ మాట్లాడుతూ జూన్ లో ఉదయం, రాత్రి ప్రత్యేక విమానం తిరుగుతుందని అందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నామన్నారు. విమానాశ్రయ విస్తరణలో రన్‌వేను మరింత  అభివృద్ధి చేస్తామన్నారు. ఒకేసారి మూడు విమానాలు దిగేలా   చర్యలు చేపట్టామన్నారు. రాజమండ్రి నుంచి బూరుగుపూడి వరకు రోడ్డుకిరువైపులా వెడల్పు చేయడంతో భూముల రేట్లు పెరుగుతున్నాయన్నారు.
 
  విమానాశ్రయ విస్తరణ పనులో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో జరిగే నంది మహోత్సవాలకు ప్రజాదరణ బాగుందన్నారు. విమాన విస్తరణలో పొలాలు, చెట్లుపోయిన రైతులకు చేయూతనిస్తామని రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అన్నారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
 
 ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతుల మొర : మార్కెట్ ధర ప్రకారం నష్ట పరిహారం ఇప్పించాలని మధురపూడి విమానాశ్రయ విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులు విజ్ఞప్తి చేశారు. ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌లకు బూరుగుపూడి, మధురపూడి రైతులు వినతిపత్రాలు అంద జేశారు.  
 

Advertisement
Advertisement