స్థానికత వెనుక కుట్ర | Sakshi
Sakshi News home page

స్థానికత వెనుక కుట్ర

Published Sun, Jul 20 2014 1:48 AM

Andhra pradesh all party concerns on Local issue

 ఏపీ అఖిలపక్షం ఆందోళన
 
 సాక్షి, హైదరాబాద్: స్థానికతను నిర్ధారించడానికి 1956కు ముందునుంచి ఉన్న వారంటూ తెలంగాణ ప్రభుత్వం కుట్రచేసే ప్రయత్నం చేస్తోందని, దీనివల్ల ఉభ య ప్రాంతాల విద్యార్థులు నష్టపోతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఆందోళన వ్యక్తంచేసింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చాంబర్‌లో శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ, ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసులు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. దాదాపు గంటసేపు చర్చలు జరిగాయి. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్థానికత నిర్ణయించే విషయంలో తెరమీదకు తెస్తున్న అంశంతోపాటు ఎంసెట్ కౌన్సెలింగ్‌పై చర్చించినట్టు చెప్పారు. ఒక వ్యక్తి స్థానికతకు సంబంధించి రాజ్యాంగం నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలుండగా ఇదో సమస్యగా మారటం ఆందోళన కల్గించే అంశమని వైఎస్సార్‌సీపీ నాయకులు జ్యోతుల చెప్పారు.
 
 కోర్టుకు వెళ్లడంపై పరిశీలిస్తున్నాం: చంద్రబాబు
 
 తెలంగాణలో స్థానికత నిర్ధారణకు 1956వ సంవత్సరమే ప్రాతిపదికగా తీసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించటంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. శనివారం ఆయన శాసనసభ్యుల రెండు రోజుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. స్థానికతపై తెలంగాణ సర్కారు నిర్ణయంపై ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిస్తున్నామన్నారు. కోర్టుకు వెళ్లటంతోపాటు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
 

Advertisement
Advertisement