Sakshi News home page

బంద్‌  సంపూర్ణం

Published Fri, Feb 9 2018 2:03 AM

Andhra Pradesh bandh to protest against Budget 2018 - Sakshi

సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్‌   కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాల పిలుపు మేరకు గురువారం చేపట్టిన రాష్ట్ర బంద్‌ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. టీడీపీ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, అవాంతరాలు సృష్టించినా జనం ఖాతరు చేయకుండా రాష్ట్రానికి న్యాయం చేయాలని నినదించారు. బంద్‌కు మద్దతు పలికిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, లోక్‌సత్తా, జనసేన, కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు నిరసన గళాలు వినిపించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును దుయ్యబట్టాయి. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటం విశ్రమించబోమని ప్రకటించాయి. అత్యవసర సేవలు మినహా బంద్‌తో రవాణా స్తంభించింది.

సుమారు 13 వేల బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. విద్యా, వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ను, యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేశాయి. సినిమా థియేటర్లలో ఉదయం, మధ్యాహ్నం ఆటలు రద్దయ్యాయి. పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి.  రహదారులు జనం లేక బోసిపోయాయి. కిటకిటలాడే హోటళ్లలో నిశ్శబ్దం తాండవించింది. బంద్‌కు ససేమిరా సహకరించేది లేదన్న అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాభీష్టానికి తలొగ్గారు. ర్యాలీలు నిర్వహించండని దుబాయి నుంచి తమ పార్టీ కార్యకర్తలకు పిలుపిచ్చారు. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నట్టు ప్రకటించి ధర్మాగ్రహానికి  తలొంచారు. శాంతియుత బంద్‌కు సహకరించాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.  

తెల్లవారుజాము నుంచే బైఠాయింపులు  
వామపక్షాల కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీ నేతలు తెల్లవారు జాము నుంచే బస్‌ డిపోల ఎదుట ఆందోళన ప్రారంభించారు. బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా గేట్ల ముందు బైఠాయించారు. విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ ఎదుట సీపీఐ, సీపీఎం కార్యకర్తలు గేట్లకు అడ్డంగా నిలబడి బస్సులను కదలనీయలేదు. 144వ సెక్షన్‌ అమల్లో ఉన్నా ఉద్యమ కారులు ఖాతరు చేయలేదు. కార్మిక సంఘాలు మద్దతు పలకడంతో ఆటోలు, రిక్షాలు సైతం రోడ్లపై తిరగలేదు. ద్విచక్ర వాహనాల రాకపోకలు సైతం గణనీయంగా తగ్గాయి. వామపక్షాల ముందస్తు హెచ్చరికతో ప్రయాణీకులు సైతం ప్రయాణాలకు దూరంగా ఉన్నారు. దూర ప్రాంతాల నుంచే వచ్చే బస్సులను గమ్యస్థానాలు చేరేందుకు అనుమతించారు. కొన్ని జాతీయ రహదారులపై లారీలు బారులు తీరి నిలిచాయి.  
 
హోరెత్తిన నిరసనలు.. 

బంద్‌ సందర్భంగా ఆందోళనకారులు రాష్ట్రంలో వినూత్న ప్రదర్శనలు, నిరసనలు చేపట్టారు. రోడ్లపై కబడ్డీ ఆడిన వారు కొందరైతే.. కర్రా బిళ్లా, క్రికెట్‌ ఆడిన వారు మరికొందరు. ఇంకొందరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేయాల్సిందంతా చేస్తుందన్న హామీని ఎగతాళి చేస్తూ చెవుల్లో గులాబీ పూలు, చేతుల్లో క్యాబేజీ, కాలిఫ్లవర్‌తో వినూత్న నిరసనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. విజయవాడలో కొందరు యువతీ యువకులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలుపగా కర్నూలులో బంగి అనంతయ్య తదితరులు భిక్షాటన చేశారు. ఏలూరు, తిరుపతిలో అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. విశాఖలో న్యాయవాదులు మూతికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు. విశాఖకు రైల్వే జోన్‌ ఎక్కడని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన నరేంద్ర మోదీ డౌన్‌ డౌన్, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, బాబు, మోదీ జోడితో అన్యాయం అంటూ నినాదాలు చేశారు.

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది.     విజయవాడలో వైఎస్సార్‌ సీపీ నాయకుడు పార్థసారధి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితర వైఎస్సార్‌సీపీ నేతల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బంద్‌లో పాల్గొని నగరంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌లో రాస్తారోకోలో సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బైక్‌ ర్యాలీని నిర్వహించారు. విజయనగరం జిల్లా సాలూరులో ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర,  కురుపాంలో ఎమ్మెల్యే పాముల పుష్ఫశ్రీవాణి పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విరుచుకుపడ్డారు.  
 
కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు 

కడపలో వామపక్ష, అఖిలపక్ష నేతలతోపాటు వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదంతొక్కాయి. పులివెందులలో వైఎస్సార్‌సీపీ జిల్లా సమన్వయకర్త వైఎస్‌ వివేకానందరెడ్డి, పార్టీ నేత వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి పూల అంగళ్ల వద్ద నిరసన చేపట్టారు. కడప పార్లమెంటరీ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు, రాజంపేట పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిల ఆ«ధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, రైల్వేకోడూరులో కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో, బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్లలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సారథ్యంలో ఆందోళనలు కొనసాగాయి.

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో కల్లూరు పరిధిలోని నంద్యాల చెక్‌ పోస్టు నుంచి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఆలూరులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య, పత్తికొండలో సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, ఎమ్మిగనూరులో సమన్వయకర్త ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని బంద్‌కు మద్దతు ప్రకటించారు. గుంటూరు జిల్లాలో గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్లమెంటు ఇన్‌చార్జి శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య, ఆతుకూరి ఆంజనేయులు బస్టాండ్‌ ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు.

గుంటూరులో ఎమ్మెల్యే మొహమ్మద్‌ ముస్తఫా, లేళ్ల అప్పిరెడ్డి, నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బంద్‌ నిర్వహించారు. విశాఖలో మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీలు బైటాయించి రాస్తారోకో చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి బంద్‌లో పాల్గొన్నారు. తిరుపతిలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. 
  
మూతపడిన సంక్షేమ శాఖలు.
.  
రాష్ట్ర బంద్‌ సందర్భంగా రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లోని సంక్షేమ శాఖలు మూతపడ్డాయి. బంద్‌ నిర్వాహకులు సంక్షేమ శాఖల కార్యాలయాల వద్దకు వెళ్లి ఉద్యోగులను బయటకు వెళ్లాల్సిందిగా కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ రామారావుతో సహా ఉద్యోగులందరూ బయటకు వెళ్లారు. మైనార్టీ సంక్షేమ శాఖ, క్రిష్టియన్‌ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ కార్యాలయం, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలు మూతపడ్డాయి. కార్యాలయాలు ఉదయం ప్రారంభమైనా ఆందోళన కారులు అక్కడికి వెళ్లగానే తాళాలు వేసి బయటకు వచ్చారు.   ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, బడ్జెట్‌లో నిధులు కేటాయించాలనే డిమాండ్‌లకు ఉద్యోగులు మద్దతు పలికారు. కొన్ని ఉద్యోగ సంఘాలు బహిరంగంగానే మద్దతు నిచ్చాయి. చాలా ప్రాంతాల్లో జర్నలిస్టులు బంద్‌కు మద్దతు పలుకుతూ ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి నేతృత్వంలో కేవీపీఎస్, తుడుందెబ్బ కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. 
 
గృహ నిర్బంధాలు, చిత్రీకరణలు.. 
బంద్‌ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను ప్రయోగించింది. పలు చోట్ల వైఎస్సార్‌సీపీ, వామపక్షాల నాయకుల్ని ముందస్తు అరెస్టులు చేసింది. పలువుర్ని గృహ నిర్బంధంలో ఉంచింది. రాజధాని ప్రాంతమైన అమరావతిలో సెక్షన్‌ 144ను, విశాఖ, తిరుపతి, అనంతపురం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ తదితర ప్రాంతాలలో సెక్షన్‌ 30ను విధించింది. ర్యాలీలు జరక్కుండా నిరోధించే ప్రయత్నం చేసింది. బలవంతంగా బస్సులు నడపాలని చూసిన అనంతపురం జిల్లాలో వామపక్షాల కార్యకర్తలు తిరగబడి బస్సు అద్దాలను పగులగొట్టారు. ఏలూరులో వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త మధ్యాహ్నపు ఈశ్వరిని, పలువురు వైఎస్సార్‌సీపీ, సీపీఐ నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. శ్రీకాకుళం జిల్లాలో అరెస్టయిన వారిలో రాజాం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, ఎచ్చెర్ల, టెక్కలి నియోజకవర్గాల సమన్వయకర్తలు గొర్లె కిరణ్‌కుమార్, పేరాడ తిలక్‌ ఉన్నారు. పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతిలను శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. మరోపక్క పోలీసులు తమ బాడీ కెమెరాలతో ర్యాలీలను చిత్రీకరించారు.   
 
ధర్మాగ్రహానికి తలొంచిన ప్రభుత్వం 

ఆంక్షలు, నిర్బంధాలతో బంద్‌ను ఆపాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ధర్మాగ్రహానికి తలొగ్గాల్సి వచ్చింది. రాష్ట్రానికి జరిగిన తీవ్ర అన్యాయాన్ని నిరసిస్తూ బంద్‌ జరుగుతుంటే జనం మధ్య ఉండాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుబాయ్‌ పర్యటనకు వెళ్లడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అదే సందర్భంలో బంద్‌ జయప్రదం కావడం, అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు రావడంతో ముఖ్యమంత్రి ఫ్లేట్‌ ఫిరాయించి బంద్‌కు సంఘీభావం ప్రకటించారు. ఆత్మగౌరవ పోరాటానికి ఆటంకాలు కల్పించవద్దంటూ పోలీసులకు హుకుం జారీ చేశారు. జనం సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామన్నారు. ఎంపీలు పార్లమెంటులో చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ర్యాలీలు జరపాలని తమ శ్రేణులకు పిలుపునిచ్చారు.

అయితే చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలను విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అంబేడ్కర్‌ విగ్రహాల ఎదుట ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్రదర్శనలు చేశాయి. కాగా, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బంద్‌ జయప్రదమైందని, ప్రజావాణి ఢిల్లీకి చేరిందని, ఇందుకు సహకరించిన రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, ప్రజలకు లెఫ్ట్‌ పార్టీలు కృతజ్ఞతలు తెలిపాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాయి. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు, రాజధానికి నిధులు వంటి అంశాల సాధనకు మున్ముందు కూడా కలిసి కట్టుగా పోరాటాలు చేద్దామని, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పని చేద్దామని పిలుపిచ్చాయి.  
 
ఆర్టీసీకి రూ.12.32 కోట్ల నష్టం 

బంద్‌ కారణంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ముందు జాగ్రత్తగా ఆర్టీసీ అధికారులు బస్సులు నిలిపివేశారు. సుమారు రూ.12.32 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. సరిహద్దు రాష్ట్రాల ప్రధాన నగరాలైన చెన్నై, బెంగుళూరుకు వెళ్లే బస్సులను ఆర్టీసీ నిలిపేసింది. భద్రతను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు రాష్ట్రాల నుంచి వస్తున్న బస్సులను పోలీసులు ఆపివేశారు. కాగా,  బంద్‌కు ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ మద్దతు ప్రకటించింది. దీంతో అన్ని జిల్లాల్లో లారీల ద్వారా సరుకు ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. అత్యవసర సరుకుల రవాణా మాత్రం కొనసాగింది.  

693 మంది అరెస్ట్‌ 
బంద్‌ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 693 మందిని అరెస్ట్‌ చేసి కేసులు నమోదు చేసినట్టు డీజీపీ ఎం.మాలకొండయ్య గురువారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. అక్కడక్కడ చిన్నపాటి ఇబ్బందులు తప్ప పెద్ద ఘటనలు నమోదు కాలేదన్నారు. అమరావతి ప్రాంతం అంతా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. వెలగపూడి చెక్‌పోస్ట్‌ వద్ద నుంచి సచివాలయం రెండో ప్రవేశ ద్వారం వరకు ప్రత్యేక బలగాలు మోహరించాయి.   

హోదా పోరులో అందరినీ కలుపుకుపోతాం: జగన్‌ 
బంద్‌కు మద్దతుగా తన ప్రజా సంకల్ప యాత్రకు విరామం ప్రకటించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలగుంటపల్లి సమీపంలోని తన శిబిరం వద్ద విద్యార్థులతో కలిసి ప్లకార్డులు పట్టుకుని ప్రత్యేక హోదా కావాలంటూ నినదించారు. హోదా పోరులో అందరినీ కలుపుకుపోతామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో సీఎం విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా,  సీపీఎం నాయకుడు పి.మధు విజయవాడలో, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కర్నూలులో ప్రదర్శన నిర్వహించారు. 

 
కడపలో.. 

Advertisement

తప్పక చదవండి

Advertisement