ఫలితాలొచ్చాయ్ | Sakshi
Sakshi News home page

ఫలితాలొచ్చాయ్

Published Wed, Jun 3 2015 1:05 AM

Andhra Pradesh HRD minister releases DSC results

 ఏలూరు సిటీ :డీఎస్సీ-14లో భాగంగా నిర్వహించిన టెట్ కమ్ టెర్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల మార్కుల వివరాలను ఏపీడీఎస్‌సీ.కామ్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. కేటగిరీ పోస్టులు, సబ్జెక్టుల వారీగా కటాఫ్ మార్కులు, పోస్టుల భర్తీకి కోసం చేపట్టే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తారని డీఈవో డి.మధుసూదనరావు చెప్పారు. పాఠశాలల పునఃప్రారంభమయ్యే నాటికే కౌన్సెలింగ్ పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. జిల్లాలో 662 పోస్టులు ఉండగా, 28వేల 761 మంది టెట్ కమ్ టెర్ట్ పరీక్షలు రాశారు. సబ్జెక్ట్‌ల వారీగా చూస్తే.. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో 17,193, స్కూల్ అసిస్టెంట్ భాషా పం డిట్ పోస్టులకు 4,608 మంది, భాషాపండిట్ పోస్టులకు 4,041 మంది, పీఈటీ పోస్టులకు 31మంది, ఎస్జీటీ పోస్టులకు 2,888 మంది పరీక్షలు రాశారు.
 
 టెట్ మార్కుల గందరగోళం
 డీఎస్సీ-14 పరీక్షలో ఫలితాలు విడుదలైనా టెట్ మార్కుల విషయంలో అభ్యర్థులు కొంత గందరగోళానికి గురవుతున్నారు. ప్రస్తుతం టెట్ కమ్ టెర్ట్ పరీక్ష నిర్వహించారు. గతంలో టీచర్ టెట్ రాసిన అభ్యర్థులకు ఆ పరీక్షలో అత్యధికంగా లభించిన మార్కుల ఆధారంగా వెయిటేజీ ఇవ్వగా, కొత్తగా టెట్ కమ్ టెర్ట్ పరీక్ష రాసిన అభ్యర్థులకు ఏ విధంగా మార్కులు ఇచ్చారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై డీఈవో మధుసూదనరావును వివరణ కోరగా.. గతంలో టెట్ రాసి, ఇప్పుడు టెట్ కమ్ టెర్ట్ రాసిన రాసిన అభ్యర్థులకు దేనిలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే వెయిటేజీగా ఇచ్చి ఉంటారని అభిప్రాయపడ్డారు.
 
  దీనిపై విద్యాశాఖ అధికారులకూ సరైన అవగాహన లేకపోవటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెట్ కమ్ టెర్ట్ పరీక్ష నిర్వహించిన దృష్ట్యా గతంలో టెట్ పరీక్ష మార్కులను వెయిటేజీగా ఇవ్వటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కటాఫ్ మార్కులు, కౌన్సెలింగ్ షెడ్యూల్, విధి విధానాలు ప్రకటిస్తే గానీ దీనిపై నెలకొన్న గందరగోళానికి తెరపడే అవకాశం లేదంటున్నారు.
 

Advertisement
Advertisement