నిరసన జ్వాల | Sakshi
Sakshi News home page

నిరసన జ్వాల

Published Sat, Dec 7 2013 3:24 AM

andhrapradesh seemandhra bandh successful

=జిల్లా అంతటా బంద్  
 =కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
 =ధర్నాలు, రాస్తారోకోలు
 =స్తంభించిన రాకపోకలు
 =తిరుమలకు మినహారుయింపు  
 =విభజనకు వ్యతిరేకంగా నినాదాలు

 
రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో జిల్లాలో బంద్ విజయవంతమయ్యింది. రాస్తారోకోలు, మోటార్‌సైకిల్ ర్యాలీలు, ధర్నాలతో జిల్లా దద్దరిల్లింది. జాతీయ రహదారుల్లో వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, బ్యాంకులు మూతపడ్డాయి.
 
సాక్షి, తిరుపతి : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  తిరుమల బైపాస్ రోడ్డులో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి నేతృత్వంలో రెండు గంటల  పాటు ధర్నా చేశారు. దీంతో రెండు వైపుల వాహనాల రాక పోకలు నిలచిపోయాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు వోవీ.రమణ, తదితరులు పాల్గొన్నారు. అలాగే సెంట్రల్ పార్క్ వద్ద  వైఎస్‌ఆర్ పార్టీ తిరుపతి కన్వీనర్ పాలగిరి ప్రతాపరెడ్డి, ఎస్‌కే.బాబు, దొడ్డారెడ్డి సిద్ధ్దారెడ్డి నాయకత్వంలో రాస్తారోకో జరిగింది. రెండు గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. అలాగే మోటార్‌సైకిల్, జీపు ర్యాలీ నిర్వహించారు.  

దుకాణాలను, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు.  నగరి నియోజకవర్గంలోని పుత్తూరు బైపాస్ రోడ్డులో పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. సత్యవేడు సమన్వయకర్త ఆదిమూలం, సురేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో టవర్ క్లాక్ సర్కిల్ వద్ద టైర్లు కాల్చి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. బంద్  సంపూర్ణంగా  జరిగింది.  పాకాల, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, రామచంద్రాపురం మండలాల్లో  మానవహారాలు, ధర్నా కార్యక్రమాలు మిన్నంటాయి.

ఈ కార్యక్రమాల్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు కోటాల చంద్రశేఖర్‌రెడ్డి, దామినేడు కేశవులు, ఉద్యోగ జేఏసీ నాయకుడు మధుసూదన్ పాల్గొన్నారు.  గుర్రంకొండలో మండల కన్వీనర్ ముక్తియార్‌ఆలీఖాన్ నాయకత్వంలో దుకాణాలు మూయించారు. రాస్తారోకో నిర్వహించారు.  పూతలపట్టులో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. బంగారుపాళెంలో సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు.

తవణంపల్లెలో సమన్వయకర్త పూర్ణం ఆధ్వర్యంలో వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఐరాలలో రవిప్రసాద్ ఆధ్వర్యంలో అగరంపల్లె రోడ్డుపై ధర్నా చేశారు. చిత్తూరులో సమన్వయకర్త ఏఎస్ మనోహర్ నాయకత్వంలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. సోనియా దిష్టిబొమ్మను దహనం  చేశారు. మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించి, ఆర్టీసీ బస్సులను డిపో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.  దుకాణాలు, వ్యాపార సంస్థలను మూయించారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి నాయకత్వంలో భారీ ర్యాలీ, మానవహారం కార్యక్రమం నిర్వహించారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌కుమార్ కదిరి రోడ్డును దిగ్బంధం చేశారు.

సమన్వయకర్త షమీమ్ అస్లాం నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించగా, మైనారిటీ నాయకుడు అక్తర్ అహ్మద్ బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. శ్రీకాళహస్తిలో పార్టీ తిరుపతి పార్లమెంటరీ పరిశీలకుడు వరప్రసాద్,  నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎద్దులకు సోనియా మాస్క్‌లు తగిలించి వినూత్న ర్యాలీ నిర్వహించారు.  ధర్నా, రాస్తారోకో నిర్వహించి, దుకాణాలను బంద్ చేయించారు.  కుప్పంలో పార్టీ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి నాయకత్వంలో బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు.  

ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించి విద్యాసంస్థలు, కార్యాలయాలు మూయించారు. శాంతిపురం, రామకుప్పం, గుడుపల్లెలో కూడా బంద్ జరిగింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకల చెరువులో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో బంద్ జరిగింది. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి నేతృత్వంలో ఉదయం ఆరు గంటల నుంచి చెన్నై-బెంగళూరు రహదారిని దిగ్బంధం చేశారు.

రోడ్డుపైనే షామియానా వేసి, వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. జేఏసీ నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యవేడులో పార్టీ నాయకుడు నిరంజన్‌రెడ్డి నాయకత్వంలో  దుకాణాలను మూయించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.  పుంగనూరులో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు రెడ్డెప్ప, నాగభూషణం, భాస్కర్ రెడ్డి, వరదారెడ్డి తదితరులు రోడ్లుపై బైఠాయించారు. టైర్లు కాల్చి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.  మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.  
 

Advertisement
Advertisement