అంగన్‌వాడీల దీక్ష | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల దీక్ష

Published Thu, Feb 13 2014 2:01 AM

Anganwadi indefinite  initiation in Eluru

ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీలు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి. బుధవారం నాటి దీక్షలను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డీఎన్‌వీడీ ప్రసాద్ ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం ఇందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. దీక్షలకు వైసీపీ దెందులూరు నియోజకవర్గ నాయకులు చలమోలు అశోక్‌గౌడ్, యూటీఎప్ నాయకుడు పీవీ నరసింహారావు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి సమైకాంధ్ర హీరో అనిపించుకోవాలని చూస్తున్నారే తప్ప అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించడం లేదని నరసింహారావు వివర్శించారు. ఈ కార్యక్రమానికి అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి.భారతి, సీఐటీయూ నాయకులు ఎ.శ్యామలారాణి , ఎస్.భగత్ తదితరులు నాయకత్వం వహించారు. 
 
 మద్దతుగా ఐద్వా నాయకుల దీక్ష
 అంగన్‌వాడీ కార్యకర్తలకు మద్దతుగా ఐద్వా నాయకులు ఒక్కరోజు రిలేనిరాహార దీక్షను కలెక్టరేట్ వద్ద బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి జి.విజయలక్ష్మి మాట్లాడుతూ  ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. విజయలక్ష్మితోపాటు జి.విమల, కె.నాగమణి, ఎస్‌కే సఫేరా బేగం, ఎ.రమణ, జి.మరియమ్మ, సీహెచ్ రాజ్యలక్ష్మి తదితరులు కార్యక్రమాన్ని  పర్యవేక్షించారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement