పాతగుంటూరు : 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.14,617.14 కోట్లతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విడుదల చేశారు. గుంటూరులోని ఎస్సీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి బ్యాంకర్లు, వివిధ ప్రభుత్వశాఖల అధికారుల సమావేశం జరిగింది. దీనికి మంత్రి ప్రత్తిపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటు పెంపునకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు.
గత ఆర్థిక సంవత్సరంలో రూ.12.491.43 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక ఉండగా 17.02 శాతం పెంపుతో ఈ వార్షిక ప్రణాళికను తయారు చేసినట్టుతెలిపారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 9182.54 కోట్లు, పారిశ్రామిక రంగానికి రూ.1704.39 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ.1729.17 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు.
ప్రాధాన్యేతర రంగాలకు రూ. 2001.14 కోట్లు కేటాయించామన్నారు. నిరుద్యోగ యువతకు చేయూతనివ్వాలని మ్రంతి బ్యాంకర్లను కోరారు. సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఆంధ్రాబ్యాంక్ డీజీఎం ఎల్. గిరీష్కుమార్, ఆర్బీఐ ఏజీఎం రాణారాహు, నాబార్డు ఏజీఎం డాక్టర్ ఏబీ భవానీశంకర్, ఎల్డీఎం శ్రీనివాసశాస్త్రి అధికారులు పాల్గొన్నారు.