ఇది సమైక్యాంధ్ర తొలి విజయం | Sakshi
Sakshi News home page

ఇది సమైక్యాంధ్ర తొలి విజయం

Published Fri, Jan 31 2014 1:50 AM

AP assembly rejects Telangana Bill,samaikyandhra First win APNO Association

 శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర శాసనసభలో టీ-నోట్‌ను మూజువాణీ ఓటుతో తిరస్కరించడం సమైక్యాంధ్ర ఉద్యమం తొలి విజయంగా ఏపీ ఎన్జీవో సంఘం సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు పేర్కొన్నారు. గురువారం ఎన్జీవో హోంలో సమైక్యాంధ్ర సాధన సమితి ప్రతినిధులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు టీ నోట్‌ను తిరస్కరించడంపై పురుషోత్తం నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 66 రోజుల ఉద్యోగుల సమ్మెకు ఫలితం దక్కిందని, సీమాంధ్ర ఉద్యోగుల, నాయకులు, విద్యార్థుల, వివిధ సంఘా ల విజయమని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని కోరారు. కొన్ని రాజకీయ పార్టీలు ముందుకు రాకపోవడం, కొందరు నాయకులు మాటలు మారుస్తున్నారన్నారు. 
 
 టీ నోట్ తిప్పిగొట్టిన తర్వాతైనా కొన్ని పార్టీలు తమ జెండా, అజెండా వీడి సమైక్య ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో సమైక్యవాదం వినిపించేందుకు సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులు ఏకతాటిపై నిలిచి ఇతర ప్రాంతాలకు చెందినవారిని, పార్టీలను కలుపుకుని కృషి చేయాలని కోరారు. ఇదే పంథాలో పార్లమెంట్‌లో బిల్లును ఓడించాలన్నారు. బీజేపీ కూడా సమైక్యాంధ్రకు సానుకూలంగా ఉందని, గతంలో ఆ పార్టీ అధినేతను కలిశామని, అసెంబ్లీలో బిల్లు ఓడిస్తే పార్లమెంట్‌లో ఓడించేందుకు కృషి చేస్తామని చెప్పారన్నారు. ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ఫిబ్రవరి 3న హైదరాబాద్‌లో జరగనున్న సమావేశంలో పార్లమెంట్‌లో బిల్లును అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
 
 ఇంకా ఉద్యం కొనసాగించాల్సి ఉందన్నారు. సీమాంధ్రవాసులు మరికొన్నాళ్లు అప్రమత్తంగా మెలగాలని కోరారు. ఫిబ్రవరి నెలలో అధిక సంఖ్యలో ఢిల్లీ వెళుతున్నామని, యూపీఏ ప్రభుత్వం తీరు మారే లా ఉద్యమం చేపట్టాల్సి ఉందన్నారు. ఈ సందర్బగా  ఆరు నెలల నుంచి ఉద్య మం చేస్తున్న ప్రజలను ఆయన అభినందించారు.  జామి భీమ శకంర్, దుప్పల వెంకటరావు, గీతా శ్రీకాంత్, వేణుగోపాల్ తదితరులు మాట్లాడారు. అంతకుముందు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో నర్సునాయుడు, శోభారాణి, బుక్కూరు ఉమామహేశ్వరరావు, కాయల శ్రీనివాసరావు, వై.జయరాం  పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement